సూర్యాపేట, జూలై 17 : కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలతో పాటు యువతను అన్ని విధాలా మోసం చేసిందని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులు, యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శనివారం హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఉదయం 11 గంటలకు జరిగే యువ సంగ్రామ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. యువత ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించే యువ సంగ్రామ సభను ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తే కోర్టు అనుమతి ఇచ్చిందన్నారు.
ఆచరణకు సాధ్యం కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిలువునా ముంచిందన్నారు. యువతపై ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలన్నారు. యువత ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రేపు హైదరాబాడ్ సరూర్నగర్ స్టేడియంలో జరిగే యువ సంగ్రామ సభకు నిరుద్యోగులు, యువత అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.