ఆదిలాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): పేదలకు రేషన్ దుకాణాల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. ప్రజల్లో రక్తహీనత ఎక్కువగా ఉన్న ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పోషకాలతో కూడిన ఈ బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్నది. ఐరన్, బీ 12 విటమిన్, ఫోలిక్ యాసిడ్ కలిగి ఉండే ఈ బలవర్ధక బియ్యాన్ని ఈ నెల నుంచి ప్రజలకు అందించనున్నది. కాగా, వినియోగంపై అధికార యంత్రాంగం ఇప్పటికే ఆయా చోట్ల ప్రజలకు అవగాహన కల్పించింది. ఆరోగ్యానికి మేలు చేస్తుందని, ఎలాంటి అపోహలు అవసరం లేదని సూచించింది.
ప్రజాసంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర సర్కారు వివిధ పథకాలను ప్రవేశపెడుతున్నది. ముఖ్యంగా ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రక్తహీనత ఎక్కువగా ఉన్న జిల్లాలో రేషన్ దుకాణాల ద్వారా పోషకాహార బియ్యం పంపిణీ చేయనుండగా, ఇందులో ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలు ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం ఆదిలాబాద్ జిల్లాలో 15 నుంచి 49 ఏండ్ల వయసున్న వారిలో రక్తహీనత 57 శాతం, ఆరేండ్లలోపు చిన్నారుల్లో 67 శాతం ఉంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా చాలా మందిలో రక్తహీనత ప్రధాన సమస్యగా మారింది. దీంతో ఈ నెల నుంచి ఫోర్టిఫైడ్ రైస్ను పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఐరన్, బీ 12 విటమిన్, ఫోలిక్ యాసిడ్ కలిగి ఉండే బియ్యం పేదలకు బలవర్ధకమైన ఆహారంగా ఉపయోగపడుతుంది. రేషన్ దుకాణాల్లోని కార్డుదారులకు పూర్తిస్థాయిలో ఫోర్టిఫైడ్ రైస్ను పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాలశాఖ అధికారులు తెలిపారు. ఈ బియ్యంతో పోషకాల ఆహారం అందుతుందని అధికారులు చెబుతున్నారు.
రెండు జిల్లాల్లో పంపిణీ
ఆదిలాబాద్ జిల్లాలో 355 రేషన్ దుకాణాలు ఉండగా 1,92,078 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా ప్రభుత్వం 3494 మెట్రిక్ టన్నుల బియ్యం అందిస్తున్నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 300 రేషన్ దుకాణాలు ఉండగా 1,40, 029 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెలా ప్రభుత్వం 2315 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేస్తున్నది. జనవరి నుంచి లబ్ధిదారులందరికీ ఫోర్టిఫైడ్ రైస్ అందించనుంది. ఆదిలాబాద్ జిల్లాలో ఆరు నెలలుగా అధికారులు రేషన్ బియ్యం దుకాణాల ద్వారా సాధారణ బియ్యంలో కలిపి పంపిణీ చేస్తున్నారు. కొందరు ప్లాస్టిక్ బియ్యంగా భావించడంతో అధికారులు లబ్ధిదారులకు ఆవగాహన కల్పించారు. బియ్యం వాడకంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి పౌరసరఫరాల శాఖ అధికారులు డీలర్లకు శిక్షణ ఇచ్చారు. ఆ మేరకు డీలర్లు రేషన్ కార్డు దారులకు అవగాహన కల్పిస్తున్నారు.
బలవర్థకమైన ఆహారం..
పేదలకు రేషన్ దుకాణాల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ అందించబోతున్నాం. ఇది బలవర్ధకమైన ఆహారంగా ఉపయోగపడుతుంది. శరీరంలో రక్తం ఉత్పత్తి పెరగడంతోపాటు, ఎర్ర రక్తకణాల పెరుగుదలకు దోహదం చేస్తుంది. సహజ రక్తకణాలు బలంగా ఉండడానికి, ఆరోగ్యకరమైన బలమైన కణాలు, ఎర్ర రక్తకణాలను తయారు చేస్తుంది. ఈ బియ్యం వండుకొని తింటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. నిపుణుల పర్యవేక్షణలో ఈ బియ్యం తయారవుతాయి. ఆహార నిపుణుల ధ్రువీకరణ అనంతరం దుకాణాలకు సరఫరా చేస్తున్నాం. ఈ నెల నుంచి పోషకాలతో కూడిన బియ్యం పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేశాం.
–కిరణ్కుమార్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి, ఆదిలాబాద్