తెలంగాణ పాటల కెరటం నేలకొరిగింది. తెలంగాణ ఉద్యమం, పునర్నిర్మాణంలో ప్రజల ఆకాంక్షకు నిలువెత్తు పతాకమై ఎగిసిన ఆ గళం ఇక సెలవంటూ మూగబోయింది. తెలంగాణ యువ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ (39) గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన సాయిచంద్కు నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండలో ఫామ్హౌస్ ఉంది. బుధవారం సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ నుంచి ఫామ్హౌస్కు వెళ్లిన ఆయనకు అర్ధరాత్రి గుండెపోటు వచ్చింది. దీంతో చికిత్స నిమిత్తం నాగర్కర్నూల్లోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
సాయిచంద్ మృతి విషయం తెలిసిన సీఎం కేసీఆర్ రంగారెడ్డి జిల్లా గుర్రంగూడలోని సాయిచంద్ స్వగృహానికి వెళ్లి నివాళులర్పించారు. అంతకుముందు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఇతర మంత్రులు సాయిచంద్ భౌతికకాయానికి నివాళులు అర్పించి, కంటతడి పెట్టారు. సాయిచంద్ మరణవార్త విని ప్రముఖులు, రాజకీయ నాయకులు, బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, కళాకారులు గుర్రంగూడలోని ఆయన స్వగృహానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. వనస్థలిపురం సాహెబ్ నగర్లోని శ్మశాన వాటికలో సాయిచంద్ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయగా.. గుర్రంగూడ నుంచి సాగిన అంతిమయాత్రలో ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని కన్నీటి వీడ్కోలు పలికారు. అంతిమ యాత్ర ముందు కళాకారులు ‘సాయిచంద్ అమర్ రహే’ అంటూ నినాదాలు చేస్తూ పాటలతో ఆయన్ని గుర్తు చేసుకున్నారు.
– సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ)