ఆదిలాబాద్/నిర్మల్, మే 1(నమస్తే తెలంగాణ) ;ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంటాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను క్రమబద్ధీకరించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నూతన సచివాలయ ప్రారంభోత్సవ వేళ ఫైలుపై సీఎం కేసీఆర్ సంతకం చేయడంతో దశాబ్దాల కల నెరవేరిందంటూ ఉద్యోగులు సంబురాలు చేసుకున్నారు. వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేయడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. 20 ఏండ్ల నిరీక్షణకు తెరపడడంతో పటాకలు కాల్చారు. ఉమ్మడి రాష్ట్రంలో తమ గోడును ఎవరూ పట్టించుకోలేదని, వివక్ష ప్రదర్శించారని, తక్కువ వేతనం ఇచ్చి ఇబ్బంది పెట్టారని పేర్కొన్నారు. తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపిన కేసీఆర్ను జీవితాంతం గుర్తుంచుకుంటామని ఆనందం వ్యక్తం చేస్తూ.. కృతజ్ఞతలు తెలిపారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ప్రారంభోత్సవం సందర్భంగా కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తొలిసంతకం పెట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 5544మంది ఒప్పంద లెక్చరర్లు, ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తూ ఫైల్పై సంతకం చేయడంతో రెండు దశాబ్ధాల నిరీక్షణకు తెరపడింది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని, ఇది తమ జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతుందని ఉద్యోగులు, అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించిన ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని స్పష్టం చేస్తున్నారు.
సీఎం చిత్రపటాలకు పాలాభిషేకాలు
కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ మేరకు సోమవారం ఆదిలాబాద్లోని కలెక్టరేట్ చౌరస్తాలో కాంట్రాక్ట్ లెక్చరర్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఉట్నూర్లోని డిగ్రీ కళాశాలలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ధరణీ రాజేశ్ నాయకులు సతీష్, బాబా శ్యాం, స్వామి, ముజీబ్, సలావుద్దీన్, శేఖర్తో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రెబ్బెనలో సీఎం చిత్రపటానికి కాంట్రాక్టు లెక్చరర్లు పాలాభిషేకం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు మంచిర్యాల, శ్రీరాంపూర్, మందమర్రి ప్రభుత్వ ఐటీఐలలోని కాంట్రాక్టు ఉద్యోగులు సోమవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రసిడెంట్, మంచిర్యాల ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ చందర్, ప్రభుత్వ ఐటీఐ ట్రైనింగ్ ఆఫీసర్ వై రమేశ్, డీటీవోలు శ్రీధర్ రాజు, హఫీజ్, ప్రకాశ్రావు, కాంట్రాక్టు ఏటీవోలు రాజేందర్, షోయబ్, శశి కుమార్, రామకృష్ణ, తిరుపతి, మనోహర్, శ్రీకాంత్, శ్రావణ్ కుమార్, సత్యానంద్, సంధ్యారాణి పాల్గొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్ జిల్లాలో 124 మంది జూనియర్ కళాశాలల అధ్యాపకులు, 14 మంది డిగ్రీ కళాశాలల లెక్చరర్లు, 15 మంది పాలిటెక్నిక్ కళాశాలల లెక్చరర్లు ఉన్నారు. వీరితో పాటు ఐటీఐలలో పనిచేసే అసిస్టెంట్ ట్రైనింగ్ అధికారులు, హాస్పిటల్స్లో ల్యాబ్ టెక్నీషియన్స్, ఫార్మసిస్ట్, స్టాఫ్ నర్సులు తాత్కాలిక పద్ధతిలో పని చేసే సిబ్బంది రెగ్యులర్ కానున్నారు. అలాగే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కళాశాలల్లో పనిచేస్తున్న సుమారు 122 మంది లెక్చరర్లు, వృత్తి విద్యాబోధకులు రెగ్యులర్ కానున్నారు. వైద్య ఆరోగ్య శాఖ, ఇతర శాఖల్లో సుమారు 70 మందికి మేలు చేకూరనున్నది. నిర్మల్ జిల్లాలో వైద్యారోగ్య శాఖలో 45 మంది, కాంట్రాక్టు లెక్చరర్లు 134 రెగ్యులర్ కానున్నారు. మంచిర్యాల జిల్లాలో 86 మంది జూనియర్ కళాశాల లెక్చరర్లకు, తొమ్మిది మంది డిగ్రీ కళాశాలల్లో బోధించే కాంట్రాక్టు లెక్చరర్లకు మేలు జరుగనున్నది. జిల్లాలో నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 30 మంది కాంట్రాక్టు డిగ్రీ లెక్చరర్లు విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం 270 మందికి మాత్రమే శాశ్వత ఉద్యోగులుగా అవకాశం ఇవ్వగా, జిల్లాలో తొమ్మిది మందికి అవకాశం కలిగింది. మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఇద్దరు, చెన్నూర్ నుంచి ఒకరు, లక్షెట్టిపేట నుంచి ఒకరు, బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి ఐదుగురు లెక్చరర్లు రెగ్యూలర్ కానున్నారు. 10 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న 86(ఒకేషనల్ 15, జనరల్ 71) మంది కాంట్రాక్టు లెక్చరర్లు రెగ్యులర్ కానున్నారు. జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 11 మంది, కాసిపేటలో ఏడుగురు, మందమర్రిలో నలుగురు, జైపూర్లో ఆరుగురు, చెన్నూర్లో తొమ్మిది, బెల్లంపల్లి బాలికల జూనియర్ కళాశాలలో ఎనిమిది మంది, బెల్లంపల్లి బాలుర జూనియర్ కళాశాలలో ఎనిమిది మంది, దండేపల్లిలో ఐదుగురు, లక్షెట్టిపేటలో 14 మంది, మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని 14 మంది కాంట్రాక్టు లెక్చరర్లు రెగ్యులర్ కానున్నారు.
ఐటీఐలో 20 మందికి..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో ఒక ఐటీఐ ఉండగా, మంచిర్యాల జిల్లాలో మంచిర్యాలతో పాటు జన్నారం, శ్రీరాంపూర్, మందమర్రిలలో కలిపి ఐదు ఐటీఐలు ఉన్నాయి. ఇందులో 21 మంది కాంట్రాక్టు లెక్చరర్లుగా పని చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 240 కాంట్రాక్టు ఉద్యోగులుండగా, ఇందులో 230 మందికి ప్రభుత్వం రెగ్యులర్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఉమ్మడి జిల్లాలో 21 మంది ఉండగా, ఒకరు రిజైన్ చేశారు. మిగతా 20 మంది రెగ్యులర్ అయ్యారు. ఇందులో జన్నారం ప్రభుత్వ ఐటీఐలో ఐదుగురు, మందమర్రి ఐటీఐలో నలుగురు, మంచిర్యాల ఐటీఐలో నలుగురు, శ్రీరాంపూర్ ఐటీఐలో నలుగురు, ఉట్నూర్ ఐటీఐలో ముగ్గురు రెగ్యులర్ అయ్యారు.
కేసీఆర్ మా పాలిట దేవుడు
ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 124 మంది కాంట్రాక్ట్ పద్ధతితో విధులు నిర్వహిస్తున్నారు. 23 ఏండ్లుగా పనిచేస్తున్న వారు కూడా ఉన్నారు. పేద విద్యార్థుల ఉన్నత చదువుల కోసం లెక్చరర్లు కష్టపడి పని చేస్తున్నారు. గత ప్రభుత్వాలు కాంట్రాక్ట్ లెక్చరర్లను పట్టించుకోలేదు. ఉద్యోగ భద్రత కల్పించిన సీఎం కేసీఆర్ను ఎప్పటికీ మరచిపోం. దేశంలో మొదటిసారిగా కాంట్రాక్ట్ లెక్చరర్లను పర్మినెంట్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ మా పాలిట దేవుడిగా భావిస్తున్నాం.
– గాజుల శ్రీనివాస్, కాంట్రాక్ట్ లెక్చరర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు, ఆదిలాబాద్
మరింత ఉత్సాహంతో పనిచేస్తాం
మంచిర్యాల అర్బన్, మే 1 : తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం గొప్ప విషయం. ఉద్యోగ భద్రత కోసం ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లాం. ఇందుకు సీఎం కేసీఆర్ స్పందించినందుకు ఆనందంగా ఉంది. నూతన సచివాలయం ప్రారంభం రోజే తొలి సంతకం చేసి మా కుటుంబాల్లో వెలుగులు నింపారు. ఉద్యోగ భద్రత కల్పించడంతో మరింత ఉత్సాహంతో విద్యార్థులకు విద్యనందిస్తాం.
– నరేందుల రవీంద్ర కుమార్, అధ్యక్షుడు, జిల్లా కాంట్రాక్టు అధ్యాపకుల సంఘం, మంచిర్యాల
జీతాలు పెరుగుతాయి..
ఇరవై ఏండ్లుగా పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. సీఎం కేసీఆర్ చల్లని చూపుతో ఉద్యోగం రెగ్యులర్ అయింది. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహించినప్పటికీ.. అనునిత్యం ఏదో వెలితిగా ఉండేది. ఎన్నో ఏళ్లుగా క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న మాకు తెలంగాణ ప్రభుత్వం సరైన న్యాయం చేసింది. నేను 2003లో కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్గా నిర్మల్ జిల్లా మామడ పీహెచ్సీలో జాయిన్ అయ్యా. అప్పట్లో నెలకు రూ.4,200 వేతనం. ప్రస్తుతం డిప్యుటేషన్పై నిర్మల్లోని రాంనగర్ అర్భన్ హెల్త్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్నా. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి ఉద్యోగుల జీవితాలు బాగు పడ్డయ్. సీఎం కేసీఆర్ మొదటి నుంచి ఉద్యోగుల పక్షపాతిగా వ్యవహరించడం వల్లనే తమ లాంటి ఎందరో మంది కాంట్రాక్టు ఉద్యోగులకు ఈ రోజు మేలు జరిగింది. మా ఉద్యోగాలు రెగ్యులర్ కావడం వల్ల ఇంక్రిమెంట్లతోపాటు వేతనం రూ.5 వేల నుంచి రూ.10 వేలు పెరిగే అవకాశం ఉంది.
– సామ రమణారెడ్డి, హెల్త్ అసిస్టెంట్, నిర్మల్ అర్బన్ హెల్త్ సెంటర్.
సమాన పనికి.. సమాన వేతనం
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని తెలంగాణ ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఎన్నో అడ్డంకులు, కోర్టు కేసులను అధిగమించి తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించారు. ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన మాట నిలబె ట్టుకున్నారు. నూతన సచివాలయంలో తమ ఫైలుపైనే తొలి సంతకం చేయడం మా అదృష్టం. 23 ఏళ్లుగా కాంట్రాక్టు వ్యవస్థలో పనిచేస్తున్నా.. మమ్ముల గత ప్రభుత్వాలు బానిసలుగా చూశాయి. సమైక్య పాలకులు మమ్మల్ని పట్టించుకోలేదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును కూడా పెడచెవిన పెట్టాయి. సీఎం కేసీఆర్ నిర్ణయంతో మా కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించింది.
– సిర్గ రవీందర్, కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, నిర్మల్.
నిరీక్షణకు ఫలితం దక్కింది..
మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించడంతో జీవితాల్లో వెలుగులు వచ్చాయి. నేను 2002 సంవత్సరం సెప్టెంబర్ నెలలో ముజ్గి పీహెచ్సీలో కాంట్రాక్టు పద్ధతిలో ల్యాబ్ టెక్నీషియన్గా విధుల్లో చేరా. మా ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని గతంలో వైద్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశాం. ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేసినా అప్పటి ప్రభుత్వాలకు మాపై కనికరం కలుగలేదు. ఒక్క సీఎం కేసీఆర్ వల్లనే ఇది సాధ్యమైంది. కాంట్రాక్టు ఉద్యోగం నుంచి విముక్తి కల్పించిన మహనీయుడు సీఎం కేసీఆర్. అందరి బాగోగులు చూసే కేసీఆర్తోనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. భవిష్యత్తులో కూడా సీఎంగా కేసీఆరే ఉండాలి.
– ఏ.మాధవ్రావు, ల్యాబ్ టెక్నీషియన్, ముజ్గి పీహెచ్సీ
మాట నిలుపుకున్న కేసీఆర్
ఉట్నూర్ రూరల్, మే 1 : సీఎం కేసీఆర్ కాంట్రాక్టు ఉద్యోగు లను క్రమబద్ధీకరించడం హర్షనీయం. గతంలో కేసీఆర్ రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం క్రమబద్ధీకరించారు. నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం గర్వకారణం. కేసీఆర్ పాలన లో రాష్ట్రం దేశంలోనే ప్రగతి పథంలో దూసుకుపో తున్నది.
– ధరణి రాజేశ్ , బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు
సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నరు
మంచిర్యాల అర్బన్, మే 1 : ముఖ్యమంత్రి కేసీఆర్ 2014లో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని హామీ ఇచ్చారు. 2016లో జీవో విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 30న ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నూతన సచివాలయం ప్రారంభం రోజే తీపి కబురు అందించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఎంప్లాయ్ మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్టుమెంట్లలో 240 మందికిగాను 230 మందిని రెగ్యులరైజ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇది గొప్ప నిర్ణయం. సీఎం ఇచ్చిన స్ఫూర్తితో విద్యార్థులకు మరింత నాణ్యమైన శిక్షణ అందిస్తాం. ముఖ్యమంత్రి నిర్ణయానికి యావత్ కాంట్రాక్టు ఉద్యోగులందరి తరపున కృతజ్ఞతలు.
– చెవుల రాజేందర్, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కాళేశ్వరం జోనల్ ప్రెసిడెంట్, జన్నారం ఐటీఐ కాంట్రాక్టు లెక్చరర్
సీఎం నిర్ణయంతో భరోసా
మంచిర్యాల ఏసీసీ, మే 1 : 2006లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరాను. చాలీచాలని వేతనంతో కుటుంబాన్ని వెళ్లదీస్తూ వచ్చిన. ప్రస్తుతం కలెక్టరేట్లో డీపీవోగా పనిచేస్తున్నా. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో మా కుటుంబానికి భరోసావచ్చింది. ఇందుకు ఆయనకు రుణపడి ఉంటాం. -మంతెన శ్రీనివాస్, మంచిర్యాల
మా తలరాత మార్చాడు
కోటపల్లి, మే 1 : వైద్య, ఆరోగ్య శాఖలో 20 ఏళ్లుగా పని చేస్తున్న మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాడితే మా ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు మమ్మల్ని రెగ్యులర్ చేసి మాట నిలబెట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనం చేకూరేది కాదు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలం ప్రారంభోత్సవం రోజే మా ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తూ సీఎం కేసీఆర్ సంతకం పెట్టి మా తల రాత మార్చాడు.
– పబ్బ సుధాకర్ గౌడ్, హెల్త్ అసిస్టెంట్, కోటపల్లి
కేసీఆర్ నమ్మకాన్ని నిజం చేసిండు..
కాంట్రాక్టు అధ్యాపకులు, ఉద్యోగుల క్రమబద్ధీకరణ ఫైలుపై తొలి సంతకం చేసిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటా. రెగ్యులర్ చేయాల ని గత ప్రభుత్వాలను కోరినా పట్టించుకోలేదు. రెండు దశాబ్దాల కలను సాకారం చేసిన సీఎం కేసీఆర్ మాకు దేవుడితో సమానం. నేను 2006 సంవత్సరం నుంచి ఖానాపూర్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో కాంట్రాక్టు లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్నా. అప్పట్లో నెలకు కేవలం రూ.4,500 వేతనం. 2012 నుంచి 2018 వరకు నిర్మల్ బాలుర జూనియర్ కాలేజీలో పని చేశా. ప్రస్తుతం ఖానాపూర్లో వృక్షశాస్త్ర అధ్యాపకుడిగా కొనసాగు తున్నా. ఎంతకాలం ఇలా కాంట్రా క్టు ఉద్యోగం చేయాలి? భవిష్యత్తు ఏమిటీ? అనే ఆలోచనలతో సతమతమవుతున్న తరుణంలో తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయడం సంతోషాన్నిచ్చింది. కేసీఆర్పై తాము పెట్టుకున్న నమ్మకం నిజమైంది.
– జీ.శ్రీనివాస్రావు, వృక్షశాస్త్ర అధ్యాపకుడు, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఖానాపూర్.