కల్లుగీత వృత్తిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతూ సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పింఛన్, కల్లు అద్దెలు, బాకాయిల మాఫీ, మద్యం దుకాణాల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గౌరవించారు. తాజాగా గౌడన్నలకు ధీమా కల్పించడానికి రైతుబంధు తరహాలో గీత కార్మికులకు బీమా కల్పించాలని చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. కల్లుగీస్తూ ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోతే బీమా వర్తించనుంది. వారంలోనే బాధిత కుటుంబాల నామినీ ఖాతాలో రూ.5 లక్షలు జమ కానున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 3,896 మంది అర్హులు ఉండగా.. గౌడ కులస్తులు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
– మంచిర్యాల ప్రతినిధి/నిర్మల్, మే 3(నమస్తే తెలంగాణ)
కల్లుగీస్తూ దురదృష్టకర పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోయిన గీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఇప్పటికే ప్రభుత్వం తరఫున ఎక్స్గ్రేషియా అందిస్తున్నాం. బాధితులకు పరిహారం అందడంలో ఆలస్యం అవుతున్నది. ఈ నేపథ్యంలో కల్లుగీతను వృత్తిగా కొనసాగిస్తున్న గౌడన్నల కుటుంబాలకు వారంలోనే బీమా నగదు అందేలా నిర్ణయించాం.
– ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు
మంచిర్యాల, మే 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కల్లుగీత కార్మికుల బతుకులకు భరోసానిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. రైతుబీమా తరహాలోనే గీతకార్మికుల బీమాను రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన గీత కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సాయాన్ని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు అవసరమైన విధివిధానాలు రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీనిపై గీత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బీమా రావాలంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతోపాటు సాక్షులు, డెత్ సర్టిఫికెట్, ఇతర పేపర్ వర్క్ కావడానికే నెలలు గడిచిపోయేవని, బీమా చెక్కు వచ్చేందుకు ఏండ్లు అయ్యేదన్నారు. అలాంటి కష్టాలు ఎవరూ పడొద్దనే ఉద్దేశంతో వారంలోనే బీమా డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకోవడం గొప్ప విషయం అని గౌడన్నలు సంబుర పడిపోతున్నారు. ఈ పథకం కింద రాష్ట్రంలో 2.4 లక్షల గీతకార్మికుల కుటుంబాలకు భరోసా లభించనుండగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 3,896 మందికి బీమా వర్తించనుంది.
అండగా ప్రభుత్వం..
కల్లు గీత కార్మికులకు పింఛన్లు ఇస్తుండడంతోపాటు అనేక రకాల సంక్షేమ పథకాలను అందిస్తున్నది. మంచిర్యాల జిల్లాలో 83,855 తాటి, ఈత చెట్లు ఉండగా వీటిపై 2,073 మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారు. కల్లుగీత కార్మికుల ప్రమాద బీమా పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 8 మంది లబ్ధిపొందారు. ఒకరు పూర్తిస్థాయి వైకల్యంతో రూ.5 లక్షలు, మరో ఇద్దరు చెట్టుపై నుంచి పడి మృతి చెందిన వారు ఒకొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ.10 లక్షలు, ఐదుగురు చెట్టు మీద నుంచి పడి గాయాలపాలైన వారికి రూ.10 వేల చొప్పున ఐదుగురి రూ.50 వేలు బీమా వచ్చింది. నిర్మల్ జిల్లాలో 2014 తరువాత ఇద్దరు చనిపోగా.. వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, శాశ్వత అంగవైకల్యం పొందిన మరొకరికి రూ.5 లక్షలు ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో మృతిచెందిన ఒక గీతకార్మికుడి కుటుంబానికి రూ.5లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించారు. ఇదే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చెట్లపై పన్నును తెలంగాణ ప్రభుత్వం వచ్చాక రద్దు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది గౌడన్నలకు లబ్ధి చేకూరింది.
మంచిర్యాల 2,073
నిర్మల్ 1518
ఆసిఫాబాద్ 140
ఆదిలాబాద్ 165
గీత కార్మికుల కుటుంబాలకు మేలు
రైతుబీమా మాదిరిగా గీత కార్మికులకు కూడా బీమా పథకాన్ని వర్తింప జేస్తామనడం చాలా సంతోషం. ఇంటి పెద్ద ప్రమాదవశాత్తు చనిపోతే నామినీ బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షలు జమ చేయడం మంచి నిర్ణయం. దీంతో గౌడన్నల కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుంది. మా దిమ్మదుర్తి చెరువు కట్టపై ఆబ్కారీ శాఖ అధికారులు ఏడాది కింద 2 వేల ఈత మొక్కలు నాటారు. అవి పెరుగుతున్నయ్. నాలుగేళ్లలో గీతకు వస్తయ్. మా ఊరిలో మొత్తం 58 మంది గీత కార్మికులు ఉన్నారు. కొత్త చెట్లు గీతకు వస్తే మా అందరి ఆదాయం పెరుగుతుంది. ఇప్పటికే ఇక్కడ 1500 తాటి చెట్లు ఉన్నయ్. నేను రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నా.
– పొన్నం సురేందర్గౌడ్, గీత కార్మికుడు, దిమ్మదుర్తి, మామడ మండలం
ఆనందంగా ఉంది..
లక్షెట్టిపేట, మే 3 : గీత కార్మికులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నామంటూ కేసీఆర్ ప్రకటించడం సంతోషంగా ఉంది. తెలంగాణ వచ్చాకే గీత కార్మికులకు గుర్తింపు వచ్చింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తాటి చెట్టు ఎక్కి కల్లుగీస్తం. కిందికి దిగేంత వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటం. ఎండనక, వాననక చెట్టు ఎక్కి కల్లు గీయాల్సిందే. కార్మికులు చాలా మంది ప్రమాదవశాత్తు పడి చనిపోయిన ఘటనలు ఉన్నాయి. అలాంటి కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడ్డాయి. ఇటువంటి వారిని ఆదుకోవాలని కోరితే.. గత ప్రభుత్వాలు పట్టించుకోలే. స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వయసు పైబడిన గీత కార్మికులకు పింఛిన్ ఇచ్చిండు. ఇప్పుడు రైతు బీమా తరహాలో గీత కార్మికులకు కూడా బీమా సదుపాయం కల్పించనున్నట్లు చెప్పడం ఆనందంగా ఉంది.
– బాలసాని రాజాగౌడ్, గీత కార్మికుడు, లక్షెట్టిపేట
బీమాతో భరోసా
వాంకిడి, మే 3 : మా వృత్తి ప్రమాదంతో కూడుకున్నది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. గిది ఆలోచించేనేమో ముఖ్యమంత్రి కేసీఆర్ బీమా తీసుకొచ్చారు. గీ బీమా మా కుటుంబాలకు భరోసాగా ఉంటుంది. ఏదైనా ప్రమాదం జరిగి గీత కార్మికుడు మృతి చెందితే నేరుగా రూ. 5 లక్షలు ఖాతాలో జమ చేయాలని నిర్ణయించడం గొప్ప విషయం.
– కొండ రాజాగౌడ్, గీత కార్మికుడు, గోయోగా
గొప్ప నిర్ణయం..
వాంకిడి, మే 3 : రైతుబీమా తరహాలోనే గీత కార్మికుల కుటుంబాలకు భరోసానిచ్చేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. మధ్యవర్తిత్వం లేకుండా నేరుగా బ్యాంక్ ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తి ఉన్నంత కాలం ప్రజలకు మేలు చేకూరుతుంది.
– కే శ్రీనివాస్ గౌడ్, గీత కార్మికుడు, గోయోగాం
మా జీవితాలు బాగుపడ్డయ్..
32 ఏళ్లుగా గీతకార్మిక వృత్తిలో కొనసాగుతున్న. గతంలో మా గురించి ఎవరూ పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాతనే మా గీత కార్మికుల జీవితాలు బాగు పడ్డయ్. సొసైటీకి కట్టే లైసెన్సు ఫీజు మాఫీ చేసిండు. పనుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదు. ఎక్సైజ్ అధికారుల దాడులు లేవు. అన్నీ బాగున్నయ్. గతంలో యేటా లైసెన్సులను రెన్యువల్ చేయాల్సి ఉంటుండే. ఇప్పుడా పరిస్థితి లేదు. కొత్తగా రూ.5 లక్షల బీమా ఇస్తమని చెబుతున్నరు. ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు వెంటనే ఆర్థిక సాయం అందితే మంచిదే కదా. మా కుటుంబాలకు ఇంతకన్నా ఏం కావాలే. మా ఇంటి పక్కనే ఉండే ఆరే గంగమల్లు గౌడ్ 52 ఏళ్ల వయసులో చెట్టు ఎక్కేటప్పుడు గుండెపోటుతో చనిపోయిండు. పరిహారం కోసం వారి కుటుంబ సభ్యులు ఏండ్ల తరబడి ఆఫీసుల చుట్టూ తిరిగిన్రు. గీత కార్మికుల బీమా పథకం వస్తే ఇలాంటి బాధలు తప్పుతయ్.
– చెక్కిళ్ల రాజేశ్వర్గౌడ్, గీత కార్మికుడు, దిలావర్పూర్, ఖానాపూర్ మండలం
అండగా ప్రభుత్వం
గీత కార్మికులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. అన్ని వర్గాల, కులాల సంక్షేమానికి కృషి చేస్తున్నారు. ఇప్పటికే చెట్ల లైసెన్సు బకాయిలను రద్దు చేశారు. గతంలో ఏడాదికి ఒకసారి లైసెన్స్ రెన్యూవల్ కోసం ఎక్సైజ్ ఆఫీసు చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఆ సమయంలో అధికారులు అందుబాటులో లేకుంటే రోజుల తరబడి మా పనులు మానుకోవాల్సి వచ్చేది. కల్లు గీత కార్మికులకు ఇప్పుడు ఎలాంటి బాధలు లేవు. ప్రతినెలా పింఛన్లు కూడా ఇస్తున్నరు. గ్రామంలో మాకు మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లరు. నాన్న రాజన్న పేరు మీద భూమి ఉండడంతో రైతుబీమా వర్తిస్తది. ఇదే తరహాలో ఇప్పుడు సీఎం కేసీఆర్ కొత్తగా గీత కార్మికులకు కూడా బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించారు. దీనివల్ల గీత కార్మికుల కుటుంబాలకు మేలు జరుగుతుంది. ఉమ్మడి పాలనలో మేము అనేక ఇబ్బందులు పడ్డాం. గౌడ కులస్తులు సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటారు.
– సింగం నరేశ్ గౌడ్, గీత కార్మికుడు, గోడలపంపు, ఖానాపూర్ మండలం
గీత కార్మిక కుటుంబాలకు భరోసా
కోటపల్లి, మే 3 : సమైక్య పాలనలో గీత కార్మికులను పట్టించుకున్నోళ్లు లేకుండే. తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక మా బతుకుల్లో మార్పు వచ్చింది. సీఎం కేసీఆర్ గీతన్నల కోసం ఇప్పటికే అనేక పథకాలు తీసుకొచ్చిన్రు. గీత కార్మికులకు పింఛన్లు ఇస్తున్నరు. కల్లు అద్దెలు, బకాయిలు మాఫీ చేస్తున్నరు. వైన్స్ టెండర్లలో 15 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఇప్పుడు బీమా పథకం కూడా తీసుకొచ్చారు. ఈ నిర్ణయం కుల వృత్తినే నమ్ముకొని జీవిస్తున్న గీత కార్మిక కుటుంబాలకు భరోసాగా ఉంటుంది. ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉన్నంత కాలం ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటరు. ఇది ముమ్మూటికీ నిజం.
– ముక్కెర శంకర్ గౌడ్, చెన్నూర్
గీత కార్మికుల కష్టం తెలిసిన నేత కేసీఆర్
వాంకిడి, మే 3 : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గీత కార్మికుల కష్టం తెలిసిన నేత. అడుగక ముందే మా సమస్యలు తెలుసుకొని అండగా నిలుస్తున్నారు. సమైక్య పాలనలో పట్టించుకున్న నాయకుడు లేకుండే. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినంక గీత కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపుతున్నారు. అంతకుముందు బైటక్ అని ప్రతి నెలా రూ.1000 ఆబ్కారీ కార్యాలయంలో కట్టవలసి ఉండేది. ఇప్పుడు కేసీఆర్ సార్ మాఫీ చేయించారు.
-జీ. శ్రీనివాస్ గౌడ్, గీత కార్మికుడు, ఖమాన
మా మంచికోసం పరితపిస్తున్నడు
దండేపల్లి, మే 3 : తెలంగాణ సర్కారు రైతు బీమాలాగే కల్లు గీత కార్మికుల కోసం బీమా పథకం తీసుకొచ్చింది. సీఎం నిర్ణయంతో గీత కార్మిక కుటుంబాలకు భరోసా ఉంటుంది. ఎవరైనా ప్రమాదంలో చనిపోతే వారంలోనే పరిహారం అందేలా చూస్తామన్నారు. గతంలో మమ్ముల పట్టించుకున్నోళ్లు లేరు. సీఎం కేసీఆర్ మా మంచి కోసం పరితపిస్తున్నడు. ఇందుకు ఆయనకు రుణపడి ఉంటం.
– గొల్లపెల్లి తిరుపతి గౌడ్, గీత కార్మికుడు, నర్సాపూర్
మాకు వరం..
గీత కార్మికులమైన మేము మా వృత్తి పనిలో రోజు ఒక గండంగా గడుపుతాం. మా ప్రాంతంలోని గీత, తాటి చెట్లు ఎక్కి కల్లు తీసే క్రమంలో తరచుగా ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రాణాలు కూడా పోయిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో గీత కార్మికుడి కుటుంబం రోడ్డున పడిపోతుంది. మా పరిస్థితులను తెలుసుకున్న సీఎం కేసీఆర్ గీత కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా ప్రకటించడం హర్షణీయం.
– ఎస్ భీమేశ్గౌడ్, కల్లు గీత కార్మికుడు, అంకోలి, ఆదిలాబాద్ రూరల్
గౌరవంగా జీవిస్తున్నం..
నేను డిగ్రీ వరకు చదువుకున్న. మూడేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో మా నాన్నకు కాలు విరిగింది. ఆస్పత్రి ఖర్చులకు సీఎం రిలీఫ్ ఫండ్ కింద రూ.50 వేల ఆర్థిక సాయం అందింది. కాలు విరిగినప్పటి నుంచి నాన్న చెట్లు ఎక్కడం లేదు. ఇంటి వద్దనే ఉంటున్నాడు. దీంతో నేను కూడా ఇదే వృత్తిలోకి వచ్చిన. కల్లు విక్రయాల ద్వారా ప్రతి రోజు రూ.700-1000 వరకు ఆదాయం వస్తున్నది. నాన్నకు ప్రతినెలా కల్లు గీత పింఛన్ రూ.2016 వస్తున్నది. సీఎం కేసీఆర్ అందజేస్తున్న సంక్షేమ పథకాలతో సమాజంలో గౌరవంగా జీవిస్తున్నాం. కొత్తగా గీత కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు బీమా పథకాన్ని అమలు చేస్తామనడం సంతోషం.
– పులి సంతోష్గౌడ్, గీత కార్మికుడు, దిలావర్పూర్, ఖానాపూర్ మండలం
పండగ రోజు..
కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు గీత కార్మికుల కుటుంబాలను పట్టించుకోలేదు. చాలా ప్రాంతాల్లో మా గీత కార్మికుల కుటుంబాలు కేవలం వృత్తి ఆధారంగానే జీవనం సాగిస్తున్నాయి. స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత గీత, తాటి వనాలు పెరగడం మంచి పరిణామం. అలాగే రైతు బీమా తరహాలో గీత కార్మికుల కూడా రూ.5 లక్షల బీమా వర్తింపజేయడం గీత కార్మికులకు ఒక పండగ రోజు. ఎన్నో ఏళ్లుగా మేము ఎదురుచూస్తున్న భద్రతను ఇప్పుడు సీఎం కేసీఆర్ కల్పించారు.
– సుధాకర్గౌడ్, గీత కార్మికుడు, అంకోలి, ఆదిలాబాద్ రూరల్
సీఎం మా బాగోగులు చూసుకుంటున్నారు
కోటపల్లి, మే 3 : ప్రతిరోజూ ప్రమాదపుటంచున పనిచేస్తున్న గీత కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా, ఎంతో మంది సీఎంలు మారినా గీత కార్మికులను పట్టించుకున్న పాపాన పోలేదు. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా బాగోగులు చూసుకుంటున్నారు. ఇప్పటికే అనేక పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు బీమా పథకం కూడా తీసుకురావడం అభినందించాల్సిన విషయం.
– అరిగెల శంకర్, కోటపల్లి