నస్పూర్, మార్చి 18 : పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్, మోతీలాల్, ఏసీపీ ప్రకాశ్తో కలిసి ఆబ్కారీ, బ్యాంకు, ఆదాయపన్ను, రవాణా, జీఎస్టీ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రజలను ప్రలోభ పెట్టే అంశాలైన నగదు, మద్యం, కానుకల రవాణాను అరికట్టేందుకు చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.
రూ. 50 వేల కంటే ఎక్కువగా తరలించినట్లయితే సీజ్ చేయడం తప్పదని సూచించారు. సీ-విజిల్ యాప్ ద్వారా ఫిర్యాదులు అందించిన 100 నిమిషాల్లో పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని మద్యం దుకాణాల్లో నిల్వలను తనిఖీ చేయాలని, బెల్టుషాపులను నియంత్రించాలన్నారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులకు సంబంధించిన నగదు లావాదేవీల విషయంలో ఏమైనా అనుమానాలుంటే సంబంధిత బ్యాంకర్ల సాయంతో భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా ఆబ్కారీ, మద్యనిషేధ శాఖ అధికారి నంద గోపాల్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, జిల్లా రవాణాశాఖ అధికారి సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా జిల్లా పరిధిలోని వివిధ రాజకీయ పార్టీలు, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించిన మొబైల్ బల్క్ ఎస్ఎంఎస్లు, వాయిస్ కాల్స్, మెసేజ్ల వివరాలను అందించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం నస్పూర్లోని కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతీలాల్తో కలిసి వివిధ మొబైల్ నెట్వర్క్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ మాట్లాడుతూ సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఏర్పాటుచేసిన మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ కార్యాలయంలో తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, నెట్వర్క్ పరిధిలో జరిగే ప్రచారం సంబంధిత పూర్తి వివరాలతో ఎప్పటికప్పుడు నివేదిక అందించాలని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ మేనేజర్ సునీల్, మొబైల్ నెట్వర్క్ల ప్రతినిధులు, ఎన్నికల పాల్గొన్నారు.
నస్పూర్, మార్చి 18 : ఎన్నికల నేపథ్యంలో బ్యాంకుల పరిధిలో జరిగే అనుమానిత నగదు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ మోతీలాల్తో కలిసి వివిధ బ్యాంకుల అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకు పరిధిలో రూ. లక్ష కంటే ఎక్కువగా నగదు జమ అయినా, తీసుకున్నా.. వివరాలను ఎన్నికల ఖర్చుల పరిశీలకులకు అందించాలన్నారు. కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, ఎన్నికల తహసీల్దార్ శ్రీనివాస్, బ్యాంకుల అధికారులు తదితరులు పాల్గొన్నారు.