నిర్మల్ జిల్లాలో పంటల లెక్క పక్కాగా నమోదవుతున్నది. మద్దతు ధర, మార్కెటింగ్ సదుపాయం కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర సర్కారు సాగు వివరాలు సేకరించాలని ఆదేశించగా, వ్యవసాయశాఖ ఆగస్టు 18 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు సర్వే నిర్వహించింది. మొత్తం 79 క్లస్టర్ల పరిధిలో 4 లక్షల 10 వేల ఎకరాల్లో వివిధ రకాలు సాగవుతాయని అంచనా వేయగా, ఇప్పటి వరకు 4,03,018 ఎకరాల్లో సాగు చేసినట్లు గుర్తించింది. గతేడాది కంటే పత్తి సాగు కాస్త తగ్గగా, వరి, సోయాబీన్కే రైతాంగం మొగ్గు చూపింది. రైతుబంధు యాప్లో వివరాలు అప్లోడ్ చేస్తుండగా, దాదాపు ప్రక్రియ పూర్తికావచ్చింది.
నిర్మల్, సెప్టెంబర్ 8(నమస్తే తెలంగాణ) : పంటలకు మద్దతు ధర, మార్కెటింగ్ సదుపాయం కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సాగు వివరాల సేకరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా సర్వే నంబర్ల వారీగా పంటల వివరాలను సేకరించాలని ప్రభుత్వం వ్యవసాయశాఖను ఆదేశించింది. దీంతో వ్యవసాయ శాఖ క్షేత్ర స్థాయిలో సర్వే పూర్తి చేసింది. జిల్లాలోని మొత్తం 79 క్లస్టర్ల పరిధిలోని ఏఈవోలు ఆగస్టు 18 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు పంటల నమోదుపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిర్మల్ జిల్లా పరిధిలో ఈ వానకాలంలో 4,03,018 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో వరి 1,24,688 ఎకరాలు, మొక్కజొన్న 22,855, పత్తి 1,31,590, సోయాబీన్ 1,14,492, మినుములు 324, పెసలు 138, కంది 8,931 ఎకరాల్లో సాగు చేశారు. గతేడాదితో పోల్చితే ఈసారి సోయాబీన్ పంట సాగుకు రైతులు ఎక్కువగా మొగ్గు చూపారు. గతేడాది ఇదే సీజన్లో 82 వేల ఎకరాల్లో సోయాబీన్ పంట వేయగా, ఈసారి లక్షా 14వేల ఎకరాలకు పైగా సోయాబీన్ వేశారు. అలాగే పత్తి సాగు గతేడాది కంటే కాస్త తగ్గింది. గత వానకాలం సీజన్లో పత్తి 1,61,999 ఎకరాల్లో సాగు చేయగా, ఈసారి 1,31,590 ఎకరాల్లో వేశారు. కాగా ఇప్పటి వరకు నమోదైన వివరాల ప్రకారం వరి పంట సాగు కాస్త పెరిగింది. గతేడాది వానకాలంలో 1,17,847 ఎకరాల్లో వరి సాగు చేయగా, ఈ సారి 1,24,688 ఎకరాల్లో వేశారు. కాగా జిల్లా వ్యాప్తంగా ఈ వానకాలంలో 4,10,000 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేయగా, ఇప్పటి వరకు 4,03,018 ఎకరాల్లో సాగు చేశారు. వచ్చే వారం పది రోజుల్లో కడెం మండలంలోని దస్తూరాబాద్, కడెం, భుట్టాపూర్ తదితర గ్రామాల్లో సుమారు 6 వేల ఎకరాల్లో వరి వేసేందుకు రైతులు తమ భూములను సిద్ధం చేశారని అధికారులు చెబుతున్నారు.
79 క్లస్టర్ల పరిధిలో వివరాల నమోదు
నిర్మల్ జిల్లా పరిధిలోని 19 మండలాల్లో 79 ఏఈవో క్లస్టర్లు ఉన్నాయి. ప్రతీ క్లస్టర్లో 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని ప్రభుత్వం నియమించింది. దీంతో జిల్లా వ్యాప్తంగా 79 క్లస్టర్లలో ప్రతి రోజూ పంటల సాగు వివరాలను నమోదు చేశారు. వానకాలం ప్రారంభం నుంచి ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారన్నది ఏఈవోలు ఇప్పటికే నమోదు చేశారు. అంతేకాకుండా ప్రతీ సర్వే నంబర్లోని సబ్ డివిజన్లలో రైతు పేరు, భూమి విస్తీర్ణం, ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగు చేసిన వివరాలు పక్కాగా సేకరించారు. ఇలా సేకరించిన వివరాలను రైతుబంధు ఆన్లైన్ యాప్లో ఏఈవోలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నారు.
పూర్తి సమాచారంతో ప్రణాళిక
వానకాలం సీజన్లో ఏ ప్రాంతంలో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగయ్యాయి.. వాటి దిగుబడి ఎంత వస్తుందనేది పక్కాగా అంచనా వేసేందుకు ఈ పంటల సాగు వివరాల సేకరణ ఉపయోగపడనున్నది. ఫలానా పంట ఎంత మొత్తంలో ఉత్పత్తి అవుతుందని తెలుసుకోవడంతో పాటు సంబంధిత వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించడం, కొనుగోలు కోసం ప్రణాళికలు సిద్ధం చేయడానికి ఈ వివరాల సేకరణ దోహదపడుతుంది. అందుకనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం, అవసరమైన మేరకు గన్నీ బ్యాగులు తెప్పించడం వంటివి చేయడానికి ఈ వివరాల సేకరణ చాలా ఉపయోగకరంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
ఆదిలాబాద్ జిల్లాల్లో..
ఆదిలాబాద్ జిల్లా 5,03,973 ఎకరాల్లో పంటలు సాగవుతున్నట్లు సర్వేలో గుర్తించారు. ఇందులో పత్తి 3,92,572, సోయాబీన్ 57,218,కంది 54,183 ఎకరాల్లో సాగవుతున్నట్లు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.
నమోదు ప్రక్రియ పూర్తయ్యింది
వానకాలం సీజన్లో జిల్లా వ్యాప్తంగా రైతులు వేసిన పంటల వివరాలను దాదాపుగా సేకరించాం. కొన్ని గ్రామాల్లో వరి నాట్లు వేయాల్సి ఉంది. పంటల వివరాలను ఆన్లైన్ పోర్టల్లో ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నాం. ఈ ప్రక్రియ తుదిదశకు చేరింది. రాబోయే రోజుల్లో ఇప్పుడు సేకరించిన వివరాల ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి, నిర్మల్