‘భైంసా, ముథోల్, నిర్మల్, ఆదిలాబాద్, హైదరాబాద్లలో హిందూ, ముస్లింలు ఉన్నరు. వందల ఏండ్లుగా ఎవరికీ తోచినపని వారు చేసుకుంటూ కలిసి బతుకుతున్నరు. భైంసాలో కొట్టుకు చస్తరు, తన్నుకు చస్తరు అని అబద్ధాలు చెప్పి మత పిచ్చి లేపుతున్నరు. అదేదో యుద్ధం అన్నట్టు చిత్రీకరిస్తున్నరు.’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో శుక్రవారం నిర్వహించిన ముథోల్ నియోజకవర్గ ‘ప్రజా ఆశీర్వాద సభ’కు హాజరై ప్రసంగించారు. బీఆర్ఎస్ సర్కారు అన్ని మతాలు, కులాలను కలుపుకొని ముందుకు పోతున్నదన్నారు.
ఈ పదేండ్ల పాలనలో ఒక్కనాడు కర్ఫ్యూ లేదు, లాఠీచార్జి లేదని గుర్తు చేశారు. ఇలా తెలంగాణ ప్రశాంతంగా ఉండాలా.. మత పిచ్చి మంటలతోని నెత్తురు పారాలా.. ఒక్కసారి ప్రజలారా ఆలోచించాలని కోరారు. బాసర సరస్వతీ అమ్మవారి పుణ్యక్షేత్రానికి ఇప్పటికే రూ.50 కోట్లు ఇచ్చాం. ఇంకా ఎన్ని నిధులైనా ఇస్తామని హామీ ఇచ్చారు. గడ్డెన్నవాగును బాగు చేయడంతో నాలుగు వేల ఎకరాలు పారేది.. ప్రస్తుతం 12 వేల ఎకరాలు పారుతున్నదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఓటు కోసం వస్తే మీకెందుకు వేయాలని నిలదీయాలని సూచించారు. ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపోళ్లను ప్రశ్నించాలని పేర్కొన్నారు.
– మంచిర్యాల, నవంబర్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
పాండురంగ దేవుడు పైనున్నడు. కానీ.. కనిపించే దైవం కేసీఆర్ మన ముందున్నడు. ముథోల్ నియోజకవర్గానికి అడిగినవన్నీ సమకూర్చారు. కొన్ని మిగిలున్నాయి. వాటిని మీ ముందుంచుతున్న. గుండేగాం ముంపు గ్రామానికి విడుదలైన రూ.90 కోట్లను విడుదల చేయాలి. 28వ ప్యాకేజీ పనులను టెండరు పిలిచి పనులు చేయించాలి. సిరాల ప్రాజెక్టు కింద పంట నష్టం రూ.11 కోట్లు అని అంచనా వేశాం. వీటితోపాటు ఎనిమిది చిన్న ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేయాలి. గడ్డెన్నవాగు ప్రాజెక్టు లైనింగ్ మిగిలిన పనులు పూర్తి చేయాలి. బాసర ఆలయాభివృద్ధికి రూ. 50 కోట్లు ఇచ్చారు. ఇంకా రూ. 100 కోట్లు ఇవ్వాలి. గృహలక్ష్మి కింద మరో 2 వేల ఇండ్లు మంజూరు చేయాలి. మరో 500 దళితబంధు ఇవ్వాలి. ఎస్టీ గిరి వికాస్ గృహాలు, బాలికల రెసిడెన్షియల్, ఐఐటీ కాలేజీ మంజూరు చేయాలి. మహారాష్ట్రకు చెందిన ఎస్టీలు 30 ఏండ్లుగా తెలంగాణలో ఉంటున్నారు. వారికి ఎస్టీ సర్టిఫికేట్ ఇవ్వాలి.
– ముథోల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్రెడ్డి
మంచిర్యాల, నవంబర్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : భైంసా, ముథోల్, నిర్మల్, ఆదిలాబాద్తోపాటు హైదరాబాద్లో హిందూ, ముస్లింలు ఉన్నారు. వీళ్లంతా ఎప్పటి నుంచి ఉన్నరు నిన్న, మొన్నటి నుంచి ఉంటున్నరా.. ఎన్నో వందల ఏండ్లుగా అందరం కలిసి బతుకుతున్నాం. ఎవరికి తోసిన పని వాళ్లు చేసుకొని బతుకుతున్నాం. తంపులాటలు, తాకులాటలు పెట్టి మతపిచ్చి లేపి భైంసా అంటేనే అదేదో యుద్ధం అన్నట్లు చిత్రీకరిస్తున్నారు.
ఇక్కడ రోజు తన్నుకు చస్తరు, కొట్టుకు చస్తరు అన్నట్లు అబద్ధాలు చెప్పి మన మధ్య చిచ్చుపెట్టే కార్యక్రమాలు చేస్తున్నరని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా భైంసాలో శుక్రవారం నిర్వహించిన ముథోల్ నియోజకవర్గ ‘ప్రజా ఆశీర్వాద సభ’లో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన పదేండ్లలో ఒక్కనాడు కర్ఫ్యూ లేదు, లాఠీచార్జి లేదన్నారు. ఇలా తెలంగాణ ప్రశాంతంగా ఉండాలా.. మత పిచ్చి మంటలతోని నెత్తురు పారాలా మీరు ఆలోచించాలన్నారు.
ఎవరి బతుకువాళ్లు బతక్క ఇంకొకరి మీద ధ్వేషం పెట్టుకొని, కక్ష పెట్టుకొని ఏం సాధిస్తామని, దానితో ఏం రాదని, కలిసిమెలిసి బతకడంలోనే శాంతియుతమైన సహజీవనం ఉంటుందని పేర్కొన్నారు. అన్ని మతాలు, కులాలు కలిసి ముందుకు పోవాలని పిలుపునిచ్చారు.
బాసర ఆలయానికి రూ.50 కోట్లు ఇచ్చినం.. మనం చదువు మొదలుపెడితే సరస్వతీ నమస్తుభ్యం అని ప్రార్థన చేసి మొదలుపెడుతామని, అలాంటి చదువుల తల్లి బాసర సరస్వతీ దేవి కొలువైన ఈ పవిత్రమైన పుణ్యభూమికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. గతంలో ఇక్కడ ఎప్పుడూ గోదావరి పుష్కరాలు జరగలేదని, తెలంగాణ వచ్చాక బ్రహ్మాండంగా బాసరలో గోదావరి పుష్కరాలు జరుపుకుంటున్నామని చెప్పారు.
ఇంతకు ముందే బాసర ఆలయ అభివృద్ధి కోసం రూ.50 కోట్లు మంజూరు చేశామని, వాటితో పనులు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ఇంకా నిధులు కావాలని అడుగుతున్నారని, తప్పకుండా అవసరమైనన్నీ నిధులు బాసరకు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. కడుపు కట్టుకొని, నోరు కట్టకొని చిత్తశుద్ధితో, ఒక పట్టుదలతో మొండి పద్ధతుల్లో పని చేసే ప్రభుత్వం మనదన్నారు. తెలంగాణ వచ్చే సమయానికి అంత ఆగమాగం ఉండేనని మంచినీళ్లు లేవు, కరెంట్ లేదు, తాగునీరు లేవు, ప్రజలు బతకలేక వలసలు పోయేదన్నారు. తెలంగాణ వచ్చాక వ్యవసాయాన్ని స్థిరీకరించడం కోసమని సాగునీరు ఇస్తున్నామన్నారు. గడ్డెన్న వాగు లాంటి ప్రాజెక్ట్ నుంచి నీళ్లు పారితే దానికి ఇంతకుముందు నీటి తీరువా అని ఉండేదన్నారు. కానీ.. ఇప్పుడు మనకు నీటి మీద పన్ను లేదన్నారు.
ఇక్కడ గడ్డెన్న వాగు ప్రాజెక్టు ఉందని, విఠల్రెడ్డి తండ్రి గడ్డెన్న ఇక్కడ ఎమ్మెల్యేగా చాలా సేవ చేశారని, మంచి పనులు చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అలాంటి గడ్డన వాగు ప్రాజెక్టు కింద వాస్తవానికి 14 వేల ఎకరాలకు నీరు పారాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు కేవలం 4 వేల ఎకరాలకు కూడా నీరు వచ్చేది కాదన్నారు. విఠల్రెడ్డి నా వెంట పడి కచ్చితంగా ఈ కాలువలు మంచిగ చేయాలని చెప్పి డబ్బులు మంజూరు చేయించి, పనులు చేయించారన్నారు. దీంతో ఇవాళ 12 వేల ఎకరాలకు నీళ్లు వస్తున్నాయన్నారు. మిగిలిన రెండు, మూడు వేల ఎకరాలకు నీరు అందించేందుకు అవసరమైన పనుల కోసం కూడా డబ్బులు మంజూరు చేశామని, అవి త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు.
అదే విధంగా మనం ఎస్సారెస్పీ నుంచి లిఫ్ట్ పెట్టుకున్నామని, దాని పనులు కొంత ఆలస్యమైనా మొన్ననే పునఃప్రారంభయ్యాయన్నారు. అది ఒకసారి వచ్చిందంటే ముథోల్, తానూర్, లోకేశ్వరం మండలాల్లో 50 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు. ఇప్పటికే చెరువులన్నీ బాగు చేసుకున్నామని, వాగుల మీద చెక్ డ్యామ్లు కట్టుకున్నామని చెప్పారు. మరి ఈ పనులన్నీ 50 ఏండ్లలో కాంగ్రెస్ ఎందుకు చేయలేదో ఆలోచించాలన్నారు. నీరు లేక ఒకప్పుడు ఈ ఏరియా మొత్తం పత్తి తప్ప ఇంకోటి పండించేది కాదన్నారు. ఇవాళ వరి, కూరగాయాలు, ఇతర పంటలు పండిస్తూ రైతులు మంచి లాభాలు గడిస్తున్నారన్నారు. రైతుబంధు సాయంతో రైతుల అప్పులు తీరుతా ఉన్నాయని చెప్పారు.
ఇవాళ ఇక్కడ తిరిగే బీజేపీ పార్టీని మీరు ఒక ప్రశ్న అడగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఒక్క మెడికల్ కాలేజీ మా రాష్ర్టానికి ఇవ్వని మీకు ఒక్క ఓటు ఎందుకు వేయాలి, 33 నవోదయ పాఠశాలలు రావాల్సిన మా రాష్ర్టానికి ఒక్క నవోదయ కాలేజీ ఎందుకు ఇవ్వని మీకు ఎందుకు ఓటేయాలని నిలదీయాలన్నారు. నవోదయ పాఠశాలలు ఇచ్చి ఉంటే మన ముథోల్కు కూడా ఒక నవోదయ పాఠశాల ఇప్పటికే వచ్చేదన్నారు. రైతుబంధు దుబారా అని, వ్యవసాయానికి 24 గంటల కరెంట్ వద్దని, ధరణి రద్దు చేయాలని చెప్తున్నందుకు కాంగ్రెస్కు ఎందుకు ఓటే వేయాలి అని నిలదీయాలన్నారు. ఇవేవి చేయకుండా ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారో నిలదీసి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
మన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల కింద గ్రామాలు ఎట్లా ఉన్నాయో, చెట్లు ఎట్లా పెరుగుతున్నయో మీకు తెలుసు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. భైంసా లోపల రోడ్లు ఎలా వెడల్పు అయ్యాయో, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఎలా వచ్చిందో, రోడ్డు డివైడర్ల మధ్యలో ఎంత బాగా చెట్లు పెరుగుతున్నాయో, పట్టణం ఏ విధంగా మంచిగైందో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని కులం లేదు, మతం లేదు.
ముందుకుపోతున్నామన్నారు. ఈ ప్రాంతంలో బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని విఠల్రెడ్డి చెప్పారని, ఒక్క ఈ ప్రాంతంలోనే కాదు బీడీ కార్మికులు భారతదేశంలోని 19 రాష్ర్టాల్లో ఉన్నారన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో పింఛన్ ఇవ్వడం లేదని, కేవలం మన దగ్గరే రూ.2 వేలు ఇస్తా ఉన్నామన్నారు. ఇప్పుడు పింఛన్ పెరిగితే బీడీ కార్మికులకు కూడా పెరుగుతుందన్నారు. కొత్త వాళ్లకు కూడా కావాలని అడుతున్నారని, దాని కోసం తప్పకుండా ఎన్నికలయ్యాక ఆలోచన చేస్తామన్నారు. ఒక్క బీడీ కార్మికులనే కాకుండా మిగిలిన పేద, బడుగు, బలహీన వర్గాలకూ బీఆర్ఎస్ గెలిస్తే ముందుకు తీసుకుపోతుందన్నారు. మీ అందరూ దయచేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించి, విఠల్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎమ్మెల్యే ముథోల్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విఠల్రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, మాజీ ఎంపీ జీ.నగేశ్, మాజీ శాసనసభ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి, నమస్తే తెలంగాణ సీఎండీ, ఎంపీ దామోదర్రావు, బీఆర్ఎస్ నాయకురాలు రమాదేవి, విలాస్ గాదేవార్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ముథోల్ నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన అశేష జనవాహిని సభలో పాల్గొన్నారు.
భైంసా పట్టణంలో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. నియోజకవర్గంలోని బాసర, లోకేశ్వరం, ముథోల్, కుభీర్, తానూర్, కుంటాల, భైంసా మండలాల నుంచి ఉదయం 10 గంటల నుంచే శ్రేణులు, ప్రజల రాక మొదలైంది. సీఎం కేసీఆర్ వచ్చే సమయానికి ఆ ప్రాంతం కిక్కిరిసిపోయి గులాబీ వనాన్ని తలపించింది. ఎటు చూసినా ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్రెడ్డి కటౌట్లు, ఫ్లెక్సీలు, కండువాలు కనిపించాయి. మొత్తం 35 వేల కుర్చీలు వేస్తే.. అవి సరిపోక జనం చుట్టుపక్కల ఉన్న చెట్లు, టెంట్ల కింద.. ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో నిలబడాల్సి వచ్చింది. 50 వేల మందికి పైగా వచ్చారు.
సభ ప్రాంతంలో ఎండ తగలకుండా భారీ టెంట్లు వేశారు. భోజనంతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించారు. సీఎం కేసీఆర్ సభా ప్రాంగణానికి రాగానే.. ఆయనను చూసేందుకు జనం ఎగబడ్డారు. ముఖ్యమంత్రి మాట్లాడుతున్నంత సేపు.. జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జైజై విఠల్రెడ్డి నినాదాలతో హోరెత్తించారు. గాయని మధుప్రియ ఆధ్వర్యంలో తెలంగాణ కళాకారులు ఆటా.. పాటలతో హోరెత్తించారు. వేదికపై ఉన్న నాయకులతో పాటు ప్రజలు స్టెప్పులేస్తూ ఉత్సాహ పరిచారు. లంబాడాల నృత్యం ఆకట్టుకున్నది. సీఎం కేసీఆర్ ప్రసంగం శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపింది. జన ప్రభంజనాన్ని చూసి బీఆర్ఎస్ అభ్యర్థి విఠల్రెడ్డి గెలుపు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమైంది.
– నిర్మల్, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ)