‘అల్లోల ఇంద్రకరణ్రెడ్డి.. సౌమ్యుడు, మంచి మనిషి, నిర్మల్ జిల్లా ప్రగతికి నిరంతరం పరితపించే నాయకుడు. ప్రజాభివృద్ధికి ఎలా తండ్లాడుతాడో నాకు బాగా తెలుసు. ఇవాళ జిల్లా ప్రగతి పథంలో దూసుకుపోతుందంటే ప్రధాన కారణం ఆయనే. మంచినీరు, సాగునీరు ఏ విధంగా తపన పడి తెచ్చుకున్నరో.. నాకంటే మీకే బాగా తెలుసు. అటువంటి ఐకేరెడ్డిని మరోసారి దీవించండి. సభకు వచ్చిన జనాన్ని చూస్తేనే గెలుస్తడని తేలిపోయింది. ఈసారి 80 వేల మెజార్టీ వస్తే కచ్చితంగా జేఎన్టీయూ నుంచి ఇంజినీరింగ్ కాలేజీ ఇప్పించే బాధ్యత నాది..’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఉద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నిర్మల్ జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని కలెక్టరేట్కు వెళ్లే దారిలో గల క్రశ్కర్ ఏరియాలో నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే నిర్మల్ జిల్లా సాధ్యమైందని గుర్తు చేశారు. ఉమ్మడి జిల్లాలో నాలుగు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని, నిర్మల్కు కాలేజీ వస్తదని, ఎన్నడన్న ఊహించినమా ఆలోచించాలన్నారు.
– మంచిర్యాల, నవంబర్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, నవంబర్ 2(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిర్మల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డిని దీవించి, మళ్లీ గెలిపించారని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రజలను కోరారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ హక్కులు కాపాడడానికి.. నీళ్లు, నిధులు, నియామకాల కోసమని ఉద్ఘాటించారు. తెలంగాణ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం వాటిల్లకుండా ఉండాలనుకునే కాపాలా దారే బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు.
నిర్మల్ జిల్లాలోని కలెక్టరేట్కు వెళ్లే దారిలో క్రశ్కర్ ఏరియాలో నిర్వహించిన నిర్మల్ నియోజకవర్గ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో సీఎం కేసీఆర్ మాట్లాడా రు. నిర్మల్ నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు రెండు సార్లు బీఆర్ఎస్ను ఆశీర్వదించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రమే రాకపోతే.. నిర్మల్ జిల్లా అయ్యేదా.. దయచేసి ఆలోచించాలని సూచించారు. నిర్మల్ జిల్లా చేసింది నేను కావచ్చు కానీ.. నాకంటే ఎక్కువ తపనపడి జిల్లా చేయించింది మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అని చెప్పారు. మేం హైదరాబాద్లో కూర్చొని ఆదిలాబాద్లో కొత్త జిల్లాలు ఏం ఏర్పాటు చేద్దామని ఆలోచిస్తుండగా.. అటో జిల్లా, ఇటో జిల్లా రెండు జిల్లాలు చేస్తే సరిపోతదని, ఆదిలాబాద్ ఎట్లా ఉంది, మంచిర్యాల ఒకటి చేస్తే సరిపోతదనే నిర్ణయానికి వచ్చామన్నారు.
అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఒక బృందాన్ని తీసుకొని బయటికి వెళ్లి, మళ్లీ ఒక గంట తరువాత వచ్చి సార్ ఇది మీ వల్లనే కావాలే.. ఇంకెవరితోని కాదు.. ఆదిలాబాద్ జిల్లా రాష్ట్ర రాజధానికి చాలా దూరమున్న జిల్లా. చాలా అడవులు ఉన్న జిల్లా. వేరే ఎవరికి దమ్ములేదు.. ఎవరూ చేయరు.. మీకే తెలుసు బాసర నుంచి ఆదిలాబాద్ పోవాలంటే ఎంత దూరమో.. బెజ్జూర్ నుంచి ఆదిలాబాద్ రావాలంటే ఎంత దూరమో.. అందుకే ఏం చేసైనా సరే నాలుగు జిల్లాలు చేయాలని అడిగారన్నారు.
కచ్ఛితంగా నిర్మల్ జిల్లా కావాలని, రెండోది ఆదిలాబాద్ ఎట్లాగు ఉంటుంది ఇగ మారుమూల ప్రాంతాలైన ఆసిఫాబాద్, మంచిర్యాలలు జిల్లాలు కావాలని పట్టుపట్టి, మీరు ఏం చేసినా సరే నాలుగు జిల్లాలు చేయాలని చెప్పి గంటసేపు నాతో వాదించి.. ఈ నాలుగు జిల్లాలు అయ్యేట్లు చేసిన వ్యక్తే ఇంద్రకరణ్రెడ్డి అని స్పష్టం చేశారు. ఇవాళ నిర్మల్లో మీరు ఎంత సంతోషంగా ఉన్నారో, అక్కడ వాళ్లు కూడా అంతే సంతోషంగా ఉన్నారని, ఆసిఫాబాద్, మంచిర్యాలలను జిల్లాలు చేసినందుకు చేతులెత్తి దండం పెడతా ఉన్నారని పేర్కొన్నారు.
మారుమూల ఉన్న ఈ నాలుగు జిల్లాలకు ఇవాళ బ్రహ్మాండంగా నాలుగు మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు. ఏ రోజైనా అనుకున్నామా.. నిర్మల్కు మెడికల్ కాలేజీ వస్తదని, ఎన్నడన్న ఊహించినమా ఆలోచించాలన్నారు. మీ ఇంద్రకరణ్రెడ్డి చాలా హుషారుగా ఉన్నడని.. ముందు జిల్లా చేస్తే చాలు సర్ ఏం అడుగా అనిచెప్పి ఒక్కొక్కటి అన్ని అడుగుతున్నారంటూ సీఎం కేసీఆర్ చమత్కరించారు. జిల్లా అయ్యింది. మెడికల్ కాలేజీ అయ్యింది. ఇవాళ అడుగుతాడని నేను అనుకోలే కానీ ఇంజినీరింగ్ కాలేజీ కావాలని అడిగారన్నారు. మంచి నాయకుడు తను పుట్టిన ప్రాంతం మీద ప్రేమ ఉన్నది కాబట్టి డెవలప్ చేసుకోవాలని అడుగుతున్నారన్నారు. ఇంద్రకరణ్రెడ్డి ఎలక్షన్ల గెలిచి పోయిండని ఈ సభనే చెప్తుందన్నారు.
దాంట్లో ఎలాంటి డౌటే లేదన్నారు. ఇవాళ సభలోనే రిజల్ట్ ఔటై పోయిందన్నారు. ఇంద్రకరణ్రెడ్డి ఎంత సౌమ్యుడో, ఎంత మంచి మనిషో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదని, ప్రజల కోసం ఎంత తండ్లాడుతాడో మీకు తెలుసన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఇవాళ నిర్మల్ పట్టణం, నిర్మల్ జిల్లా ఎంత బాగా అభివృద్ధి చెందాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మంచినీళ్లు, సాగునీరు ఏ విధంగా ఆయన తపన పడి తెస్తున్నరో మీ అందరికీ తెలుసునన్నారు. ఇంజినీరింగ్ కాలేజీ పెద్ద విషయం కాదని, ఈసారి ఎన్నికల్లో ఇంద్రకరణ్రెడ్డికి 70 వేలు, 80 వేలు మెజార్టీ వస్తే డెఫినెట్గా జేఎన్టీయూ నుంచి ఇంజినీరింగ్ కాలేజీ ఇప్పించే బాధ్యత నాది అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఇక్కడ మా వేణుగోపాలాచారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలంటే, ఒక సబ్స్టేషన్ కావాలంటే, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఏ విధంగా లంచాలు పెట్టినమో.. ఎట్లా మునిగినమో రైతులందరికీ తెలుసునన్నారు. కరెంట్ లేకుండేనని, చాలా ఘోరమైన పరిస్థితి ఉండేనని చెప్పారు. ఈ రోజు కరెంట్ను బాగు చేసుకున్నామన్నారు. ఇంద్రకరణ్రెడ్డి ఒక్కరే 15 సబ్స్టేషన్లు నియోజకవర్గంలో కట్టించుకున్నారన్నారు. ఒక నిర్మల్ నియోజకవర్గంలో ఒకటే టర్మ్లో 15 సబ్స్టేషన్లు తెచ్చారని, ఎక్కడ అవసరమైతే అక్కడ కట్టుకున్నారని చెప్పారు.
ఇక మా గిరిజన బిడ్డలు, లంబాడా బిడ్డలు ‘లంబాడ హక్కుల పోరాట సమితి’ అని ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నారన్నారు. ‘మా తండాలో మా రాజ్యం’ కావాలని, నేను ఆదిలాబాద్ వచ్చినప్పుడు గోండు గూడేలలో ‘మావ నాటే.. మావ రాజ్’ అని మాట్లాడారన్నారు. ఏ ప్రభుత్వం కూడా చేయలేదని, కనీసం వాళ్లను పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో నాలుగు వేల గిరిజన తండాలను, గోండు గూడేలను, ఆదివాసీ గూడేలను ఇండిపెండెంట్ పంచాయతీలుగా చేశామన్నారు. ఇవాళ లంబాడా బిడ్డలందరూ వాళ్ల తండాల్లో వాళ్లే రాజ్యం పరిపాలిస్తున్నారని.. బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుంటున్నారన్నారు. పోడు పట్టాలు ఇచ్చి 4 లక్షల ఎకరాలు పంచి పెట్టి, రైతుబంధు కూడా ఇచ్చి త్రిఫేజ్ ఉచిత కరెంట్ కూడా ఇస్తున్న ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందన్నారు.
నిర్మల్ నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన అన్నదమ్ములు, అక్కాచెల్లెల్లను ఒక్కటే కోరుతున్నా. పార్టీల చరిత్ర చూసి ఓటేయాలని పిలుపునిచ్చారు. ప్రతి పార్టీకి ఒక చరిత్ర ఉంటుందని, ఇవాళ మా పార్టీ ఏం చేసిందనేది అంతా మీ కండ్ల ముందు ఉందని చెప్పారు. ఎన్నికలు రాగానే ఆగమై అంతా మర్చిపోవొద్దని ప్రజలు కోరుకున్న, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర మంత్రి, నిర్మల్ బీఆర్ఎస్ అభ్యర్థి ఇంద్రకరణ్రెడ్డి, రాజ్యసభ సభ్యులు దామోదర్రావు, ఎమ్మెల్సీ దండే విఠల్, ఖానాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్, బోథ్ అభ్యర్థి అనిల్ జాదవ్, మాజీ మంత్రి, మాజీ ఎంపీ సముద్రాల వేణుగోపాలాచారి, నిర్మల్ జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి రామకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి వి.సత్యనారాయణగౌడ్, స్థానిక ఎంపీపీలు, జడ్పీటీసీలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.