ఆదిలాబాద్ జిల్లాలో రైతాంగానికి మేలు చేసేలా సాగునీటి రంగానికి రాష్ట్ర సర్కారు అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాలు పడితే పంటలు, లేదంటే తంటాలు అనేలా దీనస్థితి ఉండేది. స్వరాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రైతు గోస తీర్చేందుకు నడుం బిగించింది. అవసరమైన ప్రాజెక్టులు, చెరువులు నిర్మించింది. మరోవైపు వర్షపు నీటి వృథాకు అడ్డుకట్ట వేసేలా జిల్లాలో రూ.126.48 కోట్లతో 47 చెక్డ్యాంలను నిర్మించింది. దీంతో అదనంగా 8819 ఎకరాలకు సాగనీరు అందడంతో పాటు భూగర్భజల మట్టం పెరిగింది. ఈ నేపథ్యంలో కొత్తగా మరో 60 చెక్డ్యాంల నిర్మాణానికి అధికార యంత్రాంగం ప్రతిపాదనలు పంపింది.
ఆదిలాబాద్, ఫిబ్రవరి 24 ( నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉండేది. జిల్లాలో రైతులు వానకాలంలో 5 లక్షల ఎకరాల్లో పత్తి, కంది, సోయాబీన్, ఇతర పంటలు పండిస్తారు. గతంలో వర్షాలపై ఆధారపడి వ్యవసాయం చేసేవారు. పంటలకు సరిపడా వర్షాలు పడితే కానీ పంట చేతికి వచ్చేది కాదు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు పంటలను నష్టపోవాల్సి వచ్చేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం జిల్లాలోని రైతులకు సాగునీరు అందించడానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ప్రాజెక్టులు, చెరువుల నిర్మాణాలు చేపట్టింది. సాత్నాల ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేపట్టడంతో చివరి ఆయకట్టుకు నీరు అందుతున్నది.
మిషన్ కాకతీయ పథకంలో భాగంగా 208 చెరువులకు మరమ్మతులు చేపట్టగా.. 45 వేల ఎకరాల ఆయకట్టు పెరిగింది. గత ప్రభుత్వాలు జిల్లాలో పుష్కలంగా నీటిని నిల్వచేసే అవకాశాలున్నా పట్టించుకోలేదు. దీంతో వానకాలంలో వర్షాలు పడినప్పుడు నీరంతా వృథాగా పోయేది. ఫలితంగా ఎండాకాలం ప్రారంభంలోనే భూగర్భజలాలు అడుగంటి సాగు, తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడేవారు. వర్షపు నీరు వృథాగా పోకుండా రైతులు, స్థానికులకు ఉపయోగపడడంతో పాటు పశువులకు తాగునీరు లభించేలా ప్రభుత్వం జిల్లాలో చెక్డ్యాంలను నిర్మించింది. జిల్లాలో మొదటి విడుతలో నిర్మించిన చెక్డ్యాంలు రైతులు, స్థానికులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. దీంతో అధికారులు మరో 60 చెక్డ్యాంల నిర్మాణాల కోసం ప్రతిపాదనలు పంపారు.
47 చెక్డ్యాంల నిర్మాణాలు..
జిల్లాలో వానకాలంలో ఏటా 1400 మిల్లీ మీటర్ల వరపాతం నమోదవుతున్నది. ఎత్తయిన ప్రాంతాలు, గుట్టలు, వాగులు, వంకల ద్వారా వర్షపునీరు వృథాగా పోతున్నది. ‘పరుగెత్తే నీటికి నడక నేర్పు.. నడిచే నీటికి నిలకడ నేర్పు’ నినాదంతో జిల్లాలో ప్రభుత్వం చెక్డ్యాంల నిర్మాణాలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లాకు మొదటి విడుతలో 47 చెక్డ్యాంలు మంజూరయ్యాయి. వర్షాకాలంలో నీటిని నిల్వచేసి రైతులకు ఉపయోగపడేలా చేపట్టిన చెక్డ్యాం నిర్మాణాలను నీటి పారుదలశాఖ అధికారులు పూర్తి చేశారు. ఆదిలాబాద్, ఇచ్చోడ, ఉట్నూర్ సబ్ డివిజన్లో వీటి నిర్మాణాలు చేపట్టారు. ఆదిలాబాద్ సబ్డివిజన్లో 15 చెక్డ్యాంలు, ఇచ్చోడ సబ్డివిజన్లో 17, ఉట్నూర్ సబ్డివిజన్లో 15 చొప్పున నిర్మించారు. ఇందుకోసం రూ.126.48 కోట్లను ఖర్ఛు చేశారు. వానకాలంలో కురిసిన వర్షాలతో చెక్డ్యాంలు నిండు కుండల్లా మారాయి. యాసంగిలో 8,819 ఎకరాలకు వీటి ద్వారా సాగు నీరు అందనున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. చెక్డ్యాంల నీటిని రైతులు మోటర్ల ద్వారా తీసుకొని స్ప్రింకర్ల ద్వారా పంటలకు పెడుతున్నారు. సర్కారు అందించిన సాయంతో తాము రెండో పంటను సాగు సాగుచేసుకునే అవకాశం లభించిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చెక్డ్యాంలతో భూగర్భ నీటిమట్టం పెరిగి ఎండాకాలంలో స్థానికులకు తాగునీటి సమస్య ఉండదు.
రైతులకు ఎంతో ఉపయోగం
జిల్లాలో మొదటి విడుతలో నిర్మించిన 47 చెక్డ్యాంలు రైతులకు పలు రకాల ప్రయోజనాలను చేకూర్చుతున్నాయి. యాసంగిలో ఒక్కో చెక్డ్యాం ద్వారా 150 ఎకరాల వరకు సాగునీరు అందుతున్నది. ఎండాకాలంలో గ్రామాల్లో సాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండవు. పశువులకు సైతం తాగునీరు లభిస్తుంది. కొత్తగా 60 చెక్డ్యాంల నిర్మాణం కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం.
– రాథోడ్ విఠల్, ఈఈ, నీటిపారుదలశాఖ, ఆదిలాబాద్