ఎదులాపురం, మే 15: ప్రస్తుతం రోజురోజుకూ సీసీ కెమెరాల ప్రాధాన్యత పెరుగుతున్నది. గ్రామాల్లో నేరాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించేందుకు సీసీ కెమెరాలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఇవి ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుతుండడంతో గ్రామీణ, పట్టణ ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో బిగించుకునేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు పోలీస్ అధికారులు గ్రామాల్లో పర్యటించి ఏర్పాటుపై అవగాహన కల్పిస్తున్నారు. అంతే కాకుండా నేర పరిశోధన వేగంగా పూర్తి చేసేందుకు పోలీసులకు సీసీ కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. గ్రామాల్లో అవసరాలకు అనుగుణంగా ప్రధాన వీధుల సంఖ్యను బట్టి ఏర్పాటు చేసుకునేలా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. కేసుల విచారణలో సీసీలు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
పల్లెల్లో ప్రజలకు అవగాహన
తెలంగాణ పోలీస్శాఖ దేశంలోనే అత్యుత్తమ సేవలు అందిస్తున్నది. ఫ్రెండ్లీ పోలీసింగ్ను అమలు చేస్తున్నది. గతంలో మాదిరిగా కాకుండా ప్రతి కేసు విషయంలో ప్రజలకు సత్వర న్యాయం అందించేలా, వారికి రక్షణ కల్పించేలా కృషి చేస్తున్నది. ఈ క్రమంలో ‘మేము సైతం’ అనే కార్యక్రమం ద్వారా పోలీసు అధికారులు పల్లెలు, తండాల్లో పర్యటిస్తూ సీసీ కెమెరాల ఆవశ్యకతను వివరిస్తున్నారు. గ్రామాన్ని బట్టి ఎన్ని కెమెరాలు అవసరమవుతాయి, కంట్రోల్ యూనిట్ ఎక్కడ ఏర్పాటు చేయాలి అనే అంశాలపై వారికి వివరిస్తున్నారు. ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమంటూ కేసుల ఛేదనలో వాటి ప్రాముఖ్యాన్ని ప్రజలకు లోతుగా వివరించారు. దీంతో ఆదిలాబాద్ రూరల్ పరిధిలో మొత్తం 30 సీసీ కెమెరాలు, కంట్రోల్ యూనిట్ను ఏర్పాటు చేసి వాటిని పోలీస్ స్టేషన్లోని కంట్రోల్ యూనిట్కు లింక్ చేశారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల పలు కేసుల్లో సీసీ కెమెరాల సాయంతో నిందితులను పట్టుకున్నారు. ముఖ్యంగా దొంగతనాలు, ర్యాగింగ్ నివారణలో ఉత్తమంగా పనిచేస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు.
పరిశోధన, నియంత్రణలో కీలకం
నేర పరిశోధన, నియంత్రణలో సీసీ కెమెరాల ప్రాధాన్యం పెరిగింది. దొంగలు, దోషులను పట్టుకోవడంలో మార్గం సుగమం అవుతున్నది. ప్రస్తుతం పల్లెల్లోనూ సీసీ కెమెరాలు పెడుతున్నారు. గతంలో దొంగతనాల పరిశోధన కొంత ఇబ్బందికరంగా ఉండేది. ఇప్పుడు సీసీలు ఉన్న ప్రాంతాల్లో చోరీలు తగ్గుముఖం పడ్డాయి. సీసీ ఫుటేజీల ద్వారా దోషులను గుర్తించి, గంటల వ్యవధిలోనే పట్టుకోగలుగుతున్నాం. ఎస్పీ ఉదయ్కుమార్, డీఎస్పీ ఉమేందర్ ఆదేశాల మేరకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రజలు తమ వీధుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలి. నేర నియంత్రణ, రక్షణ కల్పించేందుకు మాకు ప్రజలు సహకరించాలి.
– బీ రఘుపతి, సీఐ, ఆదిలాబాద్ రూరల్.