నస్పూర్, ఫిబ్రవరి 26 : ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలు పరిష్కరానికి కృషి చేస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం నస్పూర్లోని సమీకృత కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్తో కలిసి ప్రజావాణిలో అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి కార్యక్రమానికి 16 శాఖలకు చెందిన అధికారులు గైర్హాజరు కావడంపై కలెక్టర్ బదావత్ సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. గైర్హాజరయ్యే అధికారులు సరైన వివరణ ఇవ్వాలని ఆదేశించారు.
హైదరాబాద్లోని ప్రజావాణికి జిల్లా నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివెళ్తున్నారు. వ్యయప్రయాసాల కోర్చి వెళ్లి ఫిర్యాదులు అందజేస్తుండగా, ఏమాత్రం ఫలితం లేకుండా పోతుంది. ఇప్పటి వరకు మంచిర్యాల జిల్లా నుంచి 527 అర్జీలు అందగా, కేవలం 93 మాత్రమే పరిష్కారమయ్యాయి. ఈ విషయమై జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు.