నిర్మల్, జనవరి 2(నమస్తే తెలంగాణ) : దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపిన ‘దళితబంధు’ పథకంపై నీలినీడ లు కమ్ముకున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం అర్హులైన ఒక్కో దళిత కుటుంబానికి రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేసింది. కేసీఆర్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయవద్దని ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో దళితబంధు పథకాన్ని ప్ర స్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందా? లేదా? అనే దా నిపై నీలినీడలు కమ్ముకున్నాయి. కాగా.. పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేస్తున్నదనే ప్రచారం జోరుగా సాగుతుండడంతో రెండో విడుత కింద ఎంపికైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కొనసాగించాలని డిమాండ్లు వస్తున్నప్పటికీ, పథకం కొనసాగింపుపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటన చేయలేదు.
రెండో విడుతలో మంజూరైన నిధులు వెనక్కేనా..!
మొదటి విడుతలో ఎంపికైన లబ్ధిదారులు తమకు నచ్చిన యూనిట్లను తీసుకొని వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. రెండో విడుత ప్రక్రియను ప్రారంభించిన సమయంలోనే ఎన్నికల షెడ్యూల్ రావడంతో పంపిణీ ప్రక్రియ నిలిచింది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా రెండో విడుత కింద 198 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. మూడు దశల్లో ఆర్థిక సాయాన్ని అందజేయాలని కేసీఆర్ ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా మొదటి దశలో ఒక్కో లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో రూ.3 లక్షల చొప్పున జమ చేసేందుకు రూ.29.16 కోట్లను విడుదల చేసింది. ఇదే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు వేసే ప్రక్రియ ఆగింది. కాగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేసేందుకు సానుకూలంగా లేదనే ఊహాగానాలు ఉన్నాయి. దీంతో విడుదలైన రూ.29.16 కోట్ల వినియోగంపై అధికారులకు స్పష్టత లేకుండా పోయింది.
తొలి విడుతలో 261 మందికి..
కేసీఆర్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత మొదటి విడుతలో నియోజకవర్గానికి 100 మంది చొప్పున.. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 261 మంది లబ్ధిదారులకు పథకాన్ని వర్తింపజేసింది. లబ్ధిదారులు హార్వెస్టర్లు, జేసీబీ యంత్రాలు, ఫర్టిలైజర్, కిరాణ, ఫొటోగ్రఫీ దుకాణాలు, ఆయిల్ మిల్, టెంట్ హౌస్, డెయిరీ ఫాం, గొర్రెల యూనిట్లు తీసుకున్నారు. ఒకవేళ లబ్ధిదారులు వ్యాపారాల్లో నష్టపోతే.. వారికి ఆర్థికంగా ఉండేందుకు రూ.52.20 లక్షల రక్షణ నిధిని అధికారులు జమ చేశారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కేసీఆర్ సర్కారు దళితబంధు పథకంలో భాగంగా జిల్లాలోని సిర్పూర్, ఆసిఫాబాద్ నియోకవర్గాల్లో 200 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికీ రూ. 10 లక్షల చొప్పున మంజూరు చేసింది. లబ్ధిదారులు తమకిష్టమైన వ్యాపారం చేసుకుంటూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు. ఇక మరో విడుతలో నియోజకవర్గానికి 500 మందికి చొప్పున సాయమందించేందుకు అర్జీలను స్వీకరించింది. రెండు నియోజకవర్గాల నుంచి 1000 మందిని ఎంపిక చేసే క్రమంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా, ఈ పథకం అమలవుతుందా.. లేదా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఈ పథకం కొనసాగింపుపై స్పష్టత ఇవ్వాలని దళితులు కోరుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు..
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రెండో విడుత దళితబంధు పథకాన్ని వర్తింప జేసేందుకు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 198 మంది లబ్ధిదారులను ఎంపిక చేశాం. వీరికి మొదటి దశలో కింద రూ.29.16 కోట్లను విడుదల చేసింది. ఇంతలోనే ఎన్నికల షెడ్యూల్ రావడంతో పథకాన్ని నిలిపివేశాం. దళితబంధు కొనసాగింపుపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ముందుకు వెళ్తాం.
– హన్మాండ్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, నిర్మల్.