ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా త్వరలో పత్తి కొనుగోళ్లు ప్రారంభంకానుండగా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా పంటను సేకరించనున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేయనున్నారు. రైతుల వేలిముద్రల ఆధారంగా ఆధార్ ధ్రువీకరణతో సంబంధిత రైతుల వివరాలు తెలుస్తాయి. దీంతో దళారుల దందాకు చెక్ పడడమే కాకుండా అసలైన రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు చేరుతాయి. ఈ విధానంపై అధికారులు గ్రామాల్లోని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు ఆధార్ వేలి ముద్రలను నిర్ధారించుకోవాలని సూచిస్తున్నారు.
– ఆదిలాబాద్, అక్టోబర్ 16(నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, అక్టోబర్ 16 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది వానకాలం సీజన్లో 3.85 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగుచేశారు. 25 లక్షల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు అందుకు తగ్గట్లుగా కొనుగోళ్లకు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో 10 మార్కెట్ యార్డుల ద్వారా పత్తి కొనుగోళ్లు ఈ నెల చివరివారంలో ప్రారంభం కానున్నాయి. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సమగ్ర పంటల సర్వే నిర్వహించి పంటల సాగు వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ఈ ఏడాది నుంచి కొనుగోళ్లను ఆధార్ అనుసంధానంతో నిర్వహించాలని సీసీఐ సూచనల మేరకు అధికారులు బయోమెట్రిక్ విధానం అమలు చేయడానికి మార్కెటింగ్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామాల్లోని రైతు వేదికల్లో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు రైతులకు బయోమెట్రిక్ విధానంపై అవగాహన కల్పిస్తున్నారు. రైతులు తమ ఆధార్ అంథంటికేషన్ను చేయించుకోవాలని సూచిస్తున్నారు.
పత్తిని విక్రయించడానికి మార్కెట్యార్డుకు వచ్చిన రైతులు ఆధార్ను సరిచూసేందుకు అధికారులు బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. వేలిముద్రలు పడని రైతుల ఐరిస్, ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా అసలైన రైతులను గుర్తిస్తారు. బయోమెట్రిక్, ఐరిష్, ఫేస్ రికగ్నైజేషన్ రాకపోతే వన్ టైం పాస్వర్డ్ (ఓటీపీ) ద్వారా కొనుగోళ్లు చేస్తారు. సమగ్ర పంటల సర్వే ఆన్లైన్లో ఉండడంతో రైతులకు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. పత్తి అమ్మకానికి వచ్చిన రైతులు వేలిముద్రలు వేయగానే ఆధార్ అథంటికేషన్ ద్వారా ఆ రైతు వివరాలు వస్తాయి. రైతు పేరు, పంట సాగు విస్తీర్ణం, దిగుబడి వివరాలు ఉంటాయి. దీని ప్రకారం పంటను కొనుగోలు చేస్తారు.
ఇంతకంటే ఎక్కువ వస్తే పంటను తీసుకోరు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల పంట కొనుగోళ్లకు సంబంధించిన వివరాలు నమోదు చేయగానే, ఆధార్ అనుసంధానంతో ఉన్న రైతుల బ్యాంకు ఖాతా వివరాలు సైతం నమోదవుతాయి. దీంతో అమ్మిన పంటకు సంబంధించిన డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమవుతాయి. ఈ విధానం వల్ల అసలైన రైతులు మాత్రమే పంట ను విక్రయించి మద్దతు ధరను పొందుతారు. దళారులు గ్రామాల్లోని రైతుల నుంచి తక్కువ ధరకు పంటను కొనుగోలు చేసి మార్కెట్యార్డుల్లో మ ద్దతు ధరకు విక్రయించే అవకాశం ఉండదు. ఆధార్ అనుసంధానంతో ఇకనుంచి మరింత పారదర్శకమైన పంట కొనుగోళ్లు జరుగుతాయని అధికారులు పేర్కొంటున్నారు.