ఆసిఫాబాద్,మార్చి 30 : లోక్ సభ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ నుంచి అంబేదర్ చౌక్ వరకు స్వీప్ ఆక్టివిటీస్లో భాగంగా చేపట్టిన 5కే రన్ కార్యక్రమాన్ని జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి ప్రారంభించారు. అంబేద్కర్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ భారత పౌరులకు రాజ్యాంగం కల్పించిన ఓటు హకు ఎంతో విలువైనదన్నారు. ఓటును సక్రమంగా వినియోగించుకొని అభివృద్ధికి పాటుపడే నాయకత్వాన్ని ఎన్నుకోవాలని సూచించారు.
పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కళాజాత ప్రదర్శన, ఇంటింటి ప్రచారం విస్తృతంగా నిర్వహించాలన్నారు. ఏప్రిల్ 1, 2024 తేదీని ప్రామాణికంగా తీసుకొని 18 ఏళ్లు నిండిన వారంతా 15వ తేదీలోగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్లయితే టోల్ ఫ్రీ నం.1950, సీ-విజిల్ యాప్లో ఫిర్యాదు చేయాలన్నారు. అనంతరం ఓటుపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ సదయ్య, డీఆర్డీవో సురేందర్, నోడల్ అధికారులు, జిల్లా అధికారులు, యువతీ యువకులు, విద్యార్థిని, విద్యార్థులు, అధికారులు పాల్గొన్నారు.
జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శనివారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ దాసరి వేణు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి తారామణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ రావు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ నరసింహారావుతో కలిసి సహకార, ఐకేపీ, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, రైస్ మిల్లర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో 37 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, వేసవి దృష్ట్యా రైతులకు తాగునీరు, నీడ సౌకర్యం, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలన్నారు. వరి ధాన్యం కొనుగోలుకు అవసరమైనన్ని గన్ని సంచులతో పాటు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని తెలిపారు.
రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేటప్పుడు తప్ప, తాలు, మట్టి గడ్డలు, తేమ శాతం ఇతరత్రా అంశాలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున జాగ్రత్తగా వ్యవహరించాలని తెలిపారు. ధాన్యం రవాణా సమయంలో ఎగుమతి, దిగుమతుల కోసం అవసరమైన హమాలీలను అందుబాటులో ఉంచాలని, తరలింపు ప్రక్రియ వేగవంతంగా జరిగేలా అధికారులు, రైస్ మిల్లుల యజమానులు సమన్వయంతో వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు, వ్యవసాయ, విస్తరణ, సహకార శాఖల అధికారులు, ఐకేపీ అధికారులు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.