బోథ్, జనవరి 4: హరితహారంలో నాటేందు కు మండలంలో మొక్కల పెంపకం చేపడుతున్నారు. మండలంలోని 33 పంచాయతీల్లో నర్సరీలను ఏర్పాటు చేశారు. 3.63 లక్షల మొక్కలు అందుబాటులో ఉండేలా పెంపకం చేపట్టారు. బోథ్ మండలంలోని 33 జీపీల పరిధిలో రాబోయే హరిత హారం కోసం మొక్కల పెంపకాన్ని చేపట్టారు. ఒక్కో నర్సరీల్లో 11 వేల చొప్పున మొక్కలు పెంచేందుకు అనువుగా బెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. సుదూర ప్రాంతం నుంచి ఎర్రమట్టి తీసుకు వచ్చి శుభ్రం చేసిన మట్టిని పాలిథిన్ కవర్లలో నింపుతున్నారు. ఒక్కో నర్సరీ ల్లో నిత్యం 15 నుంచి 20 మంది కూలీలు పనులు చేపడుతున్నారు. బ్యాగ్ ఫిల్లింగ్ పనులు పూర్తి కాగానే ఒక్కో బెడ్లో వెయ్యి మొక్కలు పెంచేలా 11 బెడ్లు ఏర్పాటు చేయిస్తున్నారు. మరో వారంలో బెడ్లు పూర్తయిన చోట కవర్లలో విత్తనాలు వేసేందుకు సిద్ధం చేయిస్తున్నారు. ఒక్కో నర్సరీలో రూ. 1.20 లక్షల అంచనా వ్యయంతో మొక్కల పెంపకం చేయిస్తున్నారు. ప్రతీ జీపీలో నాటేందుకు వీలుగా పూల మొక్క లు, షోకేజ్ మొక్కలు, గుల్మోర్, సీమ చింత, సీతాఫలం, చైనా బాదాం వంటి జాతుల మొక్కల పెం పకం చేపడుతున్నారు. ఉపాధి హామీ పథకం ఏపీవో జగ్దేరావు, ఎంపీడీవో లక్ష్మణ్, ఎంపీవో జీవన్రెడ్డిలు జీపీలు తిరుగుతూ కూలీలకు పెంపకంపై సూచనలు అందిస్తున్నారు. జూలై మొదటి వారంలో నిర్వహించే హరిత హారం కోసం మొక్క లు నాటేందుకు వీలుగా పెంపకం చేయిస్తున్నారు.
పని దొరుకుతున్నది
హరితహారం నర్సరీతో రోజూ కూలీ పని దొరుకుతున్నది. నిత్యం రూ 257 వరకు కూలి పడుతున్నది. ప్రసుత్తం వ్యవసాయ పనులు తగ్గడంతో కూలీలం ఉపాధి పనులకు వెళుతున్నాం. గత కొన్నేళ్లుగా నర్సరీ పనులు చేసిన అనుభవం ఉండడంతో ఈ పనులకు వస్తున్నాం.
– కొమ్ము సరిత, ఉపాధి కూలీ, సూర్యనగర్
రోజూ రూ .257 కూలి పడుతున్నది
నర్సరీలో పనులకు వెళుతుండడంతో రోజూ రూ. 257 కూలి పడుతున్నది. బయట వ్యవసాయ పనులకు వెళితే అంత కూలీ పడడం లేదు. అందుకే మేము ఉపాధి పనులకు వస్తున్నాం. బ్యాగ్ పిల్లింగ్, బెడ్లు ఏర్పాటు చేయడం వంటి పనుల అనుభవంతో ఈ పనులు చేస్తున్నాం
– కుందూర్ అనిత, ఉపాధి కూలీ, సూర్యనగర్