ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్, జనవరి 24 : బాలికలు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా స్త్రీ, శిశు, వయోవృద్ధుల దివ్యాంగుల సంక్షేమ శాఖ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ బాలికల దినోత్సవాన్ని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సావిత్రితో కలిసి హాజరయ్యారు.
ఆడపిల్లలను కాపాడుకోవాలని, ఆడపిల్లలు వద్దనుకుంటే రేపటి సమాజం అమ్మలేని అనాథ అవుతుందన్నారు. కస్తూర్బా బాలికల విద్యాలయం, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, బాలికలకు రక్షణ, స్వేచ్ఛ కల్పించడం కోసం ప్రభుత్వం అనేక రక్షణ చర్యలు చేపడుతుందని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
కస్తూర్బా గాంధీ విద్యాలయం, ఆశ్రమ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించిన క్విజ్, వ్యాసరచన, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అరిగెల నాగేశ్వరరావు, జిల్లా బాలల సంరక్షణ అధికారి బూర్ల మహేశ్, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి తుకారం, జీసీడీవో శకుంతల, మహిళా సాధికారత కేంద్రం సభ్యులు శారద, మమత, ఝాన్సీ పాల్గొన్నారు.