దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్దే
చెన్నూర్ ఎత్తిపోతలకు రూ. 1658 కోట్లు తీసుకొచ్చిన ఘనడు
ఓర్వలేకే కాంగ్రెస్, బీజేపీల ఆరోపణలు
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
చెన్నూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు, వంతెనలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు
పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు, కలెక్టర్
నస్పూర్లో కలెక్టరేట్ భవన నిర్మాణం పరిశీలన
త్వరలో సుమనన్న ప్రజా బాట : విప్ బాల్క
‘అభివృద్ధి అంటేనే బాల్క సుమన్. చరిత్రలో నిలిచిపోయేలా చెన్నూర్ నియోజకవర్గాన్ని ప్రగతి బాట పట్టిస్తున్నారు’అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశంసించారు. బుధవారం కోటపల్లి మండలం ఎదుల్లబంధం సమీపంలోని తుంతుంగ వాగుపై రూ.8 కోట్లు, చెన్నూర్ మండలం కిష్టంపేట వద్ద రూ.3.50 కోట్లు, సుబ్బరాంపల్లిలో రూ.4.80 కోట్లు, గంగారంలో రూ.1.97 కోట్లతో నిర్మించిన వంతెనల ప్రారంభోత్స వాలతో పాటు సుద్దాల వాగుపై రూ. 10 కోట్లతో చేపడుతున్న బ్రిడ్జికి ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యేలు, కలెక్టర్తో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. విప్ సుమన్ వంతెనల నిర్మాణానికి పట్టుబట్టి నిధులు మంజూరు చేయించుకున్నారని, చెన్నూర్ ఎత్తిపోతల పథకానికి రూ. 1658 కోట్లు తీసుకొచ్చిన మహాఘనుడు ఆయన అని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని, ప్రజలంతా పనిచేసే ప్రభుత్వాన్ని, నాయకులను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. అంతకుముందు నస్పూర్లో కొత్తగా నిర్మిస్తున్న కలెక్టర్ సమీకృత భవనాలను పరిశీలించారు. మూడు నెలల్లో పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశించారు.
కోటపల్లి/చెన్నూర్ రూరల్/భీమారం/సీసీసీ నస్పూర్, జూన్ 15 : అభివృద్ధి అంటేనే బాల్క సుమన్ అని, చరిత్రలో నిలిచిపోయేలా చెన్నూర్ నియోజకవర్గాన్ని ప్రగతి బాట పట్టిస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కోటపల్లి మండలంలోని ఎదుల్లబంధం గ్రామ సమీపంలోని తుంతుంగ వాగుపై రూ.8కోట్ల నిధులతో నిర్మించిన బ్రిడ్జిని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీ దండే విఠల్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ బుధవారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలనలో వివక్షకు గురైన చెన్నూర్ నియోజవర్గం ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సారథ్యంలో నేడు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నదని తెలిపారు. తుంతుంగ వాగు బ్రిడ్జి నిర్మాణం కోసం తన వద్దకు వచ్చి పట్టు బట్టి రూ.8 కోట్ల నిధులను బాల్క సుమన్ మంజూరు చేయించుకున్నాడని గుర్తు చేశారు. నిధులు మంజూరు చేయించిన తనతోనే బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేయించాడని తెలిపారు. మారుమూల మండలమైన కోటపల్లి అభివృద్ధికి బాల్క సుమన్ అహర్నిశలు కృషి చేస్తున్నాడని తెలిపారు. కాళేశ్వరం లిఫ్ట్కు రూ.1650 కోట్లు మంజూరుకు బాల్క సుమన్ చేశారని, ఈ లిఫ్ట్ పూర్తయితే చెన్నూర్ నియోజకవర్గంలో లక్ష ఎకరాలు సాగులోకి రానుందని తెలిపారు.
త్వరలో సుమనన్న ప్రజాబాట..
– చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్
చెన్నూర్ నియోజవర్గ అభివృద్ధిలో భాగంగా అతి త్వరలో ‘సుమనన్న ప్రజా బాట’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో చెన్నూర్ నియోజకవర్గాన్ని సిరిసిల్ల, సిద్దిపేటకు దీటుగా తీర్చిదిద్దటమే లక్ష్యమని తెలిపారు. తుంతుంగా వాగుపై బ్రిడ్జి నిర్మాణంతో సమీప గ్రామాల ప్రజలు కష్టాలు తీరాయని తెలిపారు. మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఇక్కడి ప్రజల సమస్యలను వివరిస్తే వెంటనే నిధుల మంజూరు చేశారని కొనియాడారు. సొంత ఇంటి స్థలం ఉన్న వారికి నియోజకవర్గంలో నిర్మించుకునేందుకు 3000 ఇండ్లు మంజూరయ్యాయని, ఇందులో కోటపల్లి మండలానికి 800 ఇండ్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. కోటపల్లి మండల కేంద్రంలో రోడ్డు నిర్మాణంలో ఇండ్లు కోల్పోయిన బాధితులకు ఇందులో నుంచి 80 ఇండ్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి కేటాయించిన 1500 దళితబంధు యూనిట్లలో కోటపల్లి మండలానికి 300 యూనిట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్సీ దండే విఠల్, మాట్లాడుతూ చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధి బాల్క సుమన్తోనే సాధ్యమన్నారు. పారుపల్లి మండలా ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు.
ఇక్కడి ప్రజల ఓట్లతో జడ్పీటీసీగా గెలిచి జడ్పీ చైర్మన్ అయిన నల్లాల భాగ్యలక్ష్మి పార్టీ మారడం సిగ్గు చేటని తెలిపారు. అనంతరం మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ మాట్లాడుతూ తుంతుంగ వాగు పై బ్రిడ్జిని నిర్మించి ఏ ఎమ్మెల్యే, మంత్రి చేయలేని పనిని విప్ బాల్క సుమన్ సాధించాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ ప్రవీణ్ కుమార్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, జడ్పీ కోఆప్షన్ సభ్యులు అజ్గర్ మొహిమయయయయయయయొద్దీన్, డీఆర్డీవో శేషాద్రి, డీపీఆర్వో సంపత్, ఎంపీపీ మంత్రి సురేఖ, వైస్ ఎంపీపీ వాల శ్రీనివాస్ రావ్, పీఏసీఎస్ చైర్మన్ సాంబాగౌడ్, సర్పంచ్లు కోఠారి నిర్మల, గుట్టు లక్ష్మణ్ గౌడ్, కుమ్మరి సంతోష్, పెద్దింటి పున్నంచంద్, పూజరి సుమలత, కాశెటి సతీశ్, పడాల రాజుబాయి, ఎంపీటీసీలు జేక శేఖర్, మారిశెట్టి తిరుపతి, చంద్రగిరి శంకరయ్య, గోమాస రజిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎరినాగుల ఓదెలు, మండల యూత్ అధ్యక్షుడు మారిశెట్టి విద్యాసాగర్, మండల నాయకులు మంత్రి రామయ్య, పడాల సతీశ్, పిల్లి సమ్మయ్య, పురుషోత్తం, పూజరి బాపు, గొడిశెల రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్ రూరల్ : గంగారంలో నూతన బ్రిడ్జిని ప్రారంభిస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి, విప్ సుమన్, ఎమ్మెల్సీ విఠల్
అభివృద్ధిలో దూసుకుపోతున్న చెన్నూర్ నియోజక వర్గం
చెన్నూర్ నియోజక వర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. చెన్నూర్ మండలంలో కిష్టంపేట వద్ద రూ. 3.50 కోట్లతో నిర్మించిన బ్రిడ్జి, సుబ్బరాంపల్లి వద్ద రూ. 4.80 కోట్లతో బ్రిడ్జి, గంగారం గ్రామంలో రూ. 1.97 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిలను ప్రారంభించారు. సుద్దాల వాగుపై రూ.10 కోట్లతో నిర్మించనున్న వంతెన పనులకు ప్రభుత్వ విప్ బాల్క సుమన్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ చెన్నూర్ నియోజక వర్గంలో నిర్మించిన నాలుగు బ్రిడ్జీలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 20 ఏళ్ల ముందు చూపుతో ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూర్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన మాట కోసం బాధ్యతగా పనిచేస్తున్నాడని అభినందించారు. విపక్షాల మాటలు పట్టించుకోవలసిన అవసరం లేదని, గతంలో ఈ ప్రాంతానికి వారు చేసిందేమీ లేదన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కై ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. దేశంలో 22 మంది బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్నా.. ఇక్కడున్న సంక్షేమ పథకాలు అమలు కావడం లేదన్నారు. మన రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు కర్ణాటకలో అమలు చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని ఆ ప్రాంత ఎమ్మెల్యేలు కోరుతున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ భారతీహోళికేరి, ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్, డీసీఎమ్మెస్ చైర్మన్ లింగన్న, మార్కెట్ కమటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, ఎంపీపీ మంత్రి బాపు, జడ్పీటీసీ మోతె తిరుపతి, వైస్ ఎంపీపీ వెన్నపురెడ్డి బాపురెడ్డి, సర్పంచులు బుర్ర రాకేశ్ గౌడ్, కొత్తపల్లి అమృత, తోట మధూకర్, తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీనివాస్ కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.
ఇదే పట్టుదలతో పని చేయండి
భీమారం, జూన్ 15 : టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పనితీరు అభినందనీయమని, ఇదే పట్టుదలతో పని చేయాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ , ఎమ్మెల్సీ దండే విఠల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మొదటి సారిగా భీమారం మండలానికి వచ్చిన మంత్రి ప్రశాంత్ రెడ్డికి పార్టీ కార్యాలయంలో సన్మానించారు. పార్టీ కార్యాలయం ఏర్పాటుపై టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్, సర్పంచ్ గద్దెరాంరెడ్డి , రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు పర్తి రెడ్డి మహేశ్వర్ రెడ్డి , మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్యా రాజ్ కుమార్ నాయక్ అభినందించి స్వీట్లను తినిపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పూరాణం సతీశ్ కుమార్ , జడ్పీటీసీ భూక్యా తిరుమల నాయక్ , టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దాసరి మధునయ్య , నాయకులు పోడెటి రవి , బొల్లం శ్రీనివాస్ ,వేముల ప్రణీత్ గౌడ్ , జలంపల్లి సమ్మయ్య , కట్ట నాగరాజు , కొత్తపోటు రాజేశ్వర్ రెడ్డి, సర్పంచ్లు సంతోషం భాస్కర్రెడ్డి , కొడిపే సమ్మయ్య , దాడి తిరుపతి, ఎంపీటీసీ రూప ,తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ సాగు లాభదాయకం..
ఆయిల్ పామ్ సాగుతో రైతులకు లాభదాయకమని మంత్రి ప్రశాంత్ రెడ్డి , ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ , ఎమ్మెల్సీ దండే విఠల్ , మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ అన్నారు. భీమారం మండల కేంద్రంలో ఆయిల్ పామ్ నర్సరీని పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు.