మంచిర్యాలటౌన్, ఏప్రిల్ 10 : మంచిర్యాల పట్టణంలో తాగునీటి సరఫరా తీరును కలెక్టర్ బదావత్ సంతోష్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. బుధవారం ఆకస్మికంగా మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆయన కార్యాలయం ఎదుటనే ఉన్న ఇంటికి వెళ్లి తాగునీటి సరఫరా పరిస్థితిపై ఆరా తీశారు. దానికి వారు ఎదురుగా ఉన్న మున్సిపల్ కార్యాలయం వద్ద 24 గంటలు నల్లా వస్తుందని, అక్కడే నీటిని అవసరమైనప్పుడల్లా పట్టుకుంటామని చెప్పారు.
బుధవారం నీటి సరఫరా బంద్ ఉన్నదని, ఇప్పుడు నీరెలా అని ప్రశ్నించారు. నీటి సరఫరా బంద్ ఉంటుందని ముందే తెలుసునని, అందుకే తమకు అవసరమైన నీటిని ముందుగానే డ్రమ్ముల్లో నింపి పెట్టుకున్నామని కలెక్టర్కు చెప్పారు. అనంతరం ఏదైనా వార్డులోకి వెళ్లి క్షేత్ర స్థాయిలో వివరాలు అడుగుదామని చెప్పడంతో మున్సిపల్ కమిషనర్ మారుతీప్రసాద్, ఎంఈ మధూకర్, ఏఈ రాజేందర్లతో కలిసి దగ్గరలోని గోసేవా మండలి ప్రాంతానికి వెళ్లారు.
అక్కడ పలు కుటుంబాలతో కలెక్టర్ మాట్లాడారు. నీటి సరఫరా ఎలా జరుగుతుందని, ఈరోజు నీటి సరఫరా బంద్ అన్న విషయం మీకు తెలుసునా అని ప్రశ్నించారు. అందుకు వారు నీటి సరఫరా బాగానే ఉందని, ఈ రోజు నల్లాలు రావని తమకు ముందే తెలుసు కాబట్టి ట్యాంకులు, డ్రమ్ముల్లో నీటిని పట్టి పెట్టుకున్నామని, నీటిని పొదుపుగా వాడుకుంటున్నామని చెప్పారు. అనంతరం అక్కడే ఉన్న బావిలో నీటి మట్టాన్ని పరిశీలించారు.