నిర్మల్, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ రైతుల మేలు కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధును ఆపాలని ఎన్నికల కమిషన్(ఈసీ)కు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నదని, తెలంగాణ రైతులు, ప్రజలు వ్యతిరేకించాలని ఆయన కోరారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంత్రి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
వచ్చే యాసంగికి సంబంధించి రైతుబంధు డబ్బులను రైతులకు ఇవ్వద్దంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలోని ఈసీకి ఫిర్యాదు చేయడం శోచనీయమన్నారు. దీంతో రైతాంగంపై కాంగ్రెస్ కపట ప్రేమ బట్టబయలైందన్నారు. రైతాంగానికి నష్టం చేసే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు. రైతుబంధుపై అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఎప్పటిలాగే ప్రభుత్వం యాసంగి పంట సాయాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తుందన్నారు. రైతులకు పంట పెట్టుబడికి ఉపయోగపడే రైతుబంధును కాంగ్రెస్ పార్టీ ఆపాలని చూడడం సరైంది కాదన్నారు.
బీజేపీ అభ్యర్థి మహేశ్వర్రెడ్డి రౌడీ, గూండా రాజకీయాలను చేయాలని చూస్తే నియోజకవర్గ ప్రజలు తన్ని తరిమేస్తారని మంత్రి హెచ్చరించారు. ఇటీవల నిర్మల్ లోని బంగల్పేట మహాలక్ష్మీ అమ్మవారి సన్నిధిలో వీహెచ్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన విజయ దశమి ఉత్సవాలు ఘనంగా జరిగాయన్నారు. వేలాదిగా అమ్మవారి భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకొని, రావణ దహనాన్ని వీక్షించారని తెలిపారు. యేటా ఆనవాయితీ ప్రకారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందేనన్నారు. అయితే ప్రశాంత వాతావరణంలో దసరా వేడుకలు జరుగుతున్న సమయంలో మహేశ్వర్రెడ్డితోపాటు, కొంతమంది ఆయన అనుచరులు అక్కడికి చేరుకొని ఏ విధంగా అల్లరి చేశారో ప్రజలు స్వయంగా చూశారన్నారు.
పూజల కోసం అక్కడికి వచ్చిన దేవరకోట ఆలయ ఈవో రవికిషన్పై దాడికి యత్నించి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారని మండిపడ్డారు. వీహెచ్పీ నాయకులు సభావేదిక నుంచి మాట్లాడుతూ.. ఇక్కడ గొడవ చేయడం మంచి పద్ధతి కాదంటూ వారించినప్పటికీ వినకుండా మహేశ్వర్రెడ్డి తన రౌడీయిజాన్ని చూపే ప్రయత్నం చేశారన్నారు. ఆయన ప్రవర్తించిన తీరుపై ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. పండుగలను కూడా రాజకీయ వేదికగా ఉపయోగించుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి గూండాయిజాన్ని సహించమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
నామినేషన్ల ప్రక్రియ ఇంకా ప్రారంభం కూడా కాలేదని, ఇప్పుడే ఇలా వ్యవహరిస్తే.. రానున్న రోజుల్లో ఇంకేం చేస్తారో అని మహేశ్వర్రెడ్డి తీరుపై ప్రజలు ఆందోళన చెందుతున్నారన్నారు. ఇలాంటి గూండాలను ప్రజలు ఓ కంట కనిపెట్టి, రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని కోరారు. ఏది ఏమైనా బీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ రక్ష అని, వాటిని ప్రజలకు వివరిస్తామన్నారు. అలాగే మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడుగుతామని మంత్రి స్పష్టం చేశారు. సీనియర్ నాయకుడు వల్లకొండ సత్యనారాయణగౌడ్, అప్పాల గణేశ్, మారుగొండ రాము, సుభాష్రావు, పాకాల రాంచందర్ పాల్గొన్నారు.