సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 17: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు తీసుకొస్తే కాంగ్రెస్ నిలిపివేయాలని చూడటం దుర్మార్గమైన చర్య అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ధ్వజమెత్తారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, కొనింటి మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, బీఆర్ఎస్ నాయకులు జిల్లా అదనపు కలెక్టర్కు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కొనసాగించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.

ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కల్యాణలక్షి, షాదీముబారక్ పథకాలను రద్దు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి, ఆ ఒత్తిడిని తట్టుకోలేకనే పథకాలు నిలిపివేయాలనుకుంటున్నారని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి రాష్ర్టానికి పట్టిన చీడ, పీడగా ఆయన అభివర్ణించారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు మాట్లాడుతూ కేసీఆర్ పథకాలను రద్దు చేయాలనే దురాలోచనతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిలిపివేసే కుట్రను ప్రభుత్వం అమలు చేస్తున్నదన్నారు. రాబోయే రోజుల్లో అన్ని పథకాలను ఆపేసే ఆలోచన చేస్తున్నారని ఆరోపించారు.
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిలిపివేయడం కేవలం ప్రభుత్వ వైఫల్యమే కాదని, కుట్రతో కూడుకున్నదని విమర్శించారు. కౌంటర్ దాఖలు చేయకుండా ప్రభుత్వమే కావాలని ఆలస్యం చేస్తూ హైకోర్టు ద్వారా పథకాలను నిలిపివేయాలని చూస్తున్నదని, వెంటనే కోర్టులో కౌంటర్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జైపాల్రెడ్డి, డాక్టర్ జి.శ్రీహరి, పట్నం మాణిక్యం, కాసాల బుచ్చిరెడ్డి, కొండల్రెడ్డి, చింత సాయినాథ్, మాణిక్ ప్రభు, ఎస్కే రషీద్, శ్రీకాంత్ పాల్గొన్నారు.