ఆసిఫాబాద్, ఫిబ్రవరి 8 : గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ నెల 11న నిర్వహించబోయే ప్రవేశ పరీక్షపై సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన, వెనుకబడిన తరగతులు, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 5వ తరగతిలో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
ఆసిఫాబాద్లో 5 కేంద్రాలు, రెబ్బెనలో 1, సిర్పూర్ (టీ)లో 3 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుందన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకులాల ఆర్సీవో స్వరూపారాణి, గిరిజన సంక్షేమ గురుకులాల ఆర్సీవో గంగాధర్, జిల్లా సమన్వయకర్త బాలరాజు, చీఫ్ సూపరింటెండెంట్లు, అధికారులు పాల్గొన్నారు.
పల్లెల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ బోర్కడే హేమంత్ సహదేవరావు పేర్కొన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని జనకాపూర్లో చేపట్టిన పారిశుధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామపంచాయతీల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అంతర్గత రహదారులు, మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని, ఓవర్ హెడ్ ట్యాంకులను 15 రోజులకోసారి క్లోరినేషన్ చేసి శుభ్రపరచాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.