నిర్మల్ జిల్లాలో ఇటీవల ఏకధాటిగా కురిసిన వర్షాలు అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు రంగంలోకి దిగారు. గ్రామాల్లో పంట నష్టంపై వివరాలు సేకరించారు. దాదాపు 34,748 ఎకరాల్లో నష్టం జరగగా, ఇందులో అత్యధికంగా 17,011 ఎకరాల్లో పత్తి పంట దెబ్బతిన్న ట్లు గుర్తించారు. దీంతో పాటు 9832 ఎకరాల్లో భూమి కోతకు గురికాగా, 5763 ఎకరాల్లో ఇసుకమేటలు వేసినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పూర్తి రిపోర్టు సిద్ధమయ్యాక, ప్రభుత్వానికి అందజేస్తామని చెప్పారు.
నిర్మల్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జిల్లాలో పెద్ద మొత్తంలో పంట దెబ్బతిన్నది. దీంతో అన్నదాతకు తీరని నష్టం మిగిలింది. దాదాపు 15 రోజుల పాటు కురిసిన వానతో నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 34,748 ఎకరాల్లో నష్టం వాటిల్లిందని వ్యవసాయశాఖ జిల్లా అధికార యంత్రాంగం ప్రాథమికంగా అంచనా వేసింది. ఈ సీజన్లో ప్రధానంగా పత్తి, సోయా, మక్క, వరి, పప్పుదినుసుల పంటలకు నష్టం జరిగినట్లు గుర్తించింది.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 18 మండలాల్లో 18,041 మంది రైతులకు చెందిన వివిధ రకాల పంటలకు (34,748 ఎకరాల్లో) నష్టం జరిగింది. అత్యధికంగా 17,011 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లగా, సోయా 12,666 ఎకరాలు, వరి 717, పసుపు 1022, మక్క 2,068 ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. అలాగే కంది 1234 ఎకరాలు, 30 ఎకరాల్లో మిరప పంటకు ఈ భారీ వర్షాల వల్ల నష్టం వాటిల్లింది. అలాగే జిల్లా వ్యాప్తంగా 5,182 మంది రైతులకు చెందిన 9,832 ఎకరాల భూములు కోతకు గురయ్యాయి. మరో 2,716 మంది రైతుల 5,763 ఎకరాల పంట పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. పంట నష్టంపై వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. ఏవోలు, ఏఈవోలతో పాటు ఉద్యానవనశాఖ అధికారులు పూర్తిస్థాయిలో నష్టాన్ని అంచనా వేసి, నివేదిక రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. కాగా, పంట నష్టం అంచనాను అధికారులు మూడు రకాలుగా (పంటలు నీట మునగడం, భూములు కోతకు గురవడం, పంటల్లోకి ఇసుక దిబ్బలు కొట్టుకురావడం..) ఇలా మూడు రకాలుగా విభజించారు. ఇప్పటికే ప్రాథమిక అంచనా వేసిన అధికారులు.. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి ఏ రైతు ఏ పంట వేశారు.., ఎన్ని ఎకరాల్లో నష్టం వాటిల్లిందని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
34,748 ఎకరాల్లో పంట నష్టం..
భారీ వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం 34,748 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. కొన్ని చోట్ల పంటలు నీట మునగగా, మరికొన్ని చోట్ల పంట పొలాల్లో ఇసుక మేటలు వేసింది. అలాగే చాలా చోట్ల భూములు కోతకు గురయ్యాయి. మండలాల వారీగా పంటనష్టం వివరాలు ఇలా ఉన్నాయి. లక్ష్మణచాంద మండలంలో 617 ఎకరాలు, నార్సాపూర్(జీ) 675, నిర్మల్ 275, సారంగాపూర్ 2,377, దిలావర్పూర్ 160, సోన్ 2,230, మామడ 1,928, ఖానాపూర్ 383, పెంబి 2,700, కడెం 924, దస్తూరాబాద్ మండలంలో 100 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. అలాగే భైంసా మండలంలో 7,924, కుంటాల 4,115, కుభీర్ 2,205, లోకేశ్వరం 1,590, తానూర్ 5,477, ముథోల్ 488, బాసర్ మండలంలో 580 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అధికారులు గుర్తించారు.
ప్రాథమిక అంచనా పూర్తయ్యింది..
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జిల్లాలో 34,748 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించాం. జరిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో పర్యటించి, త్వరలోనే పూర్తిస్థాయి నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపిస్తాం. ముఖ్యంగా జిల్లాలో పత్తి, సోయ, కంది, మక్క పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. ఏ పంటలు ఎన్ని ఎకరాల్లో దెబ్బతిన్నాయి, మొదలగు వివరాలను ఏవోలు, ఏఈవోలు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు.
– అంజిప్రసాద్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి, నిర్మల్