ఆదిలాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ టికెట్ల పంచాయితీ కొనసాగుతున్నది. ఎన్నో ఏండ్లుగా పార్టీ జెండా మోస్తూ టికెట్లు దక్కని నాయకులు తమ నిరసన గళం వినిపిస్తున్నారు. ఇప్పటికే సీనియర్లు ఆదిలాబాద్, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల్లో అధిష్టానంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పెద్దలు అభ్యర్థులను మార్చుకోకపోతే రెబల్స్గా పోటీ చేస్తామని సంకేతాలు పంపారు. అధిష్టానం డబ్బులకు ఆశపడి ప్యారాచూట్లకు టికెట్లు ఇచ్చిందని, వారిని ఓడగొడుతామంటూ హెచ్చరిస్తున్నారు.
ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ టికెట్ను అధిష్టానం అమ్ముకున్నది. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన వారిని పక్కన పెట్టి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు కేటాయించారు. అధిష్టానం నిర్ణయాన్ని నేను వ్యతిరేకిస్తున్నా. ప్రజల్లో ఉన్న సీనియర్లను కాదని ఓడిపోయే వ్యక్తికి టికెట్ ఇచ్చారు. కంది శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలకు కనీస గౌరవం ఇవ్వకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. జిల్లా నాయకులను అల్లిగాడు, మల్లిగాడు అని సంబోధించే వ్యక్తికి ఎలా మద్దతు ఇవ్వాలి. ఎన్ఆర్ఐగా ఉంటూ పార్టీ టికెట్ కోసం బీజేపీలో చేరిన ఆయన, అక్కడ టికెట్ రాదని తెలుసుకొని కాంగ్రెస్లో చేరారు. డబ్బులు పోసి టికెట్ కొనుగోలు చేశారు. కష్టకాలంలో జెండా మోసిన తనతో పాటు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సుజాత, సీనియర్ నాయకులు సంజీవరెడ్డిని అధిష్టానం కనీసం గుర్తించలేదు.
– సాజిద్ఖాన్, డీసీసీ అధ్యక్షుడు, ఆదిలాబాద్
కాంగ్రెస్ పార్టీలో మహిళలకు గౌరవం లేదు. టికెట్ల పంపిణీ విషయంలో తీవ్ర అన్యాయం జరిగింది. ఖానాపూర్, ఆసిఫాబాద్ ఎస్టీ నియోజకవర్గాల్లో మహిళలకు టికెట్ ఇవ్వలేదు. పార్టీ మహిళలపై చిన్నచూపు చూస్తున్నది. సొంత పార్టీలో మహిళలను పట్టించుకునే కాంగ్రెస్ అధిష్టానం, ఇతర పార్టీల్లో మహిళల గురించి ఎలా మాట్లాడుతారు. కాంగ్రెస్ పార్టీలో 15 ఏండ్లుగా సేవ చేస్తున్నా. కష్టకాలంలో పార్టీ జెండాను మోశాను. గతంలో ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్గా నన్ను ప్రకటించి, అభ్యర్థులు గెలువడానికి ఆర్థికంగా సాయం చేశాను. పార్టీ కార్యక్రమాలు చేస్తూ, ప్రజల సమస్యలు పరిష్కారించాను. ప్యారాచూట్ నేతలకు, డబ్బుల మూటలు ఇచ్చిన వారికి టికెట్లు ఇచ్చారు. పార్టీలో గెలిచే అభ్యర్థులను పక్కనపెట్టి ఓడిపోయే వారికి కాంగ్రెస్ అధిష్టానం టికెట్లు ఇచ్చింది. ఆదిలాబాద్లో కంది శ్రీనివాస్రెడ్డి, ఆసిఫాబాద్లో శ్యాం నాయక్, బోథ్, ముథోల్ నియోజకవర్గాల విషయంలో ఇదే జరిగింది. దీంతో బలంగా ఉన్న పార్టీ బలహీనంగా మారిపోయింది.
– చారులత రాథోడ్, ఉట్నూర్ జడ్పీటీసీ