ఆసిఫాబాద్ టౌన్ ,మే 24 : నకిలీ పత్తి విత్తనాలు అమ్మితే పీడీయాక్టు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో విత్తనాలు, ఎరువుల విక్రయాలపై డీలర్లు, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులకు నిర్వహించిన సమావేశంలో ఎస్పీ సురేశ్కుమార్, అడిషనల్ ఎస్పీ ప్రభాకర్రావు, ఇన్చార్జి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి క్రిష్ణారెడ్డితో కలిసి పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ పర్యవేక్షణలో నాణ్యమైన విత్తనాలు అందించాలన్నారు. నకిలీ, కాలంచెల్లిన విత్తనాలు, నిషేధిత పురుగులమందులు అమ్మితే సహించేది లేదని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. డీలర్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, ప్రతి దుకాణం ఎదుట ఎరువులు, విత్తనాల ధరల పట్టికలు ఏర్పాటు చేయాలని సూచించారు. డీలర్ షాప్ లైసెన్స్ వివరాలను ప్రదర్శించాలని చెప్పారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరకే విత్తనాలు, ఎరువులను విక్రయించాలన్నారు. విత్తనాలు, ఎరువుల నిల్వల వివరాలను రోజువారీగా రిజిష్టర్లలో పొందుపరచాలని చెప్పారు. రైతులు విత్తనాల ఖాళీ సంచులను పంటకాలం పూర్తయ్యే దాకా భద్రపరుచుకోవాలని, ఒకవేళ రైతు నష్టపోయినట్లయితే ఆయా కంపెనీల నుంచి నష్టపరిహారం పొందేందుకు అవకాశం ఉందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, వ్యవసాయ శాఖ అధికారులు, విస్తరణాధికారులు, డీలర్లు, ఫెర్టిలైజర్స్ యజమానులు పాల్గొన్నారు.
జైనూర్ మే 24: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అధికారులను ఆదేశించారు. శుక్రవారం జైనూర్, గౌరీ, డబోలి ఎంపీయూపీఎస్లో చేపడుతున్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు.
అనంతరం గౌరి గ్రామంలో మహిళా సంఘాల కుట్టు మిషన్ల కేంద్రా లను పరిశీలించారు. గడువులోగా యూనిఫాంలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ జిల్లా సెక్టోరల్ ఆఫీసర్ భరత్, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, ఈఎంపీవో శ్రీనివాసరెడ్డి, హెచ్ఎం రవీందర్, ఐకేపీ ఏపీఎం సుజాత, మండల విద్యాశాఖ అధికారి కుడ్మెత సుధాకర్, ఏపీవో నగేశ్, పంచాయతీ కార్యదర్శి ఉదయ్రాంప్రసాద్, సురేఖ ఉన్నారు.