తెలంగాణ ప్రగతి, సంక్షేమ సారథి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదివారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా ఆవిర్భావం తర్వాత సీఎం హోదాలో తొలిసారి వస్తున్నందున కనీవినీ ఎరుగనిరీతిలో స్వాగతం పలికేలా సన్నాహాలు చేశారు. మంత్రి అల్లోల, ప్రజాప్రతినిధులు, అధికారులు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 4 గంటలకు రానుండగా.. నూతన కలెక్టరేట్ ప్రాంగణంలో హెలిప్యాడ్ సిద్ధం చేశారు. సీఎం ప్రారంభించనున్న భవనాలను సర్వాంగ సుందరంగా విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు. నిర్మల్ పట్టణం జెండాలు, తోరణాలు, ఆర్చీలతో గులాబీమయమైంది. రహదారులు, కూడళ్ల వద్ద భారీ కటౌట్లు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. డివైడర్లను ఆకర్షణీయమైన పేయింటింగ్, పూల మొక్కలతో అందంగా అలంకరించారు. మంత్రి అల్లోల భారీ జనసమీకరణపై దృష్టి పెట్టగా.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మంచిర్యాల ప్రతినిధి/నిర్మల్, జూన్ 3(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రగతి రథసారథి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం నిర్మల్ జిల్లాకు రానున్నారు. సీఎం హోదాలో తొలిసారి కేసీఆర్ జిల్లాకు వస్తుండడంతో అధికారులు, నాయకులు పర్యటనను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేశారు. ఎక్కడా లోటుపాట్లు లేకుండా ఉండేందుకు గడిచిన కొద్ది రోజులుగా వందలాది మంది సిబ్బంది, కూలీలు పనులు చేస్తున్నారు. నేడు(ఆదివారం) సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ నిర్మల్కు చేరుకోనున్నారు. హెలికాప్టర్ ద్వారా నేరుగా నూతన కలెక్టరేట్ ప్రాంగణంలోని హెలీప్యాడ్కు వస్తారు. సమీకృత కలెక్టరేట్తోపాటు నిర్మాణం పూర్తి చేసుకున్న 2 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాలను ప్రారంభిస్తారు. అలాగే కొండాపూర్ సమీపంలో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ భవనాన్ని కూడా ప్రారంభిస్తారు. అనంతరం ఎల్లపెల్లి శివారులో నిర్వహించే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.
సీఎం కేసీఆర్ ప్రారంభించే నూతన కలెక్టరేట్ భవనాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. రంగురంగుల విద్యుద్దీపాలతోపాటు కలెక్టర్ చాంబర్, మీటింగ్ హాల్స్, సీఎం కేసీఆర్ పూజలు నిర్వహించే హాల్స్ అన్నింటినీ ప్ర త్యేక పూలతో అలంకరించారు. శనివారం ఉదయం నుం చే సుందరీకరణ పనులు చేపట్టారు. కేసీఆర్ కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం ప్రాంగణమంతా కలియదిరిగి పరిశీలించనున్నారు. అనంతరం కలెక్టర్ను ఆయన చాంబర్లో స్వయంగా కూర్చొబెట్టి తొలి ఫైల్పై సంతకం చేయించనున్నారు. పార్టీ కార్యాలయంలో నిర్మల్ జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డిని సీట్లో కూర్చొబెట్టనున్నారు.
సీఎం కేసీఆర్ నిర్మల్ జిల్లా పర్యటనను అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. సీఎం నిర్మల్ జిల్లా కేంద్రానికి మొదటిసారి రానున్నందున ఆయనకు కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలికేలా సన్నాహాలు చేశారు. ముఖ్యంగా బహిరంగ సభకు లక్ష మందిని సమీకరించాలని నిర్ణయించారు. ఇప్పటికే మంత్రి నిర్మల్ నియోజకవర్గ నేతలతోపాటు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముథోల్, ఖానాపూర్ సెగ్మెంట్ల నుంచి కూడా జనం భారీగా తరలిరానున్నందున వారికి కూడా రావాణా సౌకర్యం కల్పించే బాధ్యతలను సంబంధిత ఎమ్మెల్యేలకు అప్పగించారు. అలాగే నిర్మల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి జనాన్ని తరలించే బాధ్యతలను స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులకు అప్పగించారు. జన సమీకరణకు సంబంధించి మంత్రి స్వీయ పర్యవేక్షణ చేస్తున్నందున స్థానిక నాయకులు సీరియస్గా దృష్టి పెడుతున్నారు.
సీఎం కేసీఆర్ పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీ ప్రవీణ్కుమార్ నేతృత్వంలో ఇప్పటికే ప్రత్యేక బలగాలను రంగంలోకి దించారు. కొత్త కలెక్టరేట్ భవనంతోపాటు, బీఆర్ఎస్ కార్యాలయ భవనాన్ని, బహిరంగ సభా స్థలాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. బాంబ్, డాగ్ స్కాడ్లు కూడా తనిఖీలు మొదలు పెట్టాయి. నిర్మల్ నలువైపులా గల అటవీ ప్రాంతాల్లో పోలీసు బలగాలు కూంబింగ్లు కొనసాగిస్తున్నాయి. సీఎం బందోబస్తు కోసం దాదాపు 3 వేల మంది పోలీసులు జిల్లాకు చేరుకున్నారు. నలుగురు ఎస్పీలు, 12 మంది డీఎస్సీలు, 300 మంది సీఐలు, ఎస్సైలు బందోబస్తును పర్యవేక్షించనున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కొండాపూర్ ప్రధాన రహదారి పక్కన, బీఆర్ఎస్ కార్యాలయ భవనాన్ని సీఎం ప్రారంభించనుండడంతో నిర్మల్-ఖానాపూర్ ప్రధాన హైవేపై ఆదివారం సాయంత్రం ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు.
కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు అన్ని ప్రధాన కూడళ్లతోపాటు, కలెక్టరేట్కు వెళ్లే దారి పొడవునా భారీ ఫ్లెక్సీ కటౌట్లు, హోర్డింగులు ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్య కూడళ్లలో ఏర్పాటు చేసిన గులాబీ రంగు ఆర్చీలు, మంచిర్యాల చౌరస్తా నుంచి నలువైపులా కట్టిన గులాబీ జెండాలు, తోరణాలతో పట్టణమంతా గులాబీమయమైంది. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే కాకుండా మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, సీఎం కేసీఆర్ అభిమానులు, సానుభూతిపరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా రోడ్డు మధ్యలో నిర్మించిన డివైడర్లను కూడా ఆకర్షణీయమైన పేయింటింగ్తో అలంకరించారు. కొత్త కలెక్టరేట్ నుంచి బీఆర్ఎస్ కార్యాలయానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని ముస్తాబు చేశారు. ఇరువైపులా అందమైన పూలమొక్కలతో అందంగా అలంకరించారు.