మంచిర్యాల అర్బన్, అక్టోబర్ 14 : రాష్ట్ర వ్యవసాయ శాఖ క్రాప్ బుకింగ్ పేరిట పంటల సర్వేకు జూలైలో శ్రీకారం చుట్టగా, ఈ నెల మొదటి వారంలో 100 శాతం పూర్తయింది. అధికారులు ప్రతి రైతు పొలం వద్దకు వెళ్లి ఫొటోలు తీసి.. అక్కడి నుంచే మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో పంట, విత్తన రకం, సర్వే నంబర్, సాగు విస్తీర్ణం, అంతర పంట, సాగునీటి వసతి తదితర వివరాలు నమోదు చేశారు. పంటల సాగు వివరాల నమోదులో తప్పులు, పంటలకు సోకుతున్న తెగుళ్లను సకాలంలో గుర్తించలేకపోవడం, పంటలు దిగుబడికి వచ్చాక రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకే వ్యవసాయ శాఖ యేటా ఈ సర్వే ద్వారా వివరాలు సేకరిస్తూ ఆన్లైన్లో నమోదు చేస్తున్నది.
జిల్లాలోని 55 క్లస్టర్ల ద్వారా సర్వే..
బెల్లంపల్లి, భీమిని, చెన్నూర్, మంచిర్యాల వ్యవసాయ రెవెన్యూ డివిజన్లలోని 18 మండలాల్లో 55 క్లస్టర్ల పరిధిలో వ్యవసాయ విస్తరణ అధికారులు సర్వే చేసి.. ఫొ టోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ప్రస్తుతం వాటిని ఆయా మండలాల అధికారులు ఒక్కో గ్రామం లో 20 సర్వే నంబర్లను రాన్డమ్గా సర్వే చేస్తూ న్నారు. సెల్ఫీ దిగి ఆ సర్వే నంబర్లో ఏఈవోలు నమోదు చేసింది సరియైనదేనా! కాదా! అని పరిశీలిస్తున్నారు. ఇలా ఏడీఏ, డీఏవోలు కూడా రాన్డమ్గా వారంలో ఒక గ్రామంలో కొన్ని సర్వే నంబర్లను సందర్శించి సాగు చేసిన పంటల వివరాలు కచ్చితమైనవే నమోదు చేశారా! లేదా! అని పరిశీలిస్తున్నారు. స్పాట్ వద్ద పంట కనబడేలా సెల్ఫీ దిగి ఆ వివరాలను అప్లోడ్ చేస్తున్నారు.
జిల్లాలో 3.18 లక్షల ఎకరాల్లో పంటలు సాగు..
జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 3,22,656 ఎకరాలు కాగా, 3,18,455.37 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. ఇందులో వరి 1,57,588 ఎకరాల్లో, పత్తి 1,57,828.06 ఎకరాల్లో, జొన్న 2.31 ఎకరాలు, మక్క 237.15 ఎకరాలు, స్వీట్ కార్న్ 0.37 ఎకరాలు, పొద్దు తిరుగుడు 7.20 ఎకరాలు, సోయాబీన్ 39.29 ఎకరాలు, అనుములు 4.39 ఎకరాలు, మినుములు 3.29 ఎకరాలు, బబ్బెర 12.01 ఎకరాలు, పెసర 45.02 ఎకరాలు, ఉలవలు 0.06 ఎకరాలు, కందులు 2,391.30 ఎకరాల్లో సాగవుతున్నాయి. వీటితో పాటు పశువుల మేత పంటలుగా మేత జొన్న 23.05 ఎకరాలు, నాపియర్ 15.02 ఎకరాలు, పారాగ్రాస్ 6.29 ఎకరాల్లో సాగవుతున్నాయి.
సాగు సర్వే పూర్తి
జిల్లాలో 2022-23 వానకాలం పంటల సాగు సర్వే పూర్తయింది. క్షేత్ర స్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారు(ఏఈవో)లతో సర్వే నిర్వహించాం. ప్రస్తుతం పంటల నమోదు కోసం ఆయా మండల వ్యవసాయాధికారులతో, ఏడీఏలతో సర్వే చేయిస్తున్నాం. నేను కూడా క్రాస్ వెరిఫికేషన్ చేస్తున్నాను. పంటల నమోదులో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఉండేందుకు, వ్యత్యాసం రాకుండా ఉండేందుకే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పరిశీలిస్తున్నాం. ఈ సర్వే ద్వారా రైతులు సాగు చేసిన పంటలను అమ్మే సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.
– కల్పన, జిల్లా వ్యవసాయాధికారి, మంచిర్యాల