ఆసిఫాబాద్,మార్చి 18 : లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణు, ఎస్పీ సురేశ్కుమార్, డీఎఫ్వో నీరజ్ టెబ్రివాల్తో కలిసి నోడల్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జిల్లాలో 001-సిర్పూర్లో 320 పోలింగ్ కేంద్రాలు, 005-ఆసిఫాబాద్లో 356 పోలింగ్ కేంద్రాలు, అలాగే సహాయక పోలింగ్ కేంద్రాలు మొత్తంగా 676 ఏర్పాటు చేశామని, బూత్ స్థాయి అధికారులు, సూపర్ వైజర్లను నియమించామని తెలిపారు.
జిల్లాలో 2 లక్షల 26 వేల 994 మంది పురుషులు, 2 లక్షల 28 వేల 415 మంది మహిళలు, 28 మంది ట్రాన్స్ జెండర్లు, 404 సర్వీస్ ఓటర్లు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులు 5 వేల 556 మంది, 6 వేల 931 మంది దివ్యాంగులు ఉన్నారని చెప్పుకొచ్చారు. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాలో 9 స్టాటిక్ సర్వైలైన్స్ టీంలు, 8 ఫ్లయింగ్ స్వాడ్ బృందాలు, 9 వీడియో సర్వైలైన్స్ టీంలు, 2 వీడియో పరిశీలన బృందాలు, 8 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బృందాలు, 2 అకౌంటింగ్ బృందాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్, జిల్లా గ్రీవెన్స్ కమిటీ, మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఎన్నికల నిబంధనల మేరకు వివిధ రాజకీయ పార్టీలు, నాయకులకు సంబంధించిన హోర్డింగులు, ఫొటోలు, వాల్ రైటింగ్స్…ఇతరత్రా తొలగించడం జరుగుతుందని తెలిపారు. శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించి నివేదికలను ప్రతి రోజూ సమర్పించే విధంగా జిల్లాలో వ్యవస్థ ఏర్పాటు చేయాలన్నారు. అలసత్వం వహించకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించారు.
ఎన్నికల సంబంధిత ఫిర్యాదులపై స్పందించాలని, మద్యం, నగదు, కానుకల పంపిణీపై ప్రత్యేక నిఘా పెట్టాలని, రాజకీయ పార్టీలకు సంబంధించిన ఖర్చులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. కలెక్టరేట్లో 1950 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, సీ-విజిల్ యాప్ ద్వారా అందిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రానికి రాలేని దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ఇంటి వద్దనే ఓటు హకు వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.