సమైక్య పాలనలో అధ్వాన స్థితిలో ఉన్న పోరు పల్లెలు, స్వరాష్ట్రంలో ప్రగతి బాట పట్టాయి. 2014లో కుమ్రం భీం వర్ధంతికి హాజరైన సీఎం కేసీఆర్ జోడెఘాట్ సాక్షిగా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చగా, దశాబ్దాల ఇబ్బందులు తొలగిపోయాయి. ప్రధానంగా రూ.15.70 కోట్లతో డబుల్ రోడ్డు నిర్మించగా, 12 గ్రామాల ‘దారి’ద్య్రం పోయి రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. ఇక రూ.25 కోట్లతో నిర్మించిన మ్యూజియంతోపాటు స్మారక చిహ్నాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/కెరమెరి, మే 16 : నాడు ఏ చిన్న పని పడినా గుట్టలు దిగి రావాల్సి వచ్చేది. 23 కిలో మీటర్ల దూరంలోని కెరమెరికి కాలినడకన వెళ్లాల్సి వచ్చేది. రాత్రి అయితే అటవీ జంతువుల భయానికి అక్కడే ఎక్కడో ఒకచోట పడుకుని తెల్లారి వచ్చే పరిస్థితి ఉం డేది. ఇవీ.. సమైక్య రాష్ట్రంలో ఆదివాసీ గ్రామాల ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు. కానీ.. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ చొరవతో ఆ పల్లెలన్నీ ప్రగతిబాట పట్టాయి. ప్రధానంగా డబుల్ రోడ్డు నిర్మించి 12 గ్రామాల తిప్పలు తొలగింప జేయగా, సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
జోడెఘాట్కు డబుల్ రోడ్డు..
కెరమెరి మండలం హట్టి గ్రామం నుంచి జోడెఘాట్ సుమారు 23 కిలోమీటర్లు ఉంటుంది. నాడు సరైన రోడ్డు వసతి కూడా ఉండేది కాదు. జోడెఘాట్తోపాటు మార్గమధ్యంలో ఉన్న 12 ఆదివాసీ గ్రామాల ప్రజలు కూడా కెరమెరి మండల కేంద్రానికి వెళ్లాలంటే ఎంతో వ్యయప్రయాసలు పడాల్సి వచ్చేది. 2014లో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా జోడెఘాట్ను సందర్శించి అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. ప్రధానంగా రూ.15.70 కోట్లతో రెండు వరుసల రహదారి నిర్మించారు. జోడెఘాట్తో పాటు పిట్టగూడ, టోకెన్మోవాడ్, బాబెఝరి, శివగూడ, కొలాంగూడ, చిన్నపాట్నాపూర్, పాట్నాపూర్, గోపర, లైన్పటార్, పాఠగూడ, చాల్బడి గ్రామాలకు రహదారి సౌకర్యం కలిగింది. గతంలో తమ అవసరాల దృష్ట్యా మండల కేంద్రానికి కాలినడక, ఎడ్ల బండ్లపైనే వెళ్లేవారు. దశాబ్దాలపాటు అష్టకష్టాలు పడ్డ గిరిజనులు ఇప్పుడు నిమిషాల వ్యవధిలోనే మండల కేంద్రానికి చేరుకోగలుగుతున్నారు. ఏదైనా ఆపద వస్తే ఒక్క ఫోన్కాల్తో అంబులెన్స్ వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్తోంది. జోడెఘాట్ గ్రామానికి రెండు వరుసల శాశ్వతమైన రహదారి నిర్మాణంతో పోరు గ్రామాల ప్రజలకు దారి కష్టాలు శాశ్వతంగా దూరమయ్యాయి.
పర్యాటక ప్రగతి..
తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జోడెఘాట్ పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందింది. రూ. 25 కోట్లతో గిరిజన మ్యూజియం, స్మారక చిహ్నం, స్మృతి వనం కూడా ఏర్పాటు చేసింది. 12 గ్రామాల పరిధిలోని పిల్లల కోసం రూ. 2.95 కోట్లతో ఆశ్రమ పాఠశాల నిర్మించారు. జోడెఘాట్తోపాటు పరిసర గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించారు. 12 గ్రామాలకు ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తున్నారు. జోడెఘాట్ గ్రామానికి త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించారు. గిరిజన రైతులకు ఎడ్ల జతలు, బండ్లను ఐటీడీఏ ద్వారా అందించారు. విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెచ్చారు. జోడెఘాట్లో ప్రత్యేకంగా 26 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారు. మా ఊళ్లో.. మా రాజ్యం అనే భీం నినాదానికి జీవం పోసిన తెలంగాణ ప్రభుత్వం, 500 జనాభా కలిగిన గిరిజన గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. జిల్లా నుంచేకాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా జోడెఘాట్ను సందర్శించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
జోడెఘాట్కు పేరు తీసుకొచ్చిన్రు..
తెలంగాణ వచ్చినంక మా ఊరు మంచిగైంది. కేసీఆర్ సార్ జోడెఘాట్కు వచ్చి మా బాధలను తెలుసుకున్నడు. కెరమెరి నుంచి జోడెఘాట్ దాకా పెద్ద రోడ్డు వేయించిన్రు. జోడెఘాట్ పక్కన ఉన్న అన్ని ఊర్లకు నల్లాలతోనే ఇంటింటికీ నీళ్లు వస్తున్నయ్. కరెంటు కూడా వచ్చింది. జోడెఘాట్లో అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చినయ్. మా జోడెఘాట్ని సూసేందుకు బాగా మంది వస్తున్నరు. జోడెఘాట్కు మంచి పేరు తీసుకొచ్చిన్రు.
– టేకం మాని, జోడెఘాట్
ఇప్పుడు అట్లపోయి.. ఇట్ల వస్తున్నం
తెలంగాణ రాకముందు మమ్ముల పట్టించుకున్నోళ్లు లేకుండే. ముఖ్యంగా రోడ్డు లేక మస్తు తిప్పల పడ్డం. కెరమెరికి పోవాలంటే కాలినడకే దిక్కయ్యేది. లేదంటే ఎడ్ల బండ్ల మీద పోవాల్సి వచ్చేది. కెరమెరికి పోయిరావాల్నంటే రోజంతా పట్టేది. తెలంగాణ వచ్చినంక జోడెఘాట్కు డబుల్ రోడ్డు వేసిన్రు. ఇప్పుడ మా ఊరికి ఆటోలు వస్తున్నయ్. ఇప్పుడు అట్లపోయి.. ఇట్ల వస్తున్నం. రోడ్డు మంచిగైనంక జోడెఘాట్ను చూసేందుకు అనేక మంది కార్లళ్ల వస్తున్నరు.
– బాదిరావు, జోడెఘాట్