కొత్తగూడెం సింగరేణి / శ్రీరాంపూర్, జూన్ 20: సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్కు ఎన్టీపీసీ (నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్)కు మధ్య దక్షిణ భారత స్థాయిలో సోమవారం బొగ్గు సరఫరాకు సంబంధించి నాలుగు కీలక ఒప్పందాలు జరిగాయి. హైదరాబాద్ సింగరేణి భవన్లో సీఎండీ శ్రీధర్ ఆదేశాల మేరకు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ జే అల్విన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కీలక ఒప్పందాలపై సింగరేణి జనరల్ మేనేజర్ మార్కెటింగ్ కే సూర్యనారాయణ, ఎన్టీపీసీ సౌత్ అండ్ వెస్ట్రన్ రీజినల్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ దేబశిష్ చటోపాధ్యాయ సంతకాలు చేశారు. ఎన్టీపీసీ వారు కర్ణాటక రాష్ట్రంలో నిర్వహిస్తున్న కుడిగీ 1600 (2X800) మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి సింగరేణి సంస్థ ఏడాదికి 67.5 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేసేందుకు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం తక్షణమే అమలులోకి వస్తుంది. ఎన్టీపీసీ మహారాష్ట్రలోని షోలాపూర్ వద్ద నిర్మిస్తున్న 660 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రానికి గతంలో బొగ్గు సరఫరా ఒప్పందాన్ని పెంచుతూ ఏడాదికి 28.2 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేయడానికి మరో ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాలు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆదేశం మేరకు జరిపినట్లు సింగరేణి అధికారులు వెల్లడించారు.
సాధారణంగా వినియోగదారులు బొగ్గును స్వీకరించిన తర్వాత దానికి సంబంధించిన చెల్లింపులు చేస్తుంటారు. ఈ ఒప్పందంలో ఎన్టీపీసీ రామగుండంలోని తమ ప్లాంట్ సరఫరా చేసే బొగ్గుకు ముందుగా అడ్వాన్స్ చెల్లింపులకు అంగీకరిస్తూ సింగరేణిలో మరో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎన్టీపీసీ వారు ఈ ప్లాంట్కు ప్రతినెలా సుమారు 85 నుంచి 90 లక్షల టన్నుల బొగ్గు స్వీకరిస్తుంటారు. ఇరుపక్షాలకు లాభదాయకంగా ఈ ఒ ప్పందం ఉంటుందని అధికారులు వెల్లడించా రు. నాల్గో ఒప్పందం ప్రకారం.. ఎన్టీపీసీ సంస్థ సింగరేణి నుంచి కొనుగోలు చేస్తున్న మొత్తం 207.7 లక్షల టన్నుల బొగ్గును తాను నిర్వహిస్తున్న మూడు ప్లాంట్లలో అక్కడి అవసరాన్ని బట్టి ఏ ప్లాంట్కైనా స్వీకరించడానికి లేదా మళ్లించడానికి అవకాశం కల్పిస్తూ అంగీకారం కుదిరింది. ఈ కార్యక్రమంలో సింగరేణి నుంచి ఏజీఎం మార్కెటింగ్ ఎన్ రాజశేఖర్రావు, టీ శ్రీనివాస్, డీజీఎం కోల్ మూమెంట్ సంజయ్, డీజీఎం మార్కెటింగ్ సురేంద్ర రాజు, అడిషన ల్ మేనేజర్ మహేందర్రెడ్డి, ఎన్టీపీసీ నుంచి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ఫ్యూయల్ మేనేజ్మెంట్ ప్రదీప్ కుమార్ మిశ్రా పాల్గొన్నారు.