చుక్కలనంటిన కూరగాయలు, నిత్యావసర ధరలు
గుదిబండగా గ్యాస్ మొద్దు
కాగుతున్న నూనెలు
విలవిలలాడుతున్న వినియోగదారులు
ఇట్లయితే బతుకుడెట్లా అంటూ ఆవేదన
కేంద్రం చర్యలపై మండిపాటు
కేంద్ర సర్కారు తీరుతో సామాన్యుడి ఇంట ధరల మంట మండుతున్నది. పెట్రోల్, డీజిల్ రేట్లు అమాంతం పెంచగా, వాటి ప్రభావం నిత్యావసరాల మీద పడింది. కూరగాయలు, సరుకుల ధరలు చుక్కలనంటగా ప్రజానీకం బెంబేలెత్తిపోతున్నది. ఉప్పు.. పప్పు.. నూనెలు మొదలుకొని గ్యాస్ మొద్దు వరకూ భారం కాగా, బతుకుడెట్లా అంటూ నీరసించి పోతున్నది. మరోవైపు కరోనా నేపథ్యంలో అనేక మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోగా, ప్రస్తుత పరిస్థితులు సగటు మనిషి జీవనాన్ని మరింత కృంగదీస్తున్నాయి.
మంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 20, నమస్తే తెలంగాణ : పెట్రోల్, డీజిల్ ధరలు.. కూరగాయలు, నిత్యావసర సరుకుల రేట్ల పెరుగుదలకు కారణమయ్యాయి. ఒక్కసారిగా పెట్రోల్(రూ.122.01, డీజిల్ (రూ.107.28) ధరలు పెరుగడం ఆందోళన కలిగిస్తున్నది. గ్యాస్ సిలిండర్ ధర రూ. వెయ్యి దాటింది. కూరగాయల ధరలకు రెక్కలు వచ్చాయి. మార్కెట్లో టమాట ధర కిలోకు రూ. 100 పలుకుతున్నది. బెండ, దొండ కాయలు కిలోకు రూ. 60 నుంచి రూ. 70 చొప్పున లభిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు కిలోల్లో కొన్న కూరగాయలను ప్రస్తుతం పావుకిలో, అరకిలోతో సరిపెట్టుకుంటున్నారు.
ఆకాశాన్నంటిన ధరలు..
మోదీ సర్కారు పాలనలో ధరలు మోత మోగిస్తున్నాయి. సగటు కుటుంబం ఖర్చులు అమాంతం పెరిగిపో యాయి. కేంద్ర ప్రభుత్వం ఇష్టారీతిన ధరలు పెంచుతూ సామాన్య జనంపై భారం మోపుతున్నది. గ్యాస్, ఇంధన ధరల పెంపు ప్రభావం నిత్యావసర వస్తువులపై పడుతున్నది. నూనె లీటరు రూ.80 నుంచి రూ. 200కు, వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.700 నుంచి 1,050కి చేరింది. పప్పు, ఉప్పు, బియ్యం, మాంసం, పాలు, చేపలు, పండ్లు, గుడ్లు వంటి వాటి ధరలు అమాంతం పెరిగాయి. సాధారణంగా ప్రతి వంటలో వినియోగించే టమాట ధర కొండెక్కింది. మార్కెట్లో కిలో టమాట ధర రూ. 100 పలుతున్నది. ఓ వైపు ధరలు ఆకాశాన్నంటుతుంటే సామాన్యుడి ఆదాయంలో మాత్రం మార్పు రాలేదు. పైగా కరోనా నేపథ్యంలో చాలా మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయారు. చిన్నాచితకా వ్యాపారాలు మూత పడ్డాయి. గడిచిన పదేండ్లలో పెట్రో ధరలు రెట్టింపు కావడంతో పాటు ఆహార పదార్థాల ఖర్చు కూడా పరుగులు తీస్తున్నది. ప్రస్తుతం సగటు మనిషి బతుకు దుర్భరమైపోయింది.
వంటనూనెలు సలసల..
వంట నూనెల ధర మార్కెట్లో సలసల కాగుతున్నది. నిత్యావసర వస్తువుల్లో అత్యంత కీలకమైన వంటనూనెల ధరలకు అమాంతం రెక్కలు వచ్చాయి. సామాన్యులు, మధ్యతరగతి వారు ఎక్కువగా వినియోగించే పామాయిల్ ధర విపరీతంగా పెరిగిపోయింది. రోడ్డు పక్కన తినుబండారాలను తయారు చేసి విక్రయించే చిరు వ్యాపారులు పప్పులు, నూనెల ధరలు పెరిగిపోవడంతో పూర్తిగా నష్టపోతున్నారు.
హోటళ్లపైనా ప్రభావం..
గతంలో గ్రామాల్లో, కొన్ని పట్టణాల్లోనూ వంట కోసం, చిన్నపాటి హోటళ్లలో కట్టెలపొయ్యిని వాడేవారు. కట్టెల కొరత తీవ్రంగా ఉండడం, అందుబాటులో లేకపోవడంతో సిలిండర్ వాడకం అలవాటుగా మారింది. పల్లెల్లో సైతం ఇప్పుడు వంటల కోసం గ్యాస్ బండనే వినియోగిస్తున్నారు. కొవిడ్ నేపథ్యంలో ఉపాధి లభించక, తప్పని పరిస్థితుల్లో కూలీకి వెళ్లినా వచ్చిన డబ్బులతో నిత్యావసర వస్తువులు కొనడం గగనంగా మారింది. ఇప్పుడు రెండు నెలలకోసారి గ్యాస్ సిలిండర్ను తీసుకోవాలంటే వినియోగదారులు జంకుతున్నారు. ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ఇబ్బడిముబ్బడిగా గ్యాస్, ఇంధన ధరలు పెంచుతూ కేంద్రం తమ నడ్డివిరుస్తున్నదని పేదలు ఆవేదన చెందుతున్నారు.
కరోనాతో ఏడాదిగా ఉపాధి లేక విలవిలలాడుతున్న సామాన్య ప్రజలకు కేంద్రం ధరలమీద ధరలు పెంచుతూ షాక్ ఇస్తున్నది. పేదోడికి అండగా ఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరుసగా ధరలు పెరుగుతుండడంతో దీని ప్రభావం టీ స్టాళ్ల దగ్గరి నుంచి టిఫిన్, భోజన హోటళ్లపైనా తీవ్రంగా పడుతున్నది. టిఫిన్ ధర కూడా తప్పనిస్థితిలో పెంచాల్సి వస్తున్నది. చిరువ్యాపారులు టీ నుంచి భోజనాల వరకు ధరలు పెంచడం లేదంటే ఐటమ్స్ (వస్తువులు) తగ్గించడం వంటివి చేస్తున్నారు. ధరలు పెంచడంతో గిరాకీ తగ్గి గిట్టుబాటు కావడంలేదని చిరువ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా, మంచిర్యాల జిల్లాలో 2.41 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు, 22 ఏజెన్సీలు ఉన్నాయి.
ధరలు తగ్గించాలి
నేను ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచే స్తున్న. జీతం అంతంతే. ప్రస్తుతం పెరిగిన ధరలతో కుటుం బం గడవడం కష్టంగా ఉంది. గత నెలలో కిలోకు రూ. 25 నుంచి రూ. 30 వరకు ఉన్న కూరగాయల ధరలు ప్రస్తు తం డబుల్ అయినయ్. ఇలా అయితే సామాన్యుడు బతక డం కష్టమవుతుంది. పేదలను దృష్టిలో పెట్టుకొని ధరలు తగ్గించాలి. – నాగన్న, కాంట్రాక్ట్ డ్రాయింగ్ టీచర్, చెన్నూర్
గిట్లయితే బతుకుడెట్ల..?
మా ఊరిలో నాకింత భూమి ఉంది. ఎవుసం చేసుకుంట. ఎండాకాలంల ఏ పని దొరికితే గా పనికే పోత. రోజుకు రూ. 400 దాకా దొరుకుతయి. ఒక్కోసారి గా పని కూడా దొరకదు. ఉత్త చేతుల్తో ఇంటికి వచ్చుడైతది. ఉప్పు, పప్పు, నూనెలు, కూరగాయల ధరలు మస్తు పెరిగినయ్. ఏది కొందామన్నా ధైర్యమస్తలేదు. పొద్దంతా కష్టపడితే వచ్చే పైసలు ఎటూ సరిపోతలేవు. నా ఎరుకల గింతగనం ధరలు ఎప్పుడూ పెరుగలే. గిప్పుడే గిట్లుంటే.. మున్ముందు ఎట్లుంటదోనని మస్తు భయమైతంది. ఇగ గిట్లయితే మాలాంటోళ్లు బతుకుడు కష్టమే. –ఆలం బాబాజీ, ఇప్పల గూడ (బెజ్జూర్)