ఆదిలాబాద్, జూన్ 7(నమస్తే తెలంగాణ) ;‘సమైక్య రాష్ట్రంలో సాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డం.. స్వరాష్ట్రంలో ఆ గోస తీర్చుకున్నం.. జలాశయాలు, నీటి వనరులు నిండుకుండలా ఉన్నయంటే అది సీఎం కేసీఆర్ ఘనతే.. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసి, రైతులకు మంచి చేసే ఆలోచన ఆయనదే..’ అంటూ వక్తలు కొనియాడారు. రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా బుధవారం సాగునీటి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్. నిర్మల్ జిల్లాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. స్వరాష్ట్రంలో సాధించిన అద్భుతాలను గుర్తు చేసుకున్నారు. నిర్మల్లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, భైంసాలో ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఖానాపూర్లో ఎమ్మెల్యే రేఖానాయక్, ఆదిలాబాద్లో జోగు రామన్న, బోథ్లో రాథోడ్బాపురావ్ పాల్గొన్నారు.
తెలంగాణ వచ్చాకే రాష్ట్రంలో సాగునీటి విప్లవం ప్రారంభమైందని, దానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని దివ్యగార్డెన్లో జలవనరులశాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సాగునీటి దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న కృష్ణ, గోదావరి, పెన్గంగ తదతర నదులపై పెద్ద ఎత్తున ప్రాజెక్టులు, లిప్టులు నిర్మించడంతో రాష్ట్రంలో పుష్కలమైన జల సంపద పెరిగిందన్నారు. ప్రపంచ చరిత్రలోనే గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టును అతి తక్కువ కాలంలో నిర్మించిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. కాళేశ్వరం జలాలను శ్రీరాంసాగర్తో పాటు వివిధ రిజర్వాయర్లకు మళ్లించే కార్యక్రమం ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందన్నారు. వచ్చే ఏడాది కాళేశ్వరం జలాలను శ్రీరాంసాగర్కు పంపి ఇక్కడి భూములకు సాగునీటిని అందిస్తామన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగునీటి రంగం అభివృద్ధితో పోల్చితే ఇప్పుడు 200 రెట్లు పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే తెలంగాణలో 56 లక్షల ఎకరాల్లో సాగు నమోదైందన్నారు. రాష్ట్రంలో రైతుకు నీటి సంపదతో పాటు 24 గంటల కరెంట్ ఇవ్వడంతో పంట ఉత్పత్తులు గణనీయంగా పెరిగాయని, రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయని మంత్రి పేర్కొన్నారు.
బీజేపీ నాయకులది మొసలి కన్నీరు..
ప్రభుత్వం వరికి మద్దతు ధర కల్పించి కొని వెంటనే రైస్మిల్లులకు పంపితే బీజేపీ నాయకులు దాన్ని రాజకీయం చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముట్టడించేందుకు ప్రయత్నించడం బీజేపీ నేత మహేశ్వర్రెడ్డికి దిగజారుడు తనానికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలుపై కొర్రీలు పెడుతున్నా తమ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మల్ పర్యటనకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున సంఘీభావం తెలుపడాన్ని జీర్ణించుకోలేక బీజేపీ నాయకులు రైతు ధర్నాల పేరుతో రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హితవు పలికారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీకి గడ్డు కాలమే ఉంటుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ను దేశ ప్రజలందరూ కోరుకుంటున్న నేపథ్యంలో ఇక్కడి నాయకులు తమ ప్రభుత్వంపై నిందలు మోపతున్నా ఎవరూ నమ్మబోరని తెలిపారు. ఈ సందర్భంగా నీటి పారుదలశాఖలో ప్రతిభ కనబరిచిన ఈఈ రామారావుతో పాటు డీఈ, ఏఈలను ప్రశంసాపత్రాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాంకిషన్రెడ్డి, సారంగాపూర్ ఎంపీపీ మహిపాల్రెడ్డి, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, నీటిపారుదలశాఖ అధికారులు నరేశ్, రాజేశ్వర్, లక్ష్మి, ఆర్డీవో స్రవంతి తదితరులు పాల్గొన్నారు.
జలవనరుల శాఖ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం..
జలవనరులశాఖలో 2014 నుంచి 2023 వరకు నీటి పారుదల రంగానికి ప్రభుత్వం అందిస్తున్న సహకారం చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొనవచ్చు. మిషన్ కాకతీయ కింద నిర్మల్ జిల్లాలో 462 చెరువులను పునరుద్ధరించాం. జిల్లాలో నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గంలోని వివిధ వాగులపై చెక్డ్యాంల నిర్మాణం పూర్తి చేశాం. 2014కు ముందు 2,50,093 టన్నుల పంటలు పండగా.. ఇప్పుడు 3,77,845 టన్నులకు పెరిగింది. భూగర్భజల మట్టం 8.69 నుంచి 6.77కు తగ్గింది. ప్రభుత్వం అధికారులను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రోత్సాహాన్ని అందిస్తున్నది.
– రామారావు, ఈఈ, నిర్మల్
జీవనోపాధికి భరోసా..
ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ పక్రియను వేగంగా చేపట్టడంతో చేపల వృత్తుల వారికి జీవన భరోసా ఏర్పడింది. మిషన్భగీరథ ద్వారా చెరువుల్లో మట్టి తీయడం వల్ల నీరు నిల్వ ఉండి ప్రభుత్వం అందించిన వందశాతం సబ్సిడీ చేప పిల్లలను చెరువుల్లో పెంచి మూడు కాలాలు చేపలు పట్టి మత్స్య కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు. నిర్మల్ జిల్లాలో సుమారు 12వేల మందికి మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం చేయూతను అందించింది.
– నర్సయ్య, మత్స్య కార్మికుడు
ఈ ఏడాదే ట్రయల్ రన్ నిర్వహిస్తాం..
తెలంగాణ ప్రభుత్వం 2014 తర్వాత ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి వనరుల అభివృద్ధికి అనేక నిధులు ఖర్చు చేసింది. గోదావరిపై పొన్కల్ వద్ద రూ.700 కోట్లతో సదర్మాట్ పనులు పూర్తిచేసింది. దీంతో ఈ ఏడాది నీళ్లు నింపేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నాం. పెన్గంగపై చనాకా కొరాటా ప్రాజెక్టుతో పాటు నిర్మల్ నియోజకవర్గానికి సాగునీరు అందించే 27 ప్యాకేజీ పనులను ఈ ఏడాదే పూర్తిచేసి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.
– టీ శ్రీనివాస్, చీఫ్ ఇంజినీర్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా
పునర్వ్యవస్థీకరణతో మరింత బలం..
తెలంగాణ ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు జలవనరులశాఖ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనివల్ల జిల్లాలో డివిజన్లు, సబ్ డివిజన్లు ఏర్పాటు చేసి ఉద్యోగాల భర్తీ చేపట్టింది. దీంతో నీటి వనరుల పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. చెక్డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. దీంతో భూగర్భజలాలను సంరక్షించుకుంటున్నాం. చెరువుల్లో మట్టితీత పనులతో నీరు పుష్కలంగా ఉండడం వల్ల సాగు పెరిగింది.
– సుశీల్కుమార్, జిల్లా పర్యవేక్షక ఇంజినీర్, నిర్మల్