న్యూఢిల్లీ, జూలై 16: భూమికి 3,84,400 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రుడిపై కాలుమోపడానికి చంద్రయాన్-3 బయల్దేరింది. ఇస్రో శాస్త్రవేత్తలు చేస్తున్న ఈ ప్రయోగం క్లిష్టమైంది. సవాల్తో కూడుకున్నది. సాంకేతికంగా, ఆర్థికంగా ఎన్నో వనరులున్న అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, జపాన్, చైనా తదితర దేశాలు చేపట్టిన పలు ప్రయోగాలు విఫలమయ్యాయి. చంద్రయాన్-2 విఫలమైనా ఇస్రో నిరాశపడకుండా, చంద్రయాన్-3 చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈనేపథ్యంలో చంద్రుడి గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
ఒక సిద్ధాంతం ప్రకారం, 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి నుంచి విడిపోయిన ఓ ముక్కే చంద్రుడిగా ఏర్పడింది. భూమి నుంచి చంద్రుడు ప్రతిఏటా 3.8 సెంటీమీటర్ల దూరం జరుగుతున్నాడు. ఇలా 5 వేల ఏండ్లు కొనసాగుతుందని శాస్త్రవేత్తల అంచనా.
చంద్రుడిపై వాతావరణం లేదు. దాంతో కాస్మిక్ కిరణాలు, సౌర తుఫాన్లు వచ్చిపడతాయి. దీనివల్ల చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతల్లో అనూహ్యమైన మార్పులు ఉంటాయి. ధ్వని ప్రయాణించేందుకు యానకం (గాలి) లేదు కాబట్టి శబ్దాలు వినబడవు.
చంద్రుడి ఒకవైపు భాగమే మనకు కనపడుతుంది. రెండో వైపు కనపడే అవకాశమే లేదు. నునుపైన శిలలపై పడ్డ సూర్యుడి కాంతి భూమిని చేరటం వల్లే..మనకు వెండి వెన్నల అనుభూతి కలుగుతున్నది.
అంతరిక్ష పరిశోధనలో రష్యా దూసుకెళ్లటాన్ని జీర్ణించుకోలేని అమెరికా, చంద్రుడిపై అణుబాంబు పేల్చాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. రష్యా కన్నా తాము ఏం తక్కువ కామని ప్రపంచానికి చాటేందుకు 1950లో ‘ప్రాజెక్ట్ ఏ119’ చేపట్టింది.
మానవ చరిత్రలో ఇప్పటివరకూ 12 మంది మాత్రమే చంద్రుడిపై కాలుమోపారు. వీళ్లంతా అమెరికాకు చెందినవారే. చివరిసారి 1972లో అపోలో-17 మిషన్ ద్వారా ఇద్దరు అమెరికన్లు ఆండ్రూ సెర్నెన్, హారిసన్ షిరిత్ చంద్రుడిపైకి వెళ్లివచ్చారు.
భూమికి 3,475 కిమీ దూరంలో ఉన్న కక్ష్యలోచంద్రుడు..భూమి చుట్టూ తిరుగుతున్నాడు. పున్నమివేళ గుండ్రంగా కనిపిస్తాడు. కానీ చంద్రుడు నిజానికి కోడిగుడ్డు ఆకృతిలో ఉంటాడట!