హాజీపూర్, ఏప్రిల్ 15 : నిబంధనల మేరకే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం హాజీపూర్ మండలం గుడిపేట, రాపెల్లి, దొనబండ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతీలాల్, జిల్లా గ్రా మీణాభివృద్ధి అధికారి కిషన్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గోపాల్, తహసీల్దార్ సతీశ్కుమార్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 262 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని,
ఇందులో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు 105, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 130, డీసీఎంఎస్కు 27 కొనుగోలు కేంద్రాలను కేటాయించడం జరిగిందన్నారు. మండల ప్రత్యేకాధికారులు, వ్యవసాయాధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు సమన్వయంతో పని చేసి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, గన్నీ సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు.
నస్పూర్, ఏప్రిల్ 15 : ఈ వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం నస్పూర్లోని కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్, డీఆర్డీవో కిషన్, డీఈవో యాదయ్యతో కలిసి అభివృద్ధి పనుల నిర్వహణపై అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల యాజమాన్య కమిటీలకు రూపాంతరంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్, ప్రధానోపాధ్యాయుల పేరిట సంయుక్త బ్యాంక్ ఖాతా తెరిచి లావాదేవీలను నిర్వహించాల్సి ఉంటుందని, ఇందుకోసం ఒక ఉమ్మడి స్టాంప్ను తయారు చేయించుకోవాలని సూచించారు. పనుల పురోగతి ఫొటోలు తీసి పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించి నాణ్యమైన విద్యనందించే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఏపీఎం, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.