సీసీసీ నస్పూర్, డిసెంబర్ 2 : విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వా రిని ప్రోత్సహించాలని కలెక్టర్ భారతీ హోళికేరి, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పిలుపునిచ్చారు. శుక్రవారం సీసీసీ నస్పూర్ ఆక్స్ఫర్డ్ పాఠశాలలో 50వ జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్, గణితం, పర్యావరణ, ఇన్స్పైర్, ఆర్బీవీపీ సైన్స్ వైజ్ఞానిక ప్రదర్శనలను అట్టహాసంగా ప్రారంభించారు. రెండు రోజుల పాటు సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచానికి ఎందరో శాస్త్రవేత్తలను అందించిన ఘనత మన భారతదేశానిదని కొనియాడారు. పిల్లల్లో మేధాశక్తి ఎక్కువగా ఉం టుందని, చిన్నతనం నుంచే వారి మైండ్సెట్ను సైంటిఫిక్గా మార్చడానికి కృషి చేయాలన్నారు.
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదిగేలా ఉపాధ్యాయులు వారికి సైన్స్పై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే దివాకర్రావు కోరారు. మంచిర్యాల జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్కు 18 మండలాల నుంచి విద్యార్థులు చక్కటి ఎగ్జిబిట్స్ తయారు చేసుకొని వచ్చినందుకు సంతోషంగా ఉందన్నా రు. విద్యార్థులు స్వర్గీయ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలని సూచించారు.
మంచిర్యాల జిల్లా నుంచి ఇన్స్పైర్కు ఎంపికైన 106 ఎగ్జిబిట్స్తో పాటు ఆర్బీవీపీ ద్వారా ఎన్రోల్ అయిన 300 ప్రాజెక్ట్లతో విద్యార్థులు సైన్స్ ఫెయిర్కు తరలివచ్చారు. ఎగ్జిబిట్స్ను కలెక్టర్ భారతీ హోళీకేరి, ఎమ్మెల్యే దివాకర్రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పేరెంట్స్ పరిశీలించి, ఉపయోగాల గురించి తెలుసుకున్నారు. సైన్స్ ఫెయిర్ సందర్భంగా నిర్వహించిన నృత్యం అలరించగా, సైంటిస్టుల రూపంలో ఇచ్చిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. 2020-21లో ఇన్స్పైర్ వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ కనబర్చి.. జాతీయ స్థాయికి ఎంపికైన సాయిశ్రీవల్లిని కలెక్టర్, ఎమ్మెల్యే మెమొంటో అందజేసి సత్కరించారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న ఈ సైన్స్ ఫెయిర్లో ప్రతిభ కనబర్చిన జూనియర్, సీనియర్ విభాగాల నుంచి 14 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయనున్నారు. సైన్స్ ఫెయిర్కు న్యాయనిర్ణేతలుగా 14 మంది ప్రొఫెసర్లను నియమించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాహుల్, జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ తోట శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, కౌన్సిలర్ వంగ తిరుపతి, ఎంఈవో పోచయ్య, ఆక్స్ఫర్డ్ పాఠశాల కరస్పాండెంట్ రోజర్, ప్రిన్సిపాల్ జస్టిన్, టస్మా జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, విష్ణువర్ధన్రెడ్డి పాల్గొన్నారు.
నా పేరు రవితేజ. కోటపల్లి మండలం దేవులవాడ(కే) జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న. ఈ రోజుల్లో నిరుపేదలు ఎయిర్ కండీషనర్ కొనాలం టే ఖర్చు ఎక్కువవుతుంది. తక్కువ ఖర్చుతో కూడిన ఏసీ తయారు చేశాను. ఫ్యాన్ నుంచి వెలువడిన గాలిని దాని ముందు అమర్చిన ప్లాస్టిక్ బాక్స్లోకి తక్కువ పీడనంతో వెలుతుంది. బాక్సులోపల అమర్చిన గరాటు లోనికి ప్రవేశించి వాటి చివరకు అమార్చిన జెట్ పైపుల్లోకి స్పీడ్తో పీడనం ప్రవేశించి, వాటి ద్వారా గాలి చల్లబడి బయటకు వస్తుంది.
నా పేరు రాజ్కుమార్. కోటపల్లి టీఎస్డబ్ల్ల్యూఆర్ఎస్ జేసీ బాలుర కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న. ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఉద్యోగాల్లో బిజిబిజీగా ఉంటూ పిల్లల బాగోగులు చూసుకోవడం కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు పనిచేసే స్థలం నుంచే చిన్న పిల్లలను ఆడించేలా బేబీ స్మార్ట్ వాకర్ తయారు చేశాను. బ్లూటూత్ ద్వారా సెల్ ఫోన్కు కనెక్ట్ చేసి ఆపరేటింగ్ చేయాలి. ఇంటి వద్ద ఉన్న చిన్న పిల్లలను స్మార్ట్ వాకర్లో కూర్చోబెట్టి సెల్ఫోన్ ద్వారా వారి వీడియోను చూస్తూ ఆపరేటింగ్ ద్వారా ఆడించవచ్చు.