ఆసిఫాబాద్,మార్చి 22 : లోక్ సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, ఇందుకు అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, ఎస్పీ సురేశ్కుమార్, ఏఎస్పీ ప్రభాకర్ రావు, డీఆర్వో లోకేశ్వర్ రావు,డీఎస్పీ సదయ్యతో కలిసి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆసిఫాబాద్ శాసనసభ నియోజకవర్గంలో విధులు నిర్వహించే నోడల్ అధికారులు, సెక్టోరల్ తహసీల్దార్లు, ఎంపీడీవో, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ సెక్టోరల్ అధికారులు, పోలీసు సెక్టోరల్ అధికారులు తమ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణ కోసం సిర్పూర్లో 320, ఆసిఫాబాద్లో 356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 676 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. సమస్యాత్మక, షాడో పోలింగ్ కేంద్రాలను గుర్తించి వివరాలు సమర్పించాలన్నారు. అధికారులు పాల్గొన్నారు.