కాగజ్నగర్, మార్చి 21:పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్, పోలీసు, నోడల్ అధికారులకు విధులపై పూర్తి అవగాహన ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకటేశ్ దోత్రే అన్నారు. కాగజ్నగర్ మండలం వంజీరి రైతు వేదికలో గురువారం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సిర్పూర్ నియోజకవర్గంలో 320, ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సెక్టోరల్ అధికారులకు పోలింగ్ కేంద్రాలు కేటాయించామన్నారు. సెక్టోరల్ అధికారులకు అందించిన రూట్ మ్యాప్ ప్రకారం విధులు నిర్వహించాలని ఆదేశించారు. ప్రీ పోల్, పోల్, పోస్ట్ పోల్ విడుతలుగా ఎన్నికలు నిర్వహిస్తారన్నారు. పోలింగ్ ప్రారంభానికి ముందు మాక్ పోల్ నిర్వహించాలని సూచించారు. మాక్ పోల్ నిర్వహించడానికి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయాలన్నారు. పోలింగ్కు ముందు రోజు ప్రతి సెక్టోరల్ అధికారి తన పరిధిలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఆయా ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో కేటాయించిన ఎన్నికల సామగ్రి టేబుళ్ల అమరిక, పోలింగ్ కేంద్రాలకు వచ్చే ప్రజలకు సౌకర్యాలు కల్పించాలన్నారు.
ఈవీఎంలలో ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించడానికి కృషి చేయాలని తెలిపారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించాలని చెప్పారు. ఓటింగ్ ప్రక్రియను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తారని, ప్రతి పోలింగ్ కేంద్రానికి సరిపడా బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లతో పాటు అదనంగా అందిస్తారని చెప్పారు. నోడల్ అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని, మ్యాన్ పవర్, కంప్యూటరైజేషన్, సైబర్ సెక్యూరిటీ, స్వీప్, శాంతి భద్రతల పరిరక్షణ, ఈవీఎం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, సీ- విజిల్, ఖర్చుల పర్యవేక్షణ, తదితర అంశాలపై ఆప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల అధికారులు సమన్వయంతో పని చేసి ఎన్నికలు సజావుగా సాగేలా కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎస్పీ సురేశ్కుమార్, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, కాగజ్నగర్ ఆర్డీవో సురేశ్, సెక్టోరల్, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.