ఎదులాపురం,జనవరి 2: యువతను రెచ్చగొడుతూ, కుల మతాల చిచ్చు పెడుతూ రాజకీయ పబ్బం గడుపుకునే బీజేపీని ఢీకొట్టే సత్తా సీఎం కేసీఆర్కు మత్రమే ఉందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్లోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్లో చేరారు. మావల మండలానికి చెందిన మాజీ సర్వీస్ మెన్ నరేందర్, బీజీపీకి చెందిన రొక్కటి సంతోష్తో పాటు 30 మంది యువకులు బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే జోగు రామన్న వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బీజేపీ నాయకుల మాటలు, దుష్ప్రచారాలను యువకులు నమ్మడం లేదన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరిచడంలో కేంద్ర ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా బీజేపీ సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నదని మండిపడ్డారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, ఏఎంసీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, కౌన్సిలర్ భరత్, కో ఆప్షన్ సభ్యుడు ఏజాజ్, బీఆర్ఎస్ నాయకులు నల్ల రాజేశ్వర్, రాజు, ఏవన్, సాగర్, సుధీర్, యోగేశ్, నారాయణ ఉన్నారు.
సంఘాల అభ్యున్నతికి పాటు పడాలి
కుల సంఘాల ప్రతినిధులు ఐక్యంగా ఉంటూ సంఘాల అభ్యున్నతికి పాటు పడాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని విశ్వకర్మ ఆలయంలో పట్టణ స్వర్ణకారుల సంఘం ప్రమాణ స్వీకారోత్సవానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను సత్కరించి అభినందనలు తెలిపారు. సంఘం నాయకులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కారానికి తన వంతుగా పూర్తి చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యేను సంఘం నేతలు సత్కరించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు రమేశ్, వేణుగోపాల్, పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉదారి నగేశ్, సత్యం ,కౌన్సిలర్ అశోక్ స్వామి, నాయకులు సత్యం అనిల్, భాస్కరాచారి పాల్గొన్నారు.