దండేపల్లి, నవంబర్ 5 : చచోయ్ ఇట్ కోలారా.. దేనే దేనారా.. రేలా.. రేలా.. లాంటి ఆట పాటల నడుమ పద్మల్పురి కాకో ఆలయం వేదికగా దండారి ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరంలోని ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం పద్మల్పురి కాకో ఆలయంలో దండారి వేడుకలు ఆదివారం అంగరంగవైభవంగా నడుస్తున్నాయి.
మహారాష్ట్ర కిన్వట్ జిల్లా జవార్ల, ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం అట్నగడ, జైనూర్ మండలం బూసిమెట్ల, సిర్పూర్(యూ) మండలం దోబా నుంచే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన గిరిజనులు, మహిళలు సుమారు వెయ్యి మందికిపైగా ఆలయానికి చేరుకొని సంప్రదాయబద్ధంగా పూజలు చేశారు. దండారి ఉత్సవాల్లో భాగంగా రేలా.. రేలా.. అంటూ గుస్సాడి నృత్యాలు చేశారు. మహిళలు సంప్రదాయబద్ధంగా నృత్యాలతో సందడి చేశారు.
పద్మల్పురి కాకో ఆలయాన్ని దండారి ఉత్సవ వేదికగా ఆదివాసులు భావిస్తారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం గుస్సాడి నృత్యాలు ప్రారంభించి, దీపావళి వరకు తమ తమ గూడేల్లో జరిగే ఉత్సవాల్లో పాల్గొంటారు. దీపావళి రెండు రోజుల తరువాత కొలబోడి కార్యక్రమం తరువాత ఉత్సవాలను ముగిస్తారు.
దండారి ఉత్సవాల్లో భాగంగా పద్మల్పురి కాకోకు మహిళలు అతి పవిత్రతో నైవేద్యాలు తయారు చేశారు. పాయసంతో పాటు పెసలు, మి నుములు, బబ్బెర గారెలు, అలాగే దంచిన బి య్యంతో తయారు చేసిన అరిసెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం మేకలు, కోళ్లు బలిచ్చి ఆలయ సమీపంలో వంటలు చేసుకొని సామూహిక భోజనాలు చేశారు.
దండారి ఉత్సవాల కోసం ఆలయానికి చేరుకున్న భక్తులు ముందుగా గోదావరికి కాలినడకన చేరుకున్నారు. అక్కడ పుణ్య స్నానాలు చేసి, నదీ జలాలతో అమ్మవారికి పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. పుణ్యస్నానాల అనంతరం గోదావరి వద్ద పూజలు చేశారు.
ఆలయ ఆవరణలో గుస్సాడీ నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నెత్తిన నెమలి పించంతో తయారు చేసిన టోపి, కళ్లద్దాలు, భుజాన జింక తోలు, నడుము, కాళ్లకు గజ్జెలు ధరించి, చేతిలో కోల పట్టుకొని తప్పెట గూళ్ల వాయిద్యాలు, డప్పు చప్పుళ్లతో నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. గుస్సాడి నృత్యాలకు ముందు మహిళలు బొట్టు పెట్టి గుస్సాడీల ఆశీర్వాదం తీసుకున్నారు.
ఆలయ కమిటీ సభ్యులు, గుస్సాడీలు సాంప్రదాయబద్దంగా జెండాను ఆవిష్కరించి,ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం జెండా గద్దె వద్ద సాంప్రదాయబద్దంగా పూజలు చేశారు. ఈ నెల 8న గుస్సాడీ దర్బార్ నిర్వహిస్తామని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కుడిమెత సోము, సర్పంచ్ చిట్ల లింగవ్వ, మాజీ సర్పంచ్ చిట్ల మంజుభార్గవి, మాజీ ఎంపీటీసీ చిట్ల శ్రీనివాస్, నిర్వాహకులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, నవంబర్ 5 : ఇంద్రవెల్లి మండలంలోని ఆదివాసీ గూడేల్లో దండారీ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. సాలేగాడ గ్రామంలో గ్రామస్తులు ఏత్మాసూర్ దేవతకు ప్రతేక పూజలు నిర్వహించారు. వారం రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ మడావి భీంరావు, గ్రామ పెద్దలు మడావి ధర్ము, కోవ కాశీరాం, నైతం లక్ష్మణ్, గ్రామస్తులు పాల్గొన్నారు.