మంచిర్యాల టౌన్, జూన్ 7 : రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) నేషనల్ వైస్ ప్రెసిడెంట్ వేముల సత్యమూర్తి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ సిరాజ్ ఉర్ రహమాన్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ల సమస్యల పరిష్కారం, పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో నిర్ణయం తీసుకోవడం కోసం ఈనెల 18న హైదరాబాద్లో తలపెట్టిన మహాసభ సన్నాహక సమావేశాన్ని ఆదివారం మంచిర్యాలలో నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదని, కార్పొరేట్ కాంట్రాక్టు సంస్థలకు మాత్రం బిల్లుల చెల్లింపులు సమయానుకూలంగా జరుగుతున్నాయని అన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లులు ఉండగానే మళ్లీ కొత్త పనులను టెండర్లు పిలుస్తున్నారని, ఇప్పటికే చాలా పనులకు ఈ డీడీలు కట్టి ఉన్నామని, డబ్బులు లేక పనులను చేయలేని పరిస్థితులు దాపురించాయని, కాంట్రాక్టర్లపై అధిక ఆర్థిక భారంతో పనులు చేయలేని స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లింపుల్లో ఆలస్యం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మానసిక వేదనకు గురై చాలా మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని వారు పేర్కొన్నారు.
కాంట్రాక్టర్ల హక్కులను కాపాడేందుకు, సమస్యల శాశ్వత పరిష్కారానికి ఈనెల 18న హైదరాబాద్లో మహాసభను నిర్వహించడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్లర్లంతా ఈ సభకు హాజరుకావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సన్నాహక సమావేశంలో బీఏఐ మాజీ స్టేట్ చైర్మన్లు బి. సుగుణాకర్రావు, కటుకూరి దేవేందర్రెడ్డి, యు సురేందర్రావు, స్టేట్ అడ్వైజర్ కె ప్రభాకర్రెడ్డి, ఆదిలాబాద్ పాస్ట్ చైర్మన్ రామారావు, రవీందర్రావు, వంరంగల్ సెంటర్ చైర్మన్ మనోజ్, కరీంనగర్ సెంటర్ చైర్మన్ జితేందర్రావు, జనగామ చైర్మన్ వంశీకృష్ణ పాల్గొన్నారు.