ఆదిలాబాద్/నిర్మల్, జనవరి 21(నమస్తే తెలంగాణ) : 2011 జనాభా లెక్కల ప్రకారం మంచిర్యాల జిల్లా జనాభా 8,07,037. ఇందులో ఎస్సీ జనాభా 2,13,575 కాగా.. బెల్లంపల్లి 60,864, చెన్నూర్ 75,394, మంచిర్యాల 62,877, జన్నారం(ఖానాపూర్) 14,440 మంది ఉన్నారు. ఎస్సీల గృహాలు 64,455 ఉండగా.. ఇందులో బెల్లంపల్లి 18,078, చెన్నూర్ 22,598, మంచిర్యాల 19,287, జన్నారం(ఖానాపూర్) 4,492 ఉన్నాయి. జిల్లాలో 313 దళితబంధు యూనిట్లకు 313 గ్రౌండింగ్ అయ్యాయి. ఇప్పటి వరకు రూ.31.30 కోట్లు లబ్ధిదారులకు చేరాయి. జిల్లాలోని మూడు(మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి) నియోజకవర్గాలతోపాటు నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలోని జన్నారం మండలానికి కలిపి 313(మూడు నియోజకవర్గాలకు 300, జన్నారం మండలానికి 13) యూనిట్లు మొదటి విడుత మంజూరవగా లబ్ధిదారులు వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో మొదటి విడుతగా 249 మంది లబ్ధిదారులకు అధికారులు యూనిట్లు పంపిణీ చేశారు. జిల్లా జనాభా 7,07,952 ఉండగా 99,422 (14.02 శాతం) షెడ్యూల్ కులాల(ఎస్సీ) జనాభా ఉంది. వీరికి ఉపాధిని మెరుగుపర్చడానికి ప్రభుత్వం దళితబంధు అమలు చేస్తున్నది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 100, బోథ్లో 100, ఖానాపూర్లో 26, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 23 కుటుంబాలకు యూనిట్లు పంపిణీ చేశారు. ఇందుకు ప్రభుత్వం రూ.24.90 కోట్లు ఖర్చు చేసింది. లబ్ధిదారులకు పశువులు, మేకలు, ట్రాక్టర్లు, కార్లు ఇతర యూనిట్లను అందించారు. సర్కారు అందించిన సాయంతో తమ ఉపాధిని మెరుగుపర్చుకున్నారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్ జిల్లావ్యాప్తంగా 2011 జనాభా లెక్కల ప్రకారం 7,09,418 మంది ఉండగా.. ఇందులో ఎస్సీ జనాభా 1,21,536(17.13 శాతం) మంది ఉన్నారు. ఇందులో నిర్మల్ నియోజకవర్గంలో 42,707, ముథోల్లో 56,357, ఖానాపూర్లో 22,472 మంది ఉన్నారు. ఎస్సీల గృహాలు 37,481 ఉండగా.. ఇందులో నిర్మల్లో 16,596, ముథోల్లో 16,973, ఖానాపూర్లో 6,912 ఉన్నాయి. దళితబంధు కింద మొదటి విడుత మంజూరైన యూనిట్లు 261 కాగా.. రూ26.10 కోట్లు కేటాయించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జనాభా 81,596. జిల్లాకు 177 యూనిట్లు మంజూరు కాగా.. అధికారులు పూర్తిస్థాయిలో అమలు చేశారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 77, సిర్పూర్-టీ నియోజకవర్గంలో 100 యూనిట్లను దళితులకు అందించారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దళితబంధు ద్వారా రూ.10 లక్షల చొప్పున రూ.17.70 కోట్లు అందించారు. యూనిట్లను పొందిన లబ్ధిదారులు వ్యాపారాలు పెట్టుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు. ప్రభుత్వం తాజాగా ప్రతి నియోజకవర్గానికి 500 మందికి అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా దళిత నిరుద్యోగ యువత పథకాన్ని పొందేందుకు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు.
ఆత్మగౌరవంతో బతికేలా..
మాది నిరుపేద కుటుంబం. మా పరిస్థితిని చూసిన విప్ సుమనన్న దళితబంధు కోసం దరఖాస్తు పెట్టుకోమన్నరు. రూ. 10 లక్షలు మంజూరయ్యాయి. ఇది వరకు ఫొటోగ్రఫీలో పనిచేసిన అనుభవం ఉంది. అందుకే హైదరాబాద్కు వెళ్లి కెమెరాతో పాటు డ్రోన్ తీసుకున్నా. బాల్క ఫొటోగ్రఫీ పేరిట అవుట్డోర్ ఫొటో స్టూడియో పెట్టుకున్నా. పెళ్లిళ్లతో పాటు ఇతర శుభకార్యాలకు వెళ్తుంటా. ఇది వరకు కెమెరా కొనుక్కుంట అంటే ఏ ఒక్కరూ కూడా అప్పు ఇవ్వలేదు. చాలా బాధపడేవాడిని. ఇప్పుడు సీఎంకేసీఆర్ చొరవతో ఎవ్వరికీ చేయి చాపకుండా ఆత్మగౌరవంతో బతికే భరోసా వచ్చింది. చేతినిండా పని దొరుకుతుంది. నా కుటుంబం, ముఖ్యమంత్రి కేసీఆర్, విప్ సుమనన్నకు రుణపడి ఉంటుంది.
– వడ్లకొండ రవి, దళితబంధు లబ్ధిదారుడు, కొమ్మెర
నాడు గల్ఫ్లో కూలీ..నేడు హార్వెస్టర్ యజమాని
సోన్ మండలం సాకెర గ్రామానికి చెందిన ద్యావత్ గంగాధర్ పదో తరగతి దాకా చదువుకున్నాడు. తండ్రి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఈ క్రమంలో ఇంటి పెద్దకొడుకైన గంగాధర్ (తమ్ముడు ఉన్నాడు) 2005లో ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టాడు. ఎనిమిదేళ్ల పాటు అక్కడే ఉంటూ చిన్నా చితకా పనులు చేశాడు. అయినప్పటికీ అప్పులు కూడా తీరలేదు. ఇక లాభం లేదనుకొని 2008లో తిరిగి ఇండియాకు వచ్చాడు. గుంట భూమి లేని గంగాధర్ చుట్టు పక్క గ్రామాల్లో పాలు సేకరించి నిర్మల్లో విక్రయించేవాడు. అరకొరగా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకురావడం భారం అయ్యింది. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ తెచ్చిన దళితబంధు పథకం ఈయనకు వరంలా మారింది. ఇదే గ్రామానికి చెందిన మరో లబ్ధిదారు మల్లవ్వ, గంగాధర్ కలిసి దళితబంధు కింద హార్వెస్టర్ (కోత యంత్రం)ను తీసుకున్నారు. గత వానకాలం సీజన్లో వరి, మక్క, సోయా పంటలను కోసి తొలిసారి ఆదాయాన్ని పొందారు. గంటకు రూ. 1600 చొప్పున తీసుకుంటున్నారు. మొన్నటి వరకు మల్లవ్వ బీడీలు చుడుతూ నెలకు రూ. 1000 నుంచి రూ. 1500 దాకా సంపాదించేది. సీఎం కేసీఆర్ సార్ దయవల్ల ఇప్పుడు రోజు వేలల్లో ఆదాయం వస్తున్నదని చెబుతున్నది. మల్లవ్వ ఇద్దరు కొడుకులు కూడా ఈ హార్వెస్టర్తో ఉపాధి పొందుతున్నారు.
భవిష్యత్కు భరోసానిచ్చిన కేసీఆర్కు రుణపడి ఉంటా
నేను ఎంబీఏ పూర్తి చేశాను. కొంతకాలం హైదరాబాద్లోని మార్కెటింగ్ ఫీల్డులో పనిచేశాను. నెలకు రూ. 24 వేల వేతనం వచ్చేది. మా అమ్మ ఆరోగ్యం బాగలేకపోవడంతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి మా ఊరికి వచ్చిన. ‘దళితబంధు’ కోసం దరఖాస్తు చేసుకున్న. రూ.10 లక్షలు మంజూరయ్యాయి. ఆ డబ్బులకు మరో రూ.2 లక్షలు కలుపుకొని రెబ్బెనలో ఫ్లెక్సీ ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్న. మా మండ లంలో ఇంతవరకు ఫ్లెక్సీ షాపు లేదు. మంచిగ నడుస్తుందని భావిస్తున్న. ఇప్పుడిప్పుడే బిజినెస్ పికప్ అవుతోంది. ఇక సర్కారు కొలువు కోసం ఎదురుచూడాల్సిన పని లేదు. ప్రైవేటు ఉద్యోగం చేసి ఎంత సంపాదించే వాడినో అంతకంటే ఎక్కువగానే లాభముం టుందని భావిస్తున్న. నా భవిష్యత్కు భరోసా నిచ్చిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటా.
– దుర్గం శ్రీకాంత్, దళితబంధు లబ్ధిదారుడు, పులికుంట, రెబ్బెన
దళితుల ఆర్థికాభివృద్ధికే..
దళితుల ఆర్థికాభివృద్ధి కోసమే ప్రభుత్వం ‘దళిత బంధు’ తీసుకొచ్చింది. లబ్ధిదారులు ఇష్టమొచ్చిన వ్యాపారం చేసుకునే వెసలు బాటు ఉంది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 313 యూనిట్లు మంజూరయ్యాయి. అన్ని కూడా గ్రౌండింగ్ పూర్తయ్యాయి. వ్యవసాయ అనుబంధ, మ్యానిఫ్యాక్చరింగ్ అండ్ ఇండస్ట్రీ, ట్రాన్స్ఫోర్టు సెక్టారు, సర్వీసెస్ అండ్ సఫ్లయిస్ సెక్టార్, రిటైల్ దుకాణాలను ఏర్పాటు చేసుకొని లబ్ధిపొందుతున్నారు. ప్రభుత్వం రూ. 10 లక్షల సాయం అందిస్తున్నది. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. కాబట్టి వచ్చే ఆదాయమంతా వారి కుటుంబానికే. వ్యక్తిగత, గ్రూపు యూనిట్లు పొందిన వారంతా వాటిని సక్రమంగా ఉపయోగించుకోవాలి. లబ్ధిదారులందరూ యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలోనే రెండో విడుత అర్హుల ఎంపిక ఉంటుంది.
– దుర్గా ప్రసాద్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ
దళితబంధుతో ధర్జాగా బతుకుతున్న
నాకు భార్య, కొడుకు ఉన్నారు. ఇది వరకు ఆర్టు దుకాణంలో పనిచేసేటోన్ని. వాళ్లు అంతంత మాత్రమే జీతం ఇచ్చేటోళ్లు. అవ్వి ఎటూ సరిపోయేటివి కావు. కుటుంబా న్ని పోషించుకోవడానికి మస్తు తిప్పలయ్యేది. పాణం బాగాలే కుంటే అప్పులు చేయాల్సి వచ్చేది. ఎట్ల బతుకుడో.. ఏమో అని మస్తు రంది పడేటోన్ని. దళితబంధు కోసం దరఖాస్తు చేసుకుంటే ట్రాక్టర్ ఇచ్చిన్రు. ఇప్పుడు ఎవ్వరి కింద పని చేస్తలేను. సొంతంగా ట్రాక్టర్ నడిపించుకుంటున్న. ఏ కిరాయి వచ్చినా పోతున్న. ఇప్పుడు ఎవ్వరికి చేయి చాపకుండా ధర్జాగా బతుకుతున్న. దళితబంధు మా బతుకులకు భరోసా ఇచ్చింది. ఇందుకు సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటా.
– ముల్కల్ల చిన్నయ్య, రంగపేట
వరంలా దళిత బంధు..
నిర్మల్ జిల్లా బాసర మండలం సాలాపూర్ సూరెల్లి గ్రామానికి చెందిన బట్టొల్ల రాములు-జయశీల దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కొడుకులు రవీంద్ర, సిద్దార్థ్, కూతురు లిఖిత. సిద్ధార్థ్ ఐదో తరగతి చదువుతున్నాడు. లిఖిత మూడో తరగతి, రవీంద్ర ఇంటి వద్దే తల్లిదండ్రులతో ఉంటాడు. రాములుకు ఊర్లోనే 6 ఎకరాల భూమి ఉంది. దాంట్లోనే వ్యవసాయం చేసుకుంటూ ముగ్గురిని పోషించడం భారంగా మారింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దళిత బంధు ఆ కుటుంబానికి వరంలా మారింది. ట్రాక్టర్ మంజూరైంది. ఇటు వ్యవసాయ పనులు చేసుకుంటూనే.. అటు ట్రాక్టర్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నాడు. మా బతుకులకు భరోసానిచ్చిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని రాములు-జయశీల చెబుతున్నారు.
రోజుకి రూ.2 వేలు సంపాదిస్తున్నం
మాది కుభీర్ మండలం వర్ని. బతుకుదెరువు కోసం నర్సాపూర్(జీ)లో ఉంటున్నం. నా భర్త సాయినాథ్ పాలేరుగా పని జేసేటోడు. నేను కూలీ పనులకు పోయేదాన్ని. దళితబంధు కోసం దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేసిన్రు. రూ.10 లక్షలతో కిరాణం, ప్యాసెంజర్ ఆటో తీసుకున్నం. మా ఊరు చాలా చిన్నది. నర్సాపూర్లోనే ఉంటూ కిరాణం నడిపిస్తున్న. నా భర్త ఆటో నడుపుతున్నడు. ప్రతి రోజూ ఇద్దరం కలిసి రూ.1500 నుంచి రూ.2 వేల దాకా సంపాదిస్తున్నం. దళిత బంధు పథకం మా తల రాతను మార్చేసింది. – ఫులే సుశీల, వర్ని