ఆదిలాబాద్, మే 2 (నమస్తే తెలంగాణ) :ఆదిలాబాద్ జిల్లా వానకాలం సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ యేడాది 5.66 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నట్లు అంచనా వేశారు. అధికంగా పత్తి 3.57 లక్షల ఎకరాలు, సోయా 1.32 లక్షలు, కంది 66 వేల ఎకరాల్లో వేయనున్నట్లు వెల్లడించారు. విత్తనాలు అందుబాటులో ఉంచడమే కాకుండా.. 90 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని గుర్తించారు. ఈ మేరకు అధికారులు కొరత లేకుండా నిల్వలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రభుత్వం రైతు సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. ఫలితంగా జిల్లాలో వ్యవసాయం పండుగలా మారింది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఏటా పంటల సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. జిల్లాలో వానకాలంలో సాధారణ సాగు విస్తీర్ణం 5.26 లక్షల ఎకరాలు కాగా ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో రైతులు ఈ సీజన్లో 5.66 లక్షల ఎకరాలకు పెరిగింది. జిల్లాలో సాధారణం కంటే అదనంగా 40 వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, పంటల కొనుగోళ్లు రైతులకు వరంగా మారాయి. సర్కారు అందిస్తున్న సాయంతో రైతులు వానకాలం, యాసంగి పంటలను సాగు చేస్తూ లాభాలు పొందుతున్నారు. జిల్లాలో వివిధ పంటల సాగుకు అనుకూలమైన నల్లరేగడి భూములు ఉండడంతో రైతులు ఎక్కువగా పత్తి, కంది, సోయాబిన్ పంటలను పండిస్తారు. ఈ ఏడాది ఈ పంటలకు మద్దతు ధర కంటే ఎక్కువ ధరలు లభించాయి.
5.66 లక్షల ఎకరాల్లో సాగు
జిల్లాలో ఏటా వానకాలం సీజన్ జూన్లో ప్రారంభమై డిసెంబర్ వరకు కొనసాగుతుంది. గతేడాది వానకాలం సీజన్లో 5.66 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలను సాగు చేయగా ఈ సంవత్సరం కూడా అంతే విస్తీర్ణంలో పంటలు సాగువుతాయని అధికారులు అంచనా వేశారు. ఎక్కువగా పత్తి 3.57 లక్షల ఎకరాల్లో సోయాబీన్ 1.32 లక్షల ఎకరాలు, కంది 66 వేల ఎకరాలు, జొన్న 2643 ఎకరాలు, వరి 1677 ఎకరాలు, మినుములు 816 ఎకరాలు, పెసర 741 ఎకరాలు, 4535 ఎకరాల్లో ఇతర పంటలు పండించనున్నట్లు సూచించారు. ఈ సీజన్లో పంటల సాగులో భాగంగా 90 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని గుర్తించిన అధికారులు కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ర్యాక్ల ద్వారా ఎరువులు జిల్లాకు చేరుతుండగా గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. యూరియా, డీఏపీ, ఎంవోపీ, కాంప్లెక్ ఎరువులను నెలల వారీగా రైతులకు దుకాణాల ద్వారా పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 1.50 లక్షల మంది రైతులు ఈ సీజన్లో పంటలు సాగు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 101 వ్యవసాయ క్లస్టర్లలోని రైతు వేదికల్లో పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తుమన్నారు.
రైతులకు సకాలంలో విత్తనాలు, ఎరువులు
జిల్లాలో వానకాలం పం టల సాగు ప్రణాళికను త యారు చేశాం. 5.66 లక్షల ఎకరాల్లో రైతులు వివిధ పంటలు సాగు చేయనున్నారు. సీజన్ ప్రారంభానికి 15 రోజుల ముందుగా రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తాం. ప్రస్తుతం ఎరువులు విక్రయాలు సాగుతున్నాయి. ఎరువుల కొరత లేకుండా ర్యాక్లు వచ్చేలా చర్యలు తీసుకుంటు న్నాం. రైతులకు అవసరమైన విత్తనాలు పంపిణీ కోసం కంపెనీలతో చర్చించాం. త్వరలో డీలర్లతో సమావేశమై నాణ్యమైన విత్తనాలు పంపిణీ అయ్యే లా చూస్తాం. రైతులు భూమిలో 60 శాతం తేమ ఉన్నప్పుడు విత్తనాలు వేయాలి. తొందరపడి వేస్తే నష్టపోయే ప్రమాదం ఉంది.
డీ పుల్లయ్య. జిల్లా వ్యవసాయ అధికారి, ఆదిలాబాద్