జలమే జీవం..బలం..జగం.. సకల జీవరాశులకు నీరే ప్రాణాధారం. ఈ నేపథ్యంలో భూగర్భజలాల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. వర్షం నీటి వృథాను అరికట్టేందుకు విరివిగా చెక్ డ్యామ్లను నిర్మిస్తున్నది. ప్రధాన ప్రాజెక్టులు, చెరువులకు సంబంధించిన వాగులపై వరదకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా వీటిని కట్టిస్తున్నది.. ఇందులో భాగంగా గతేడాది నిర్మల్ జిల్లాలో రూ.100 కోట్లతో 25 చెక్ డ్యామ్లను నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో నిర్మించింది. ఈ ఏడాది మరో పదింటికి రూ.120కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. కాగా, ప్రభుత్వం జల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలతో భూగర్భజలాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఫలితంగా.. జిల్లాలో 9 నుంచి 12 అడుగుల లోతులోనే నీటిమట్టం ఉంటుండగా, రెండు పంటలకూ ఢోకా లేకుండా పోతున్నది.
నిర్మల్, సెప్టెంబర్ 2(నమస్తే తెలంగాణ): ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా ప్రభుత్వం అవసరమున్న చోట చెక్డ్యామ్లను నిర్మిస్తున్నది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గతేడాది రూ.100కోట్ల విలువైన 25 చెక్ డ్యామ్లు మంజూరుకాగా..అందులో 21 పూర్తయ్యాయి. అందుబాటులోకి వచ్చిన ఈ చెక్ డ్యామ్లు సత్ఫలితాలు ఇస్తుండడంతో మరికొన్ని చోట్లా నిర్మించేందుకు నీటిపారుదల శాఖ అధికారులు ప్రభుత్వానికి ఇటీవలే ప్రతిపాదనలు పంపారు. సోన్, సారంగపూర్, నిర్మల్, లోకేశ్వరం, పెంబి, భైంసా మండలాల్లో పది వరకు చెక్డ్యామ్లను నిర్మించేందుకు రూ.120 కోట్ల అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే టెండర్ల ప్రక్రియను చేపట్టి పనులను మొదలుపెట్టేందుకు సంబంధిత శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు.
స్వర్ణ ప్రాజెక్టు ప్రధాన కాలువపై నిర్మించిన చెక్ డ్యామ్
సరస్వతీ కాలువపై నిర్మించిన చెక్ డ్యామ్ వద్ద సమృద్ధిగా నీళ్లు
బహుళ ప్రయోజనాలు
జిల్లాలో యేటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ గోదావరితోపాటు పలు ఉప నదుల నుంచి వరద లక్షల క్యూసెక్కులలో వృథాగా పోతున్నది. సముద్రంలో కలిసే ఈ నీటికి అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఇప్పటికే స్వర్ణ ప్రాజెక్టు, గడ్డెన్నవాగు ప్రాజెక్టు, సరస్వతీ ప్రధాన కాలువలపై నిర్మించిన చెక్డ్యామ్లు సత్ఫలితాలనిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో మండు వేసవిలోనూ నీటి వనరులు జలంతో కళకళలాడుతున్నాయి. భూగర్భజలాలు కూడా గణనీయంగా పెరగడంతో జిల్లాలో చాలా ప్రాంతాల్లోనూ 9 అడుగుల లోతుల్లోనే నీళ్లు అందుబాటులో ఉంటున్నాయి. చెక్డ్యామ్ల వద్ద నిల్వ ఉన్న నీటిని అవసరాలను బట్టి రైతులు వినియోగించుకుంటుండడంతో రెండు పంటలకూ కొరత లేకుండా పుష్కలంగా నీళ్లు అందుతున్నాయి.
అదనంగా వేల ఎకరాలకు సాగు నీరు
చెక్డ్యామ్లు నిర్మించిన ప్రాంతాల్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. భూగర్భ జలాలు పెరిగి సాగునీటి ఇబ్బందులు చాలా వరకు తీరాయి. గతంలో 25 చెక్డ్యామ్లు మంజూరైతే 21 నిర్మాణాలు పూర్తయ్యాయి. ఈ ఏడాది మరో 10 నిర్మాణాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. చెక్డ్యామ్ల ఏర్పాటుతో స్థిరీకరణ ఆయకట్టు కంటే అదనంగా వేల ఎకరాలకు ప్రయోజనం చేకూరుతున్నది.
– డీ సుశీల్ కుమార్, ఎస్ఈ, నీటిపారుదల శాఖ, నిర్మల్ జిల్లా