ఆదిలాబాద్ జిల్లాలో పెన్గంగ నదిపై నిర్మిస్తున్న చనాక కొరాట ప్రాజెక్ట్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆదిలాబాద్, భీంపూర్, జైనథ్, బేల మండలాల్లోని 89 గ్రామాల్లో 51వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో 23 గేట్లతో 0.83 టీఎంసీలు నిల్వ చేసేలా భారీ ఆనకట్టను సర్కారు నిర్మిస్తున్నది. ఇప్పటికే మెజార్టీ పనులు పూర్తి కాగా, మిగతా వాటి కోసం ప్రభుత్వం తాజా బడ్జెట్లో రూ.289.69 కోట్లు కేటాయించింది. దీంతో త్వరలోనే పనులు పూర్తయి, తమ ప్రాంతాలు సస్యశ్యామలం కానున్నాయని ఆయకట్టు రైతాంగం సంతోష పడుతున్నది. సమైక్య రాష్ట్రంలో తమ కష్టాలను పట్టించుకున్న నాథుడే లేడని, స్వరాష్ట్రంలో సాగునీటి రంగానికి ప్రాధాన్యమివ్వడం ఆనందంగా ఉందని అభిప్రాయపడుతున్నది.
-ఆదిలాబాద్, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ)
ఆదిలాబాద్, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ ): ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి రంగాన్ని విస్మరించారు. రైతుల పంటలకు నీటిని అందించే అవకాశాలున్నా ఏ మాత్రం పట్టించుకోలేదు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం జిల్లాలో సాగునీటి రంగానికి పెద్దపీట వేసింది. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం-మహారాష్ట్ర సరిహద్దులో కొరాట వద్ద పెన్గంగ నదిపై ప్రాజెక్టును నిర్మిస్తున్నది. ఇప్పటికే ప్రాజెక్టు పనులు చివరిదశకు చేరుకున్నాయి. కాగా, ఈసారి బడ్జెట్లో మరో రూ.289.69 కోట్లు కేటాయించింది. త్వరలోనే మిగతా పనులు పూర్తికానుండగా నాలుగు మండలాల్లోని 51 వేల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి.
తుది దశకు పనులు
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో పెన్గంగ నదిపై జైనథ్ మండలం కొరాట వద్ద నిర్మిస్తున్న చనాక-కొరాట ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల పరిధిలోని 89 గ్రామాల్లో 51 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఆదిలాబాద్, భీంపూర్, జైనథ్, బేల మండలాలకు నీరు అందనుంది. ప్రధాన కాలువ నిర్మాణానికి ప్రభుత్వం రూ.397.82 కోట్లు మంజూరు చేయగా.. బరాజ్ నిర్మాణం పూర్తయింది. రూ.106.71 కోట్లతో పంప్హౌజ్, లోయర్ పెన్గంగ ప్రధాన కాలువ నిర్మాణానికి రూ.234.8 కోట్లు, డిస్ట్రిబ్యూటరీ కోసం రూ.148.43 కోట్లను ప్రభుత్వం గతంలో కేటాయించగా పనులు చివరి దశకు చేరుకున్నాయి. 0.83 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు 23 పిల్లర్లతో గేట్లు బిగించారు. రైతుల సాగు భూములకు నీటిని సరఫరా చేసేందుకు 47 కిలోమీటర్ల ప్రధాన కాలువ నిర్మించాల్సి ఉండగా పనులు పూర్తయ్యాయి. వీటితోపాటు 129 బ్రిడ్జిలు నిర్మించారు. ప్రెసర్ మెయిన్స్కు సంబంధించి 4 కిలోమీటర్ల మేర పైపులు వేశారు. పంప్హౌజ్ నుంచి ప్రెసర్ మెయిన్స్కు నీటిని ఎత్తిపోసి అక్కడి నుంచి కాలువకు నీటిని విడుదల చేస్తారు.
తాజా బడ్జెట్లో రూ.289.69 కోట్లు
లోయర్ పెన్గంగ ప్రాజెక్టుపై చనాక-కొరాట ప్రాజెక్టుతోపాటు భీంపూర్ మండలం పిప్పల్కోటి బ్యాలెన్సింగ్ రిజర్వాయన్ను నిర్మిస్తున్నారు. రూ.281.09 కోట్లతో పిప్పల్కోటి ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చనాక-కొరాట ప్రాజెక్టు, పిప్పల్కోటి రిజర్వాయర్కు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. రూ.289.69 కోట్లను మంజూరు చేసింది. దీంతో చనాక-కొరాట ప్రాజెక్టు, పిప్పల్కోటి రిజర్వాయర్ పనులు పూర్తి కానున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రెండు పంటలు వేసుకునే అవకాశం..
నాకు రెండెకరాల భూమి ఉంది. వానకాలం పత్తి, సోయా పంటలు వేస్తా. యాసంగిలో ఎకరం వరకు శనగ వేస్తా. సాగునీటి సౌకర్యం లేకపోవడంతో చాలా మంది రైతులు ఒక పంటను మాత్రమే వేస్తున్నారు. మా పొలాల నుంచి చనాక-కొరాట ప్రాజెక్టు కాలువ పోతుంది. వాటి నిర్మాణం కూడా పూర్తయింది. ప్రభు త్వం బడ్జెట్లో ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయడంతో మిగతా పను లు త్వరలో పూర్తవుతాయి. దీంతో ఆయకట్టు రైతులు రెండు పంటలు వేసుకునే అవకాశం ఉంటుంది.- గణేశ్, రైతు, కూర , జైనథ్ మండలం
ప్రాజెక్టు నిర్మాణంతో భూములు సస్యశ్యామలం
చనాక-కొరాట ప్రాజెక్టు నిర్మాణంతో ఆదిలాబాద్ రూరల్ మండలం, భీంపూర్, జైనథ్, బేల మండలాల్లోని 51 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. దీంతో ఈ ప్రాంతం భూముల రెండు పంటలతో సస్యశ్యామలంగా మారనున్నాయి. బరాజ్ పనులు పూర్తికాగా పంప్హౌజ్, కాలువల పనులు చివరిదశలో ఉన్నాయి. ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడంతో రైతుల భూములకు త్వరలో సాగునీరు అందనుంది.
– వెంకటేశ్, రైతు, జైనథ్(2ఏడీబీ07డీ)