బోథ్, మే 13 : నువ్వుల సాగు రైతుల ఇంట సిరులు కురిపిస్తున్నది. ఆశించిన స్థాయిలో దిగుబడి రావడంతో పాటు మార్కెట్లో మంచి ధర పలుకుతుండడంతో ఆయా కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. బోథ్ మండలంలో యాసంగిలో 286 ఎకరాల్లో నువ్వుల పంట జనవరిలో వేశారు. ఐదు తడుల నీటిని అందించారు. ప్రస్తుతం కోతలు మొదలు పెట్టారు. విత్తనాలు, ఎరువులు, కలుపు నివారణ, పురుగుల మందు పిచికారి, కోతలు, దులపడం (మెదలు కొట్టడం) వంటి వాటి కోసం ఎకరానికి రూ.8 వేల నుంచి రూ. 10 వేల వరకు ఖర్చు చేశారు. నేలను బట్టి ఎకరానికి 2 నుంచి 4 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో నువ్వులను బట్టి క్వింటాలుకు రూ. 10 వేల నుంచి రూ. 12 వేల వరకు ధర పలుకుతుంది. ఈ లెక్కన ఎకరానికి రూ 20 వేల నుంచి రూ. 40 వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆరెకరాల్లో వేసిన..
ఆరెకరాల్లో నువ్వు పంట సాగు చేసిన. దుక్కులు, ఎరువులు, విత్తనాలు, కలుపు నివారణ, కోతలవంటి వాటి కోసం రూ.80 వేల నుంచి రూ. లక్ష వరకు పెట్టుబడికి ఖర్చు చేసిన. ఇప్పుడే పంట కోస్తున్న. ఎకరానికి 3 నుంచి 4 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న ధరతో రూ. 2 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశముంది.
-జాదవ్ విక్రమ్, రైతు, నారాయణ్పూర్
మొదటి సారి వేసిన..
మొదటిసారి మూడెకరాల్లో నువ్వుల పంట వేసిన. పంట మంచిగుంది. ప్రసుత్తం కోసి కట్టలు కడుతున్నం. ప్రస్తుతం మార్కెట్లో పలుకుతున్న ధరతో పోల్చి చూసుకుంటే మంచి లాభమే వచ్చేటట్లు ఉంది. వానకాలంలో వర్షాలతో సోయా పంట కొంచెం దెబ్బతిన్నది. యాసంగిలో సాగు చేస్తున్న నువ్వు పంటతో నష్టాన్ని పూడ్చుకునే అవకాశం కలిగింది.
-మడావి దేవిదాస్, రైతు, మందబొగుడ