ఆసిఫాబాద్, జనవరి 27 : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను తక్షణమే పరిషరించి, బాధితులకు న్యాయం చేయాలని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎస్పీ సురేశ్కుమార్తో కలిసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో కలసి సమీక్ష నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను సంబంధిత శాఖల సమన్వయంతో తక్షణమే పరిషరించాలని సూచించారు. 2023లో కాగజ్నగర్ పోలీస్ సబ్ డివిజనల్ పరిధిలో 14 కేసులు, ఆసిఫాబాద్ పోలీస్ డివిజన్ పరిధిలో 10 కేసులు నమోదయ్యాయని తెలిపారు. వేగంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.
జిల్లా ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు మొత్తం 400 మంది బాధితులకు రూ. 2 కోట్ల 33 లక్షల 38 వేల 750లను పరిహారం కింద అందించినట్లు తెలిపారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సజీవన్, ఆసిఫాబాద్, కాగజ్నగర్ డీఎస్పీలు వెంకటరమణ, కరుణాకర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సావిత్రి, మానిటరింగ్ కమిటీ సభ్యులు కేశవరావు, అశోక్, సిడాం అర్జు, గోపాల్, గణేశ్, గంగుబాయి, వెంకటి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు.