నెన్నెల, జనవరి 4 : అర్హులందరూ ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని మంచిర్యాల కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం నెన్నెల మండలం గుండ్లసోమారంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చిత్తాపూర్లోని ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ 5 గ్యారంటీల పథకాల దరఖాస్తుల స్వీకరణ కోసం జిల్లాలో 1,702 కౌంటర్లు ఏర్పాటు చేశామన్నారు. దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్ కార్డు నకలు ప్రతి తప్పనిసరిగా జతపరచాలని, రేషన్ కార్డు నకలు ప్రతి లేకున్నా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందన్నారు.
అనంతరం పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. వార్షిక పరీక్షల్లో మంచి మారులు సాధించాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో విద్యాబోధన చేయాలని ఆదేశించారు. వార్షిక పరీక్షల ఫలితాల్లో పూర్తి స్థాయిలో ఉత్తీర్ణత సాధించేలా కృషి చేయాలని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. నెన్నెల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
వైద్య సేవల కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రతి ఒకరితో స్నేహపూర్వకంగా ప్రవర్తించాలని, వారికి అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి ఒకరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, వైద్యాధికారులు, వైద్యులు, సిబ్బంది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో అందుబాటులో ఉంటూ సమయపాలన తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మందుల నిల్వలను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, నెన్నెల మండల పరిషత్ అభివృద్ధి అధికారి వరలక్ష్మి, నెన్నెల మండల విద్యాధికారి మహేశ్వర్రెడ్డి పాల్గొన్నారు.