ఆసిఫాబాద్, జనవరి 8: ప్రజాపాలన దరఖాస్తుల పూర్తి వివరాలను ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆన్లైన్లో పకడ్బందీగా నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి ఇతర ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ప్రజాసంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలనలో అందిన దరఖాస్తుల వివరాలను ఆన్ లైన్లో స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు, జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారీ, దాసరి వేణులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 6వరకు దరఖాస్తులు స్వీకరించామని, దరఖాస్తుల వివరాలను డాటా ఎంట్రీ ఆపరేటర్ల సమన్వయంతో ఆన్లైన్లో నమోదు చేస్తున్నామ తెలిపారు. ఈనెల 17వ తేదీలోగా నమోదు ప్రక్రియ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఈ క్రమం లో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా అధికారుల పర్యవేక్షణలో వివరాలు నమోదు చేసే విధంగా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఆన్లైన్లో నమో దు చేసే సమయంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం వార్డుల వారీగా దరఖాస్తు సంఖ్య, కులం, పుట్టిన తేదీ ఆధార్ కార్డు, రేషన్కార్డు, మొబైల్ నంబర్ , కుటుంబసభ్యుల వివరాలు, చిరునామా ఇతర వివరాలతో కూడిన ఆన్లైన్ ఫారంలో ఎలాంటి తప్పులు లేకుండా దరఖాస్తు ఫారంలో ఉన్న ప్రకారంగానే నమోదు చేసే విధంగా డాటా ఎంట్రీ ఆపరేటర్లకు అవగాహన కల్పించామని చెప్పారు. జిల్లాలోని రైస్ మిల్లర్లకు నిర్దేశించిన సీఎం ఆర్ లక్ష్యాలను పూర్తి చేసే విధంగా సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్ల సమన్వయంతో కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖ ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.