ఆసిఫాబాద్ టౌన్, జనవరి 16 : ఓటరు జాబితా రూపకల్పనలో రాజకీయ పార్టీల పాత్ర కీలకమైనదని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దాసరి వేణు, ఆర్డీవో సురేష్తో కలిసి గుర్తిం పు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 20, 21 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటరుగా నమోదు చేసుకునేందుకు, మరణించిన వారి పేర్లు జాబితా నుంచి తొలగించేందుకు నేతలు సహకరించాలని కోరారు. పేర్లు, చిరునామా ఇతర వివరాల సవరణ కోసం అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.