ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, ఏప్రిల్ 4: వేసవి అయినందున ప్రజలకు జూన్ వరకు నిరంతరాయంగా నీటిని అందించేందుకు ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో గ్రామీణ నీటి సరఫరా శాఖ, మండల, గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో వేసవి తాగునీటి నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 334 గ్రామ పంచాయతీలు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయని, ఈ నెల మొదటి వారం నుంచి జూన్ మాసం వరకు జిల్లాలోని ప్రతి కుటుంబానికి తాగునీరు అందించేలా కార్యచరణ రూపొందించి అమలు చేయాలన్నారు.
గృహాలు, జనాభా, నీటి అవసరాలు, నీరు అందని ఆవాసాలు, గృహాల వివరాల ప్రకారం అందుబాటులో ఉన్న నీటి వనరులను గుర్తించి చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీల్లో చేతి పంపులు, బోర్వెల్స్, బావుల ద్వారా నీటి లభ్యత గుర్తించాలని, వేసవి నేపథ్యంలో నీటి వనరులు అందుబాటులో లేని ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా, ట్యాంకులు వెళ్ళని ప్రాంతాలకు ఎడ్లబండిపై తీసుకెళ్లి నీటి సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
గ్రామ పంచాయతీల పరిధిలోని వ్యవసాయ బావులు, బోర్వెల్స్ వివరాలు అందించాలని ఆదేశించారు. చేతి పంపులు, మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీలను గుర్తించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని, సమస్యాత్మక ఆవాసాలను గుర్తించి నీరు అందించేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, అంతరాయం లేకుండా అధికారులు పర్యవేక్షించాలని, మున్సిపాలిటీలో ప్రణాళిక రూపొందించి అందించాలని తెలిపారు. సురక్షితమైన తాగునీటిని అందించే విధంగా పైపులైన్ల మరమ్మతులు చేసే వ్యక్తులను తక్షణమే నియమించి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఉపాధి హామీ పని ప్రదేశాల్లో కూలీలకు తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు షామియానా, ఓఆర్ఎస్ సౌకర్యాలు కల్పించాలని, జన రద్దీ ప్రాంతాలలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ పంచాయతీల్లో పశువుల దాహార్తి తీర్చే విధంగా నీటి తొట్టెలలో నీరు నిండుగా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, మిషన్ భగీరథ ఈఈ వెంకటపతి, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, విద్యుత్ శాఖ ఎస్ఈ వాసుదేవ్, తదితరులు పాల్గొన్నారు.